Site icon NTV Telugu

Off The Record: ఆ ఎమ్మెల్యే మీద సొంత కేడర్ ఫైర్..

Otr Mla Bn Vijay Kumar

Otr Mla Bn Vijay Kumar

Off The Record: ప్రకాశం జిల్లా సంత‌నూత‌ల‌పాడు టీడీపీ ఎమ్మెల్యే బీఎన్ విజ‌య్ కుమార్‌పై సొంత పార్టీ నేత‌లే ఓ రేంజ్‌లో ఫైరవుతున్నారట. ఆయన అసలు మా పార్టీ నుంచే గెలిచారా అన్న డౌట్‌ వస్తోందని కూడా కొందరు హాటు ఘాటు కామెంట్స్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.పార్టీని అంటిపెట్టుకుని ఉండి, గెలుపు కోసం క‌ష్టప‌డిన త‌మ‌కు కాకుండా…. ఎన్నిక‌లకు ముందు జంప్‌ కొట్టిన వారికి, ఎలక్షన్‌ త‌ర్వాత వ్యక్తిగ‌త అవ‌స‌రాల కోసం ద‌గ్గరైన వాళ్ళకే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని వదలకుండా ఆస్తులు అమ్ముకుని రాజ‌కీయాలు చేసిన త‌మ‌ను కాద‌ని ఎమ్మెల్యే విజ‌య్ కుమార్….. గ‌త ప్రభుత్వంలో అన్నీ అనుభవించిన వారికే తిరిగి ప్రాధాన్యం ఇస్తున్నార‌న్నది ప్రధానమైన ఆరోపణ. సంతనూతలపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఇక్కడ మరోసారి పార్టీ జెండా ఎగరడానికి పాతికేళ్ళు పట్టింది. 1999 త‌ర్వాత 2024 ఎన్నిక‌ల్లో మాత్రమే ఎస్‌ఎన్‌పాడులో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా కొట్టాలంటూ గత ఎన్నికల్లో కేడర్‌ కసిగా పని చేయడం, వైసీపీ చివ‌రి నిమిషంలో అప్పటి వ‌ర‌కూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీజేఆర్ సుధాక‌ర్ బాబును మార్చి వేమూరు నుంచి మాజీ మంత్రి మేరుగు నాగార్జున‌ను పోటీకి పెట్టడం లాంటి పరిణామాలన్నీ విజయ్‌కుమార్‌కు కలిసి వచ్చాయి.

సంత‌నూత‌ల‌పాడు నుంచి 2009లో తొలిసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు విజ‌య్ కుమార్. ఆ తర్వాతి పరిణామాలతో 2014 ఎన్నిక‌ల స‌మయానికి టీడీపీ చేరి అప్పుడు, ఆ తర్వాత 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడారు. అప్పుడు ఆయన ఓటమికి ద్వితీయ శ్రేణి నేత‌ల‌తో క‌లుపుగోలుగా ఉండ‌కపోవ‌టం కూడా ఓ కార‌ణమని టీడీపీ నేతలే అంటారు. 2024కు వచ్చేసరికి కొన్ని తప్పుల్ని సరిదిద్దుకోవడంతోపాటు కార్యకర్తలు కూడా విభేదాలను పక్కనపెట్టి పనిచేయడంతో 30 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. కానీ… గెలిచాక సార్‌ మళ్లీ మారిపోయారన్నది సంతనూతలపాడు టీడీపీ కేడర్‌ వాయిస్‌. ఎమ్మెల్యే త‌మ‌ను పూర్తిగా ప‌క్కన పెట్టేశార‌ని ఫైర్ అవుతున్నార‌ు తమ్ముళ్లు. ప‌నులు చేసిపెట్టే సంగ‌తి అటుంచితే ఆయ‌న అస‌లు త‌మ ముఖం కూడా చూడ‌టం లేద‌ని, క‌నీస గౌర‌వం కూడా ఇవ్వటం లేద‌న్న ఆవేద‌న వ్యక్తమవుతోంది. పైగా…. పుండు మీద కారం చల్లినట్టు వైసీపీ హ‌యాంలో కీల‌కంగా వ్యవ‌హ‌రించిన వాళ్ళనే చుట్టూ పెట్టుకుంటూ… త‌మ‌కు ప్రాధాన్యత ఇవ్వటం లేద‌ని ఆరోపిస్తోంది టీడీపీ ద్వితీయ శ్రేణి. అదిపోను సొంత పార్టీలే స్వయంగా ఎమ్మెల్యేనే గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారన్నది ఇంకో ఆరోపణ. అందుకు నాగులుప్పలపాడు మండలంలో జరిగిన ఓ ఘటననే ఉదహరిస్తున్నారు చాలా మంది. ఇక్కడ రెండు వర్గాలను ప్రోత్సహించటం వ‌ల్లే… గ్రూప్‌ వార్‌ పెరిగిపోయి మాజీ ఎంపీపీ, పార్టీ ముఖ్యనేత వీర‌య్య చౌద‌రి హ‌త్యకు దారి తీసిందని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గం మొత్తం ఇలాంటి దారుణమైన పరిస్థితులు తలెత్తుతున్నా… ఎమ్మెల్యేలో మాత్రం మార్పు రావడం లేదన్న చర్చ టీడీపీ వర్గాల్లోనే జరుగుతోంది. నాగులుప్పలపాడు మండలంలో కూడా…వైసీపీ నుంచి వ‌చ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం వ‌ల్లే… స్థానికంగా ఎప్పుడూ లేని విధంగా హ‌త్యా రాజ‌కీయాలు మొదలయ్యాయన్నది కార్యకర్తలు ఆవేదన. 2014 టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే తన ప‌క్కన పెట్టుకున్న వాళ్లంతా 2019కి వ‌చ్చేసరికి తిరిగి వైసీపీ వైపు చేరి తమను ఇబ్బంది పెట్టారని అంటోంది కల్ట్‌ టీడీపీ కేడర్‌.

