Site icon NTV Telugu

Off The Record: కత్తులు దూశారు.. ఎత్తుకు పైఎత్తులు వేసేవారు.. ఇప్పుడు ఒకే తాటిపైకి..?

Otr Srikakulam Politics

Otr Srikakulam Politics

Off The Record: దశాబ్దాలుగా ఉప్పూ నిప్పులా ఉన్న నేతలు ..మాట మాత్రానికైనా పలకరించని రాజకీయ బడానేతలు. ఎదురు పడ్డా సరే ముఖం తిప్పుకువెళ్లే నేతలు. నేడు ఒక్కతాటిపైకి వస్తున్నారట. పార్టీలు వేరు, సిద్దాంతాలు వేరు కానీ వీరిని ఒకతాటిపైకి వచ్చేలా ఓ అంశం ప్రేరేపిస్తోందన్న చర్చ జరుగుతోంది. అది ఏ పార్టీకి నష్టం లాభం అనేది నేడు చూడకుండా కలసి అడుగులు ముందుకు వేసేలా కార్యాచరణ చాపకింద నీరులా సాగిపోతోంది. మాజీ స్పీకర్, వైసిపి సీనియర నేత తమ్మినేని సీతారాం, మాజీ కేంధ్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిల్లి కృపారాణి, టిడిపి సీనియర్ నేత ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇలా వీరంతా టిడిపి, వైసిపి, కాంగ్రెస్ ఇలా వేరువేరు పార్టీలకు చెందిన నేతలు. దశాబ్దాలుగా కత్తులు నూరుకున్నారు, విమర్శానాస్త్రాలు సంధించుకున్నారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు. కొంతకాలంగా కాళింగులకు జిల్లాలో రాజకీయంగా అన్యాయం జరగుతోందని కులపెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మంత్రి పదవి ఆశించి భంగపడటంతో నాటి నుంచి మరింతగా సామాజిక చైత్యనం కనిపిస్తోంది. బాలి యాత్ర పేరుతో పురాతనంగా సాగిన సాంప్రదాయాన్ని కులపెద్దలు మరింత ఘనంగా నిర్వహించడం, ఈ మధ్యకాలంలో వేలాది మందితో వనసమారాదన కార్యక్రమం , తాజాగా సంక్రాంతి సంబరాలు కాళింగ వేదిక ద్వారా నిర్వహిస్తున్నారు. ఇలా సామాజికంగా సంస్థలు, సంఘాలు కార్యక్రమాలు చేయటం మామూలు విషయమే. కానీ కాళింగ వేదికగా రాజ్యాధికారం కోసం గట్టిగా మాటాడుతుండటం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Read Also: PM Modi and Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని మోడీ అభినందనలు.. కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం..

సిక్కోలు జిల్లాలో ప్రధానంగా కాళింగ, వెలమ, తూర్పు కాపు కమ్యూనిటీలు రాజకీయాలను శాసిస్తుంటాయి. అత్యధికంగా పార్టీ, ప్రభుత్వ పదవులు నిర్వహించింది కూడా ఈ సామాజిక వర్గాలకు చెందిన నేతలే. ఐతే జనాభా దామాషా ప్రకారం కూడా కాళింగులకు సముచిత స్దానం లభించడంలేదన్నది వీరి వాదన. తాజాగా ఒకే వేదిక దగ్గరకు నేతలందరూ రావడాన్ని , ఓరకంగా బలప్రదర్శనగా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ పండితులు. దువ్వాడ , తమ్మినేని , కూన రవికుమార్ వంటి నేతలు తాజాగా అనేక సమావేశాలు , పరామర్శలు , కార్యక్రమాల్లో కూడా కలసి పాల్గొంటుండటం ఆ సామాజిక వర్గంతో పాటు, ఇతర నేతలలో కూడా చర్చకు దారి తీస్తోంది. రాజకీయంగా ప్రతి ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన కాళింగులు, నేడు రాష్ట్ర , కేంద్రమంత్రి వర్గంలో బాబాయ్ అబ్బాయిలు ఉండటంతో ఏం చేయలేని స్దితి నెలకొంది. వివిధ వేదికలపై ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. తమ కాళింగ కులంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు జిల్లాలో జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తుతున్నామని అంటున్నారు.

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది పాత సామెత. కానీ ఇక్కడ భిన్న రాజకీయ నేపథ్యాలతో ఉన్న నేతలు ఒక్కటిగా ఏకం అవుతున్నారు. కలసికట్టుగా ముందుకు వెళ్తున్నారు. కాళింగ నేతలను, ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తూ ఒకే వేదిక తయారుచేస్తున్న ఈ సామాజిక అస్త్రం ఏ టర్న్ తీసుకుంటుందన్నది రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Exit mobile version