ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ అంటే…. లీడర్ల చుట్టూ తిరగాలి…. హైకమాండ్ ఆశీస్సులు దక్కించుకోవాలి…. ఇక పరిస్థితుల్ని, పోటీని బట్టి పార్టీ ఫండ్ పేరుతో ఇవ్వాల్సింది ఇచ్చుకోవాల్సి ఉంటుంది కూడా. కానీ… ఆ పార్టీ మాత్రం మా రూటే సపరేట్ అంటోంది. టిక్కెట్ మేం ఇవ్వడం కాదు, కావాల్సిన అర్హతలు మీరే సంపాదించుకోండని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. గల్లీ లీడర్ల ఎంపికలో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతోంది. ఇంతకీ… ఏంటా ట్రెండ్? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం చూశాం… ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం చూశాం. కానీ….. రాజకీయాల్లో ఒక కార్పొరేటర్ సీటు కోసం పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నామా? ఎస్… కచ్చితంగా ఎవ్వరూ విని ఉండరు. కానీ.. మొట్ట మొదటిసారి మజ్లిస్ పార్టీ ఆ ప్రయోగం చేస్తోంది. తన కంచుకోట హైదరాబాద్ పాత బస్తీలోనే కొత్త ట్రెండ్కు తెర తీసింది ఎంఐఎం. లాస్ట్ మినిట్ నిర్ణయాలు తీసుకుని, హడావిడి పడి ఎవరో ఒకరికి టిక్కెట్ ఇచ్చి… చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా… ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల వేట మొదలుపెట్టింది.
మా రూటే సపరేట్ అంటూ… పాతబస్తీ పతంగి పార్టీ! చేస్తున్న పని ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ పాతబస్తీ అంటేనే ఎంఐఎం కంచుకోట. ముస్లిం సామాజిక వర్గానికి తామే రక్షణ కవచమని చెప్పుకునే మజ్లిస్ పార్టీ… ఇప్పుడు దేశవ్యాప్తంగా పావులు కదుపుతోంది. ఎక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉంటే అక్కడ వాలిపోతూ… ప్రధాన పార్టీల గెలుపోటములను శాసిస్తోంది. అయితే, త్వరలో జరగబోయే పాత జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికల కోసం ఈసారి సరికొత్త ఎత్తుగడ వేసింది. ఎప్పుడూ పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాం వేదికగా, పెద్దల ఆశీస్సులతోనే ఖరారయ్యే టికెట్లు… ఈసారి మాత్రం పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా దక్కబోతున్నాయి. అయితే… దీని వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు.
“కార్పొరేటర్ టిక్కెట్ కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోండి” అంటూ తమ సొంత పత్రికతో పాటు అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ నోటిఫికేషన్ ఇవ్వడం… పొలిటికల్ సర్కిల్స్ను ఆశ్చర్య పెడుతోంది. అయితే… దీని వెనుక అసలు కథ వేరే ఉందట. పాతబస్తీలో చాలా కాలంగా ఒకే లీడర్ ఏళ్ల తరబడి కార్పొరేటర్లుగా కొనసాగుతుండటంతో… స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఎంఐఎం అధిష్టానం గుర్తించింది. దానికి తోడు యువతలో కూడా అసంతృప్తి పెరుగుతోందట. అందుకే, పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే క్రమంలో… ఈ ఓపెన్ నోటిఫికేషన్ ఆప్షన్ ఎంచుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. క్లీన్ ఇమేజ్ ఉండి, చదువుకున్న యువతను బరిలోకి దించి… క్లీన్ స్వీప్ చేయాలన్నది పతంగి పార్టీ ప్లాన్గా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న కొందరు సీనియర్ల ఆశలు గల్లంతు అవుతాయని అంటున్నారు. వాళ్ల సంగతి ఎలా ఉన్నా…. అధినాయకత్వం మాత్రం… పారదర్శకత కోసమే ఈ నిర్ణయం అని క్లియర్గా చెబుతోంది. ఏది ఏమైనా… కార్పొరేటర్ అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం అనేది… ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అవుతోంది. ఈ కొత్త స్ట్రాటజీ మజ్లిస్ పార్టీకి మైలేజ్ ఇస్తుందా… లేక రెబల్స్ పుట్టుకొచ్చేలా చేస్తుందా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నే. ఈ సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయడం అధినాయకత్వానికి కత్తిమీద సామేనంటున్నారు. ఫైనల్గా పాతబస్తీ పతంగి… ఈ కొత్త గాలితో ఎటువైపు ఎగురుతుందో చూడాలి మరి.