2024 ఎన్నిక‌ల స‌మయానికి గాలి వాటాన్ని బ‌ట్టి వాళ్ళే తిరిగి టీడీపీకి గూటికి చేరితే… ఇప్పుడు ఎమ్మెల్యే విజ‌య్ కుమార్ వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇప్పుడు మా సంగతేంటని అడుగుతున్నారు. నామినేటెడ్ పదవులు సైతం కష్టకాలంలో అండగా ఉన్నవాళ్ళకు కాకుండా… ఇంపోర్టెడ్ లీడ‌ర్స్‌కే ఇచ్చుకుంటున్నారని ఫైరవుతున్నారు తమ్ముళ్ళు. మ‌రీ ముఖ్యంగా గ‌త ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న నేత నియోజ‌క‌వ‌ర్గంలో…. అంతా తామై న‌డిపిన వారిని ఇక్కడ‌కు తీసుకువ‌చ్చి పెత్తనాలు చేయిస్తున్నారని, నాలుగు మండ‌లాల్లో రెండు ద‌శాబ్దాలుగా టీడీపీ కోసం నిల‌బడ్డ అస‌లైన కార్యక‌ర్తల‌కు, నేత‌ల‌కు మాత్రం న్యాయం చేయ‌టం లేద‌ని వాపోతున్నారు. అయితే ఎమ్మెల్యే స‌న్నిహితుల వ‌ర్షన్ మాత్రం మ‌రోలా ఉంద‌ట.. 2014, 19 ఎన్నిక‌ల్లో దాదాపు 10 వేల ఓట్ల తేడాతో ఓడిన విజ‌య్ కుమార్ గ‌త ఎన్నిక‌ల్లో 30 వేల‌కు పైగా మెజారిటీతో గెలిచార‌ని గుర్తు చేస్తున్నార‌ు. అన్ని వర్గాలు ఓట్లు వేయ‌టం వ‌ల్లే అంత విజ‌యం సాధ్యమైంద‌ని, అందుకే విజ‌య్ కుమార్ అంద‌రికీ ప‌నులు చేస్తున్నారన్నది వాళ్ళ వాదన. పైగా గ‌తంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పార్టీలోని ఏ సామాజిక‌వ‌ర్గ నేత‌లైతే పావులు క‌దిపారో ఇప్పుడు వారే టార్గెట్ చేస్తున్నార‌ంటూ కొత్త వాదనను తెర మీదికి తీసుకువస్తున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో ఎమ్మెల్యే అనుకూల‌, వ్యతిరేక వ‌ర్గాల మ‌ధ్య గ్రూప్ పాలిటిక్స్ పెరిగిపోతున్నాయంటున్నారు. టీడీపీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని సెట్‌ చేయకుంటే…. పార్టీ పరువు సంతనూతలపాడు వీధుల్లో పోవడం ఖాయమని ఘాటుగానే అంటున్నారు సానుభూతిపరులు.

Exit mobile version