ఆ ఇద్దరు రాజకీయ సోదరులకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు షాకిచ్చినట్టేనా? ఒక మంత్రి, పార్టీ పరంగా అత్యున్నత స్థానంలో ఉన్న నేత తాము ప్రతిష్టాత్మకంగా భావించిన చోట సత్తా చాటలేకపోయారా? సొంత బలంతో సీట్లో కూర్చోలేక మిత్రులతో మంతనాలు జరుపుతున్న ఆ నాయకులు ఎవరు? అక్కడైనా వారు సత్తా చాటతారా? కాంగ్రెస్ పార్టీలో పరపతి పెంచుకుంటారా? తెలంగాణ కాంగ్రెస్లో ఇద్దరూ పొలిటికల్ బ్రదర్స్. కలిసి మెలిసి పని చేస్తుంటారు. ఒకే సామాజికవర్గం కావడం ఇంకాస్త ప్లస్ అయి అలయ్ బలయ్ అన్నట్టుగా ఉంటుంది ఆ బంధం. అయితే… ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలు ఈ రాజకీయ సోదరులిద్దర్నీ ఇరుకున పడేశాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకరకంగా సవాల్ విసిరాయంటున్నారు. ఇద్దరిలో ఒకరు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే…. మరొకరు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. పొన్నం తన సొంత నియోజక వర్గం.. హుస్నాబాద్ లో మంచి ఫలితాలే సాధించారు. కానీ….ప్రతిష్టాత్మకంగా భావించిన కరీంనగర్లోనే బోల్తా కొట్టింది వ్యవహారం. కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో తనకున్న పరిచయాలతో చివరి మూడు నాలుగు రోజులు అక్కడే ప్రచారం నిర్వహించారు మంత్రి. అలాగే… కరీంనగర్ కార్పొరేషన్ను గెలిచేందుకు.. శాయశక్తులా ప్రయత్నం చేసింది కాంగ్రెస్. కానీ… ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.
సొంతగా మేయర్ సీట్లో కూర్చునే పరిస్థితి లేదు. బీజేపీ సెంటిమెంట్ ముందు హస్తం ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ అవక కేవలం 14 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది ఒక రకంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు మైనస్సేనని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మేజిక్ ఫిగర్కు మూడు సీట్ల దూరంలోకి వచ్చి బీజేపీ ఆగితే… అధికార పార్టీగా కాంగ్రెస్ ఆ దరిదాపుల్లో కూడా లేకపోవడాన్ని ప్రత్యేకంగా చూడాలని అంటున్నారు. ఇక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే…. సొంత జిల్లా నిజామాబాద్ మీద, అందులోనూ ఈ మున్సిపల్ కార్పొరేషన్పై ఎక్కువ ఫోకస్ చేశారు. తన సొంత మున్సిపాలిటీ బింగల్లో అయితే కాంగ్రెస్ జెండా ఎగరేయగలిగారుగానీ….అత్యంత కీలకమైన నిజామాబాద్ కార్పొరేషన్లో మెజార్టీ సాధించలేక పోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సొంత జిల్లాలో కీలకమైన మున్సిపాలిటీలో మేయర్ సీటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ సాధించలేకపోవడం రాజకీయంగా ఆయనకు ఇబ్బందికరమేనన్న వాదన బలపడుతోంది. అయితే…. నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరేసే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఇక్కడ కాంగ్రెస్కు 14, ఎంఐఎంకు 17 సీట్లు వచ్చాయి. BRS తరపున ఒకే ఒక్క కార్పొరేటర్ గెలిచారు. అటు బీజేపీ సింగిల్గా 28 డివిజన్స్ గెలుచుకుంది. దీంతో… కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి పాలక మండలి ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. మహేష్గౌడ్ ఇప్పటికే ఎంఎం పెద్దల్ని సంప్రదించగా… ఇద్దరూ కలిసి నిజామాబాద్లో కాషాయ జెండా ఎగరకుండా చూడాలనుకుంటున్నట్టు సమాచారం. అటు బీఆర్ఎస్ ఒక్క సభ్యుడితో పాటు కాంగ్రెస్ మెంబర్స్ క్యాంప్కు వెళ్ళిపోయారు. ఇక ఎమ్మెల్సీగా తన ఎక్స్ అఫిషియో ఓటు.. కూడా నిజామాబాద్లోనే నమోదు చేసుకున్నారు మహేష్గౌడ్. ఇలా…వోవరాల్గా కాంగ్రెస్ ఎంఐఎం కలిసి బీజేపీకి చెక్పెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
