Off The Record: ఉమ్మడి ప.గో. జిల్లాలో కూటమి కుమ్ములాటలు

  • ఉమ్మడి ప.గో. జిల్లాలో కూటమి కుమ్ములాటలు..
  • త్యాగాలు, సహకారాలు అంటూ కాలర్లు ఎగరేస్తున్న నేతలు..
  • తాడేపల్లిగూడెం, భీమవరం, ఉంగుటూరులో ఎవరికి వారే..
  • గూడెంలో జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు..
  • వలవల బాబ్జీ వైఖరిపై ఎమ్మెల్యే బొలిశెట్టి అసంతృప్తి..
  • ఉంగుటూరులో గన్ని వర్సెస్‌ పత్సమట్ల..
  • మట్టి తవ్వకాలు, మద్యం వ్యాపారం విషయంలో విభేదాలు?..
  • భీమవరంలో ఎమ్మెల్యే పులపర్తి ఎవ్వర్నీ పట్టించుకోవడం లేదా?..
  • పేకాట క్లబ్బులు, అవినీతిపై రెండు పార్టీల పెద్దలకు ఫిర్యాదులు..
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం పడుతుందన్న ఆందోళన..
  • ప్రత్యర్థులకంటే ముందు మనోళ్ళే ఓడిస్తారంటూ కామెంట్స్‌..
Otr West Godavari Nda

Otr West Godavari Nda

Off The Record: 2014, 2024 ఎన్నికల్లో టీడీపీ, కూటమి పార్టీలకు వన్‌సైడ్ విజయాన్ని అందించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం సీన్ కాస్త తేడాగా కనిపిస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు వరకు కలిసి పనిచేసిన నేతలంతా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుమ్ములాటల మీదే దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. మా త్యాగాల వల్లే మీరు ఎమ్మెల్యేలు అయ్యారంటూ టీడీపీ ఇన్ఛార్జ్‌లు, అంత లేదు… మా సహకారం వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని జనసేన నాయకులు కాలర్లు ఎగరేస్తూ… మరింత సంక్లిష్టం చేస్తున్నారట. దీంతో…ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పార్టీల నేతల మధ్య సయోధ్య సాధ్యం కావడం లేదని అంటున్నారు. ఒకరిపై ఒకరు అజమాయిషీ చలాయించేందుకు ప్రయత్నాలు చేయడంతో చాలా నియోజకవర్గాల్లో వేరు కుంపట్లు అంటుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంతో పాటు కీలకమైన భీమవరం, ఉంగుటూరులో ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్న తీరు రెండు పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారుతోంది. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు, టిడిపి ఇన్చార్జి వలవల బాబ్జీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. బొలిశెట్టితో కలిసి పనిచేసేందుకు బాబ్జీ ఏ మాత్రం ఆసక్తి చూపకపోవడంతో విభేదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయన్నది కేడర్‌ వాయిస్‌.

ఇదే విషయాన్ని అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యే బొలిశెట్టి బహిరంగ వేదికలపై చెప్పుకొస్తూనే ఉన్నారు. నియోజకవర్గానికి సుప్రీంగా ఉండే ఎమ్మెల్యేని కాదని అధికార యంత్రాంగంతో టిడిపి ఇన్చార్జి సమావేశాలు నిర్వహించడం, వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయడం లాంటివి దూరం పెంచుతున్నాయని అంటున్నారు. ఇక లాభం లేదనుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి అటు టీడీపీ, ఇటు జనసేన పెద్దలకు నియోజకవర్గ పరిస్థితిపై అనేక ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. అటు ఉంగుటూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. టిడిపి ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు మధ్య రాజకీయ వైరం రోజురోజుకీ ముదురుతోందని ఆయా పార్టీల నేతలు చెప్పుకొస్తున్నారు. మట్టి తవ్వకాలు నుంచి మద్యం వ్యాపారం వరకు టిడిపి నేతలు పట్టుబట్టి తమ ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అందుకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్న జనసేనతో దూరం పెరగడం వల్ల ఇక్కడ రెండు పార్టీల్లో అయోమయం గందరగోళం అన్నట్టుగానే ఉందని చెప్పుకుంటున్నారు. మరోవైపు టీడీపీ నుంచి జనసేనలో చేరి విజయం సాధించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తన వర్గానికి తప్ప… రెండు పార్టీల్లోని ఇతరులు ఎవ్వరికీ ప్రాధాన్యత కల్పించకపోవడంతో… కీలక నియోజకవర్గంలోనూ ఎవరి దారి వారిదే అన్నట్టుగా పరిస్థితి తయారైందంటున్నారు. పైగా పేకాటక క్లబ్బుల వ్యవహారాలు, అవినీతి ఆరోపణలతో ఆ రెండు పార్టీలకు జరుగుతున్న డ్యామేజ్ గురించి ఇప్పటికే భీమవరం నేతలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి రియాక్షన్ లేదట. దీనిపై అక్కడి నేతలను అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

×
×
Ad

ఇక్కడ టిడిపితో కలిసి పని చేసేందుకు జనసేన నేతలు ఏమాత్రం సిద్ధంగా లేరని చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో వలస నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వడం లేదన్న అసంతృప్తి తెలుగుదేశంలో పెరుగుతోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. నాయకులు సెట్‌ అవకపోగా… అసంతృప్తి చాప కింద నీరులా వ్యాపిస్తోందన్న అంచనాలు ఉన్నాయి. పైగా బలం నిరూపణ కోసం ఎప్పటికప్పుడు ఎవరికి వారు చేస్తున్న ప్రయత్నాలు పొలిటికల్‌ హీట్‌ని ఇంకా పెంచుతున్నాయి. కూటమి పార్టీలకు కంచుకోటగా ఉండే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రెండేళ్లు గడిచినా… ఈవిధంగా నాయకులు మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందన్న ఆందోళనలు కేడర్‌లో పెరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కీలకమైన పదవుల కోసం టిడిపి, జనసేన నేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు కొనసాగించడం ఆధిపత్య పోరుకు దారితీస్తోందని అంటున్నారు. ఎన్నిక ఏదైనా… పశ్చిమలో పట్టు సాధిస్తే విజయం తమదేనన్న సెంటిమెంట్ అన్ని పార్టీలకు ఉంటుంది. ఇదే సమయంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీల మధ్య సయోధ్య లేకపోవడం చూస్తుంటే రేపు లోకల్‌ బాడీస్‌ ఎలక్షన్స్‌లో ప్రత్యర్థుల కంటే మిత్ర పార్టీల మధ్య యుద్ధమే గట్టిగా జరగవచ్చన్న అంచనాలు సైతం ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట టిడిపి ఇన్చార్జిలు సహకరించకపోవడం, టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేనకు గుర్తింపు లేదంటూ ఆ పార్టీ నేతలు రోడ్డు ఎక్కడం లాంటివి రెండేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల టైంకి అయినా… ఈ వ్యవహారాలు సద్దుమణుగుతాయో.. లేక అసంతృప్తుల సెగతో లేక కూటమికే షాక్‌ తగులుతుందోనన్న ఆందోళనలు మాత్రం అలాగే ఉన్నాయి.