Site icon NTV Telugu

Off The Record: ఆ నియోజకవర్గంలో దారుణంగా వైసీపీ పరిస్థితి!

Undi Otr

Undi Otr

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఫ్యాన్ గాలి రివ్వు రివ్వున వీచిన రోజుల్లో కూడా ఇక్కడ చడీ చప్పుడు లేదు. ఇప్పుడైతే ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగా ఉంది… ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి.పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ గెలవడం సంగతి పక్కనబెడితే….. కనీసం కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నాలు కూడా జరగట్లేదని అంటున్నారు. అసలు ఉండిలో వైసీపీ బతికే ఉందా అనే అనుమానాలు పెరుగుతున్నాయట ఆ పార్టీ కేడర్‌లోనే. గెలుపు సంగతి తర్వాత… కనీస ప్రభావం కూడా చూపలేకపోతున్నామంటూ ఇక్కడి వైసీపీ అభిమానుల్లో అసహనం పెరుగుతోంది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు అధిష్టానం ఇన్ఛార్జ్‌లను మారుస్తున్నా… నియోజకవర్గంలో పార్టీ జాతకం మాత్రం మారడంలేదని అంటున్నారు మిగిలి ఉన్న కొద్దిమంది నాయకులు. ఈ టీడీపీ కంచుకోటలో పాగా వేసేందుకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రయోగాలు కూడా ఏ మాత్రం ఫలించలేదు. ఇక ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేనిటైంలో పరిస్థితి ఏంటని వాళ్ళలో వాళ్ళే చర్చించుకుంటున్నారట. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక్క 2004లో మినహా ఇంకెప్పుడూ ఆ పార్టీ ఉండిలో ఓడిపోలేదు. అలాంటి చోట విజయం సాధించేందుకు వైసీపీ అధిష్టానం పన్నుతున్న వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయి.

చివరికి 2019 వైసీపీ సునామీలో సైతం ఇక్కడ ఫ్యాన్‌ తిరగలేదు. అలాంటి చోట పార్టీ పెద్దలు ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారేగానీ… స్థానిక పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నం మాత్రం చేయడం లేదన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాంతో… ఇప్పుడు క్యాడర్ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని అంటున్నారు. నియోజకవర్గంలో పార్టీకోసం పనిచేసిన వారికి అధికారంలో ఉన్నప్పుడు గుర్తింపు ఇవ్వకపోవడం, ఇన్ఛార్జ్‌గా ఉన్న పివిఎల్ నరసింహరాజు క్యాడర్‌ గురించి ఆలోచించకపోవడం లాంటి కారణాలతో ఉండి వైసీపీ దాదాపు ఖాళీ అయ్యే స్థితిలో ఉందని అంటున్నారు ఇక్కడి నాయకులు. ఉండిలో క్షత్రియ ఆధిపత్యమే కొనసాగుతూ ఉండటంతో… అదే సామాజిక వర్గానికి చెందిన నేతల్ని నమ్ముకుంటోంది వైసీపీ. అయినాసరే… ఇప్పటిదాకా అంతో ఇంతో కూడా ప్రభావం చూపలేకపోతోందన్నది విస్తృతాభిప్రాయం. బలపడాల్సిన పార్టీ నరసింహరాజు వ్యవహారశైలి కారణంగా దిగజారిపోతుందనే విమర్శలున్నా… పార్టీ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది.

అధికారంలో ఉన్నపుడే ప్రభావం చూపలేకపోయిన నరసింహరాజు… ఇక ఓటమి తర్వాత మరీ… నల్లపూస అయిపోయారంటూ గగ్గోలు పెడుతున్నాయి పార్టీ వర్గాలు. ఇంత జరుగుతున్నా… కొత్త ఇన్ఛార్జ్‌ గురించి పెద్దలు ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నిస్తోంది కేడర్‌. గతంలో ప్రత్యర్ధిపార్టీని దెబ్బకొట్టే అవకాశాలు వచ్చినా…. ఒక్క సందర్భంలో కూడా ఉపయోగించులేకపోయిన స్థితిలో ఇక ఇక్కడ రాజకీయ మనుగడ ఉంటుందా అన్న అనుమానంతో కొందరు మెల్లిగా చాప చుట్టేస్తున్నారట. ఇన్ఛార్జ్‌ పివిఎల్ అంటే నమ్మకం ఉన్నవారికంటే ఆయన్ని వ్యతిరేకించేవారే ఎక్కువైనట్టు తెలిసింది. పోనీ…. అంతా కోరుకుంటున్నట్టు కొత్త వారికే అవకాశం ఇద్దామని పార్టీ పెద్దలు అనుకుంటున్నా…లోకల్‌గా ఆ స్థాయిలో పనిచేసే నాయకుడు దొరకడం లేదట. గతంలో మూడు సార్లు ఇన్ఛార్జ్‌లను మార్చినట్టే మార్చి తిప్పితిప్పి మళ్ళీ నరసింహరాజు చేతికే పగ్గాలిచ్చారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అటు అధిష్టానానికి, ఇటు కేడర్‌కు కూడా పాలుపోవడం లేదట. దీంతో ఉండిలో వైసీపీ ఉన్నట్టా.. లేనట్టా.. అంటూ పార్టీ వర్గాల్లోనే చర్చలు జరుగుతున్నాయి. కూటమిలో నాయకులు ఒకరితో ఒకరు పోటీపడి పనిచేస్తుంటే….. మేం మాత్రం నాయకుడినే వెదుక్కునే దశలో ఉన్నామని అంటున్నారు లోకల్‌ వైసీపీ కార్యకర్తలు. ఉండి పరిస్థితిని మెరుగుపరిచేందుకు భవిష్యత్తులో పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

Exit mobile version