Site icon NTV Telugu

Off The Record: మీనాక్షి నటరాజన్ సమన్వయం చేయలేకపోతున్నారా?

Otr Meenakshi Natarajan

Otr Meenakshi Natarajan

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో అందరూ పెద్దలే. ఇక సీనియర్స్‌కు కొదలే లేదు. పదవుల కోసం పోటీ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఢిల్లీలో పరపతి విషయానికొస్తే… తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఏఐసీసీ ఆఫీస్‌లో తలో గాడ్‌ఫాదర్‌ ఉంటారు. అందుకే రాష్ట్ర నాయకులు ఒకరికి తెలియకుండా ఒకరు అధిష్టానం దగ్గర పావులు కదుపుతుంటారు. ఆ క్రమంలో ఒక్కోసారి ఒక్కొక్కరిది పై చేయి అవడం, వెనుకబడ్డవాళ్ళు అలగడం, తర్వాత సర్దుకోవడం…. అబ్బో…పార్టీలో అదో పెద్ద ప్రక్రియ. కాస్త గడుసుగా మాట్లాడే పార్టీ లీడర్స్‌ అయితే… అసలు అది మా కల్చర్‌. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టే అలా ఉంటుందంటూ కవరింగ్‌ ఇచ్చుకుంటూ ఉంటారు. అయితే… అలాంటివన్నీ ముదిరి పార్టీని ఇరకాటంలోకి నెట్టకుండా… అందరితో సమన్వయం చేసుకుంటూ తన ఆలోచనల్ని అప్లయ్‌ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీద ఉంటుంది. కానీ… ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని గాంధీభవన్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రాష్ట్ర నాయకులు వేస్తున్న తాళం ఒకటైతే… ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ పాడుతున్న రాగం మరోలా ఉందట. ఈ విషయంలో ఇన్ఛార్జ్‌కు, రాష్ట్ర నాయకులకు మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని.. చర్చించి పార్టీకి ఏది మంచో దాన్నే ఫైనల్ చేయాల్సిన మేడం…. అసలా రూట్‌లో లేరట. తన మాటే నెగ్గాలన్నట్టుగా ఆమె వ్యవహారశైలి ఉందని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ఆలోచనకు, ఆచరణకు మధ్య అంతో ఇంతో తేడా ఉండటం సహజమేగానీ…. అస్సలు పొంతనే లేకపోవడమే ఇక్కడ అతిపెద్ద విషాదం అని పార్టీ వర్గాలు కాస్త ఘాటుగానే మాట్లాడుకుంటున్నాయి. ఇటీవల DCC అధ్యక్షుల నియామక బాధ్యతల్ని ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలని అనుకున్నారు మీనాక్షి నటరాజన్‌. కానీ… ఓ వైపు నియోజక వర్గం.. మరో వైపు అసెంబ్లీ సమావేశాల బిజీలో ఉండి….. అధిష్టానం ఇచ్చిన గడువులోపు కమిటీలు కూడా వేసుకోలేక పోయారు. చివరికి బ్లాక్ లెవల్ కమిటీల్ని కూడా వేసుకోలేక మళ్ళీ ఇన్ఛార్జ్‌ వ్యవస్థను తెర మీదకు తెస్తున్నారు. దీంతో… ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో అసలు నాయకుల కంటే.. ఇన్ఛార్జ్‌ నేతలే ఎక్కువ అయ్యారు. ట్రైనింగ్ కి ఒకరు. కమిటీలకు ఒకరు, బ్లాక్ కమిటి వేసేందుకు మరొకరు.. ఇలా…మొత్తం వ్యవహారమంతా గజిబిజిగా మారిపోయిందన్న అభిప్రాయం పెరుగుతోంది.

డీసీసీ అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యేల్లో అయితే.. ఆ ఫీలింగ్‌ ఇంకా ఎక్కువగా ఉందట. సామాజిక సమీకరణల కూర్పు ఉండాలని మీనాక్షి నటరాజన్ మంచి ఆలోచనే చేస్తున్నారు. కానీ… ఆ ధ్యాసలోపడి పార్టీని బలోపేతం చేసే నాయకత్వం దిశగా అడుగులు పడటం లేదన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది. రాష్ట్ర ఇన్ఛార్జ్‌గా మీనాక్షి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి…కార్యకర్తలకు, పాత వాళ్ళకే ప్రయారిటీ అని చెప్పుకొచ్చారు. కానీ దాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్న అభిప్రాయం పార్టీలో ఉంది. నామినేటెడ్ పదవుల్లో కనీసం డైరెక్టర్స్‌ నియామకానికి కూడా ఎన్ని ఏళ్ళు పడుతుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. పదవులు ఆశించే వారంతా విసిగిపోయి… చివరికి ఈ పదవి వద్దు.. ఏం వద్దు అనే స్థాయికి అసహనం పెరుగుతోందట. మీనాక్షి నటరాజన్ ఛార్జ్‌ తీసుకున్న కొత్తలో..పార్టీ నేతలకు కొంత హోప్ ఉండేది. ఆమె నూటికి నూరు శాతం పార్టీ మనిషి…కష్టపడిన వాళ్లకు అవకాశం కల్పిస్తారని భావించారు అంతా.. కానీ ఇప్పటి వరకు పూర్తిస్థాయి కమిటీలే కాలేదు. జిల్లా కమిటీలూ అంతే. DCCలను వేశారు..కమిటీలు ఫుల్ ఫిల్ చేయరు. PCCని వేశారు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ని వదిలేశారు. అసలు ఆ పదవులు ఉంటాయో ..? ఉండవో కూడా క్లారిటీ లేదు. పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారని అందరికీ తెలుసు.. కానీ దానికి సొల్యూషన్ మాత్రం కనిపించడం లేదు. అసలు ఉంటుందా ఉండదా అంటూ ప్రశ్నించే వాళ్ళకు పార్టీలో కొదవలేదు. ఇలాంటి సమస్యల్ని అధికార పార్టీ వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకొంటే బెటర్. లేదంటే… అసంతృప్తి పెరిగాక పదవులు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండబోదన్న మాటలు వినిపిస్తున్నాయి రాజకీయవర్గాల్లో.

Exit mobile version