Off The Record: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి…రెండేళ్ళయింది. 164 సీట్ల… బంపర్ మెజార్టీతో తిరుగులేని విధంగా కుర్చీలో కూర్చుంది కూటమి. ఆ దెబ్బకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గల్లంతైంది. కోలుకోలేని దెబ్బ తీశామంటూ సంబరపడ్డారు కూటమి పార్టీల నాయకులు. కానీ….అసలు ట్విస్ట్ అక్కడే ఉందన్నది ఏపీలో లేటెస్ట్ పొలిటికల్ టాక్. తొక్కేశాం, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేశాం…అంటూ జబ్బలు చరుచుకుంటున్న కూటమి పార్టీల నాయకులు…. ఇప్పుడసలు వైసీపీ చేస్తున్న కార్యక్రమాలకు ఎందుకు స్పందిస్తున్నారన్నది చాలా మందికి వస్తున్న డౌట్. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా… ఈ తరహా చర్చలు అధికార పక్షంలోనే ఎక్కువగా జరుగుతున్నాయట. ప్రతిపక్ష హోదా లేకపోయినా…వైసీపీ చేసే కార్యక్రమాలకు వెంటనే స్పందించడం హాట్ టాపిక్గా మారుతోంది. ఈ రెండేళ్ళలో వైసీపీ నిర్వహించిన ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా… ఇదే తరహాలో కనిపిస్తోందని, అక్కడికేదో వాళ్ళు చెబితేనే మనం చేశామన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతోందన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి కూటమి వర్గాల్లో. మెడికల్ కాలేజీల పీపీపీ విధానం, ఆక్వా రైతులకకు గిట్టుబాటు ధరల్లాంటి వాటిపై తాము రోడ్డెక్కాకనే ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ వచ్చిందన్నది వైసీపీ నేతల మాట. ఇక తాజాగా కృష్ణలంక సాయి కృష్ణ ఎపిసోడ్లోనూ ఇంతేనని అంటున్నారు. దీంతో…..మనం వైసీపీ ట్రాప్లో పడుతున్నామా అంటు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. టీడీపీలోగాని,. కూటమిలోగాని…. నాయకులు ఎవరు మాట్లాడినా… వారి నోటి నుంచి ముందు వచ్చే పేరు జగన్ అని, సభ అయినా.. సమీక్ష అయినా.. ప్రభుత్వ సమావేశం అయినా… జగన్ పేరుతోనే మొదలవడం మనకే కరెక్ట్ కాదేమోనని కూటమి ఇన్నర్ సర్కిల్స్లో బాగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల ముందు చేసిన ప్రచారాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని,
కానీ… ఇక్కడే మా వాళ్లు అసలు లాజిక్ మర్చిపోతున్నారన్నది కొందరి అభిప్రాయం. పదే పదే జగన్ పేరు ప్రస్తావనతో… అసలు ఈ రెండేళ్ళలో మనం ఏం చేశామో సరిగా చెప్పుకోలేకపోతున్నామని కూడా కొందరు అంటున్నారట. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా జగన్ చేసిన హెచ్చరిక ప్రభావం ఏ స్థాయిలో పని చేసిందో చూశారుగా అంటూ గుర్తు చేస్తున్నారు. జగన్ వార్నింగ్ తర్వనాత మెడికల్ కాలేజీల కోసం ఒక్కరు కూడా…. టెండర్ దాఖలు చేయలేదని, అదే సమయంలో ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానం గురించే మాట్లాడుతోందని అంటున్నారు. ఇక మెగా డీఎస్సీ విషయంలో ఉద్యోగం రానివారి సానుభూతి పొందేలా విపక్ష నేత వ్యవహరించారని, ఉద్యోగం రాని వారిని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వంలో స్కాం జరిగిందన్నట్టుగా కార్యక్రమాలు నిర్వహించినా సరిగా కౌంటర్ చేసుకోలేకపోయామన్న చర్చలు కూటమి వర్గాల్లో నడుస్తున్నాయట. అధికారులు మినహా.. కూటమిలో ముఖ్య నేతలు ఎవరూ డీఎస్సీ మీద వచ్చిన ఆరోపణల్ని దీటుగా ఖండించలేదు. మంత్రులు సవాల్ చేయటం మినహా… అక్రమాలు జరగలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయాకపోయామని అంటున్నారు. ఇదే అదనుగా భావించిన జగన్… డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారంటూ విశ్లేషిస్తున్నారు. అసలు సరైన అజెండా లేకుండా మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ గాల్లో బాణాలు వేస్తే… సరైన సమయంలో సక్రమంగా స్పందించకుండా మనమే చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దది చేసుకున్నామన్న చర్చ కూడా కూటమి పార్టీల్లో జరుగుతోందట. ఇక.. ఆక్వా రైతుల తనను కలిసిన సమయంలో కూడా జగన్ అల్టిమేటం జారీ చేశారు. జులై 1 నాటికి సమస్య పరిష్కారం కాకుంటే తానే నిరసనలకు దిగుతానని హెచ్చరించారు. ఆ తరువాత ప్రభుత్వం స్పందించింది. ఫీడ్ వ్యాపారులతో సమీక్షించి ధరలు తగ్గించాలని సూచించింది.
దాంతో… అది తమ క్రెడిటేనని ప్రచారం చేసుకుంటున్నారు వైసీపీ నాయకులు. మరోవైపు ముఖ్యమంత్రి చెప్పినా… ఫీడ్ కంపెనీలు ధరలు తగ్గించలేదన్న వాదన సైతం ఉంది. అదే జరిగితే నిరసన చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారట. ఇక దాని తర్వాతి ఎపిసోడ్ విజయవాడలో సాయిక్రిష్ణ అదృశ్యం. ఆ విషయంలో జగన్ వేగంగా స్పందించారు. ఈ అంశం బయటకు వచ్చినవెంటనే…. ప్రభుత్వం సీరియస్గా స్పందించలేదు. సాయికృష్ణ రౌడీ షీటర్ అని, వైసీపీ మద్దతు ఇస్తోందంటూ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ… ఒక్క సారిగా ఈ వ్యవహారం కులాల కోణంలోకి వెళ్ళింది. కాపు యువకుడిని పోలీసులు మాయం చేశారంటూ….వైసీపీ అధ్యక్షుడు వెంటనే సాయిక్రిష్ణ ఇంటికి వెళ్లి… అతని తల్లిని పరామర్శించారు. ఆ వెంటనే…. సీఎం చంద్రబాబు సాయిక్రిష్ణ తల్లి, ఇతర కుటుంబ సభ్యుల్ని పిలిపించుకుని మాట్లాడి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో…. అప్పటి వరకు రౌడీ షీటర్కు మద్దతిస్తారా అంటూ జగన్ను ప్రశ్నించిన కూటమి వర్గాలు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డాయన్న విశ్లేషణలు మొదలయ్యాయి.ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా స్పందించక తప్పని పరిస్థితిని వైసీపీ కల్పించిందన్న చర్చలు నడుస్తున్నాయి. ఇలాంటి ఉదాహరణలనే చెబుతూ…. అధికారంలో ఉండి, జగన్కు అవకాశం లేకుండా చేయాల్సిన అంశాల్లో కూడా… ఆయన ట్రాప్లో చిక్కుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోందట. ప్రతి విషంలోనూ… జగన్ ఏదో ఒక ప్రకటన చేయడం, ఆ తర్వాతే పరిష్కారంపై దృష్టి పెట్టడం చూస్తుంటే… మాకు వైసీపీ అజెండా ఫిక్స్ చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు కూటమిలోని కొందరు నాయకులు.

