Site icon NTV Telugu

Off The Record: చీపురుపల్లి టీడీపీలో పరిస్థితులపై కేడర్ లో కూడా గందరగోళం

Otr Cheepurupalli Tdp

Otr Cheepurupalli Tdp

Off The Record: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీలో ఇప్పుడో డిఫరెంట్‌ వాతావరణం కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడికి ఇష్టం లేకుండా వచ్చి పోటీ చేసి గెలిచారు పార్టీ సీనియర్‌ లీడర్‌ కళా వెంకట్రావు. వాస్తవానికి ఆయనది ఎచ్చెర్ల సెగ్మెంట్‌ కాగా… కూటమి పొత్తుల్లో భాగంగా ఇటువైపు రావాల్సి వచ్చింది. అందుకే… ఇష్టం లేకున్నా… సీటు కావాలి కాబట్టి షిఫ్ట్‌ అయ్యారన్నది అప్పట్లో గట్టిగా వినిపించిన మాట. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ముందు నుంచి పార్టీ తరపున కిమిడి మృణాళిని, తరువాత నాగార్జున వంటి నాయకులు బలమైన పునాదులు వేశారు. వాళ్ళతో తనకు పొసుగుతుందా లేదా అన్న సందేహాలు కళాకు ఉండేవి. అయినాసరే… ఎచ్చర్లను బీజేపీకి కేటాయించడంతో అధిష్టానం ఆయన్ని చీపురుపల్లికి పంపించింది. మొదట్లో వెనుకంజ వేసినప్పటికీ చివరకు అధిష్టానం ఒత్తిడితో బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ క్రమంలో అప్పటిదాకా చీపురుపల్లి టీడీపీలో యాక్టివ్‌గా ఉండి, టిక్కెట్‌ ఆశించిన కిమిడి నాగార్జున తప్పుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలపై మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసిన నాగార్జున తర్వాత పార్టీ పెద్దల జోక్యంతో కామ్‌ అయిపోయారు.

అలాగే.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. చివరకు టీడీపీ విజయం సాధించింది. ఇంతవరకు అన్నీ బాగానే సాగినట్టు కనిపించినా .. అసలు రాజకీయ సమీకరణాలు ఎన్నికల తర్వాత మారిపోయాయట. అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా… చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కళా వెంకట్రావు నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు ప్రారంభించారు. తనతో పాటు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడిని కూడా రంగంలోకి దింపుతున్నారు. పార్టీ పరంగా చేసే ప్రతి కార్యక్రమంలోనూ రామ్ మల్లిక్ నాయుడే ముందుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కళా. దీంతో ఇన్నాళ్ళు సెగ్మెంట్‌లో సైకిల్‌కు కాపు కాసిన నాగార్జున భవిష్యత్తు ఏంటన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఒకప్పుడు లోకల్‌ పార్టీని తనదైన శైలిలో నడిపించిన నాగార్జున ఇప్పుడు పొలిటికల్‌ స్క్రీన్‌ మీద చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి పర్యటనలో కూడా నాగార్జున హాజరు ఉన్నామా లేమా అన్నట్టుగా కనిపించిందని మాట్లాడుకుంటున్నారు. కళా వెంకట్రావు తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి కొడుకు భవిష్యత్తు కోసం గ్రౌండ్ సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

కానీ… అసలు ట్విస్ట్‌ ఇక్కడే ఉంది. తండ్రి ఎంత ముందుకు తోస్తున్నా… రామ్ మల్లిక్ నాయుడు మాత్రం పొలిటికల్‌గా అంత యాక్టివ్‌గా కనిపించడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. పార్టీ కార్యకర్తలతో మమేకం అవలేకపోతున్నారని, ఆయనకు, కేడర్‌కు మధ్య ఇంకా దూరం ఉందని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. మరోవైపు గుర్ల స్టీల్ ప్లాంట్ అంశం కూడా కళా వెంకట్రావుకు మైనస్ అవుతోందన్న చర్చ కూడా నడుస్తోంది. టీడీపీకి బలమైన పట్టున్న గుర్ల మండలంలోనే నెగటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయట. కానీ… ఆయన మాత్రం ఇలాంటి అంశాల్ని పట్టించుకోకుండా… కేవలం వారసుడిని రాజకీయంగా నిలబెట్టడం మీదే దృష్టి పెట్టారని, ఒక రకంగా అది సెల్ఫ్‌గోల్‌ అవుతుందన్న విమర్శలు పెరుగుతున్నాయి.
అటు నాగార్జున మాత్రం ఎక్కడా రియాక్ట్‌ అవకుండా అన్నిటినీ మౌనంగా అబ్జర్వ్‌ చేస్తున్నారట. ఇంకా చెప్పాలంటే ఆయన సరైన సమయం కోసం వేచి చూస్తున్నారన్నది సీనియర్స్‌ మాట. మళ్లీ నియోజకవర్గంలో తాను బలంగా నిలబడేందుకు వ్యూహం రచిస్తున్నట్టు చెబుతున్నారు సన్నిహితులు. ఇద్దరిలో ఎవరన్న విషయమై క్లారిటీ లేకుండా ఈ దాగుడు మూతలాట ఇలాగే కొనసాగితే… నష్టం జరుగుతుందని, ప్రత్యర్థులకు చీపురుపల్లి నియోజకవర్గాన్ని బంగారు బుట్టలో పెట్టి ఇచ్చినట్టేనని అంటున్నారు స్థానిక కార్యకర్తలు. కిమిడి ఫ్యామిలీ డ్రామాలో ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాలి.

Exit mobile version