మంత్రులా…..? వాళ్ళ పర్యటనలా…? అయ్య బాబోయ్.. వాళ్ళూ వద్దు, వాళ్ళ టూర్సూ వద్దు. అందరికీ ఓ పెద్ద దండం రా బాబూ… అని అంటున్నారట కాంగ్రెస్ ఎమ్మెల్యే. వాళ్లు వచ్చినకాడి నుంచి ఏదో ఒక పిచ్చి పంచాయితీ తప్ప ఫలితం ఉండటం లేదని అంటున్నారట. సాధారణంగా మంత్రులు వస్తే అభివృద్ధి పనులు జరుగుతాయనుకుంటారుగానీ… మీరొద్దు నాయనా అని దండం పెడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?
గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి , కార్పొరేషన్ ఛైర్మన్ సరిత మధ్య వర్గపోరు, ప్రోటోకాల్ రగడ సర్వ సాధారణమైపోయింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి… కాంగ్రెస్ కండువా కప్పుకున్నాక వర్గపోరుకు బీజం పడగా…. ఇటీవల నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ సరితాతిరుపతయ్యకు తెలంగాణ షీప్స్ ఆండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పదవి దక్కింది. దీంతో… ఇద్దరి మధ్య తరచు ప్రోటోకాల్ వివాదాలు రేగుతున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో వరుసగా జరిగిన మంత్రుల పర్యటనల్లో ప్రోటోకాల్ పంచాయతీలకు తోడు ఫ్లెక్సీల వివాదాలు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి.
వాటికి సంబంధించి రెండు వర్గాలు బాహాబాహీకి దిగిన సందర్భాలున్నాయి. దీనికి తోడు మంత్రుల పర్యటనల్లో అధికారిక కార్యక్రమాలకు సంబంధించి సరితకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆహ్వానాలు, వేదికపై స్థానాల విషయంలో పెరుగుతున్న విభేదాలు రచ్చకు దారితీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో… మంత్రుల పర్యటనలు అంటేనే…. అయ్య బాబోయ్ మా కొద్దనే పరిస్థితి గద్వాలలో నెలకొందని చర్చించుకుంటున్నాయి రాజకీయవర్గాలు. గద్వాల నియోజకవర్గంలో అంతా తానై అమాత్యుల కార్యక్రమాలు మేనేజ్ చేస్తున్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కానీ…ఇటీవల సమయపాలన లేకుండా మంత్రులు కార్యక్రమాలకుహాజరు కావడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఒక సమయం ఫిక్స్ చేసి అందుకు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు, భారీ జనసమీకరణ చేస్తే…. గంటో, అరగంటో కాకుండా… ఏకంగా నాలుగైదు గంటలు ఆలస్యంగా మంత్రులు కార్యక్రమాలకు అటెండ్ అవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంత్రుప్తితో ఉన్నట్టు సమాచారం.ఇటీవల ఇక్కడ వరుసగా మంత్రుల కార్యక్రమాలు జరగ్గా…. ర్యాలంపాడు ఇందిరమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవానికి మంత్రి పొంగులేటి, ధరూర్లో రోడ్డు నిర్మాణ పనుల శంఖుస్థాపనకు మరో మినిస్టర్ కోమటి రెడ్డి, కుర్తిరావుల చెరువులో సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సియం భట్టి విక్రమార్క హాజరయ్యారు. అక్కడే ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. కానీ… ఈ మూడు కార్యక్రమాల్లోనూ అనుకున్న సమయం కంటే తీవ్ర జాప్యం జరగడంతో పాటు…. ప్రోటోకాల్ వివాదాలు చెలరేగాయి.
వీటన్నిటితో విసిగిపోయిన ఎమ్మెల్యే బండ్ల ఆండ్ టీం… మంత్రుల పర్యటనలు మాకొద్దు బాబోయ్ అనే కాడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి పర్యటనలో ప్రోటోకాల్ విషయంలో అలిగి వెళ్లిపోయారు సరిత. చివరికి మంత్రి ఆమె ఇంటికి వెళ్ళి సర్ది చెప్పాల్సి వచ్చింది. ఈ పరిణామంపై ఎమ్మెల్యే బండ్ల వర్గం గుర్రుగా ఉందట. అన్ని వ్యయ ప్రయాసలకోర్చి తాము కార్యక్రమం చేపడితే, ప్రోగ్రాం దగ్గర సరిత హడావిడి ఏంటని ప్రశ్నిస్తోంది. శిలాఫలకాలపై పేరు పెట్టాలనేదానికి సంబంధించి ఏమైనా జీవో ఉందా అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే అనుచరులు.
ఇక ఇదే సమయంలో కుర్తిరావుల చెరువు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలోనూ సరిత భర్త తిరుపతయ్య చేసిన గొడవనూ తప్పుబడుతోంది ఎమ్మెల్యే టీం. ఇక ఇదే సమయంలో అన్ని నియోజక వర్గాల్లో కార్పొరేషన్ చైర్మన్స్కు ప్రోటోకాల్ ఇస్తుండగా … గద్వాలలో మాత్రమే ఇలాంటి సమస్య ఎందుకని ప్రశ్నిస్తోంది సరితా అండ్ టీం. కావాలనే ఎమ్మెల్యే కనుసన్నల్లో అధికారులు ఇలా చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే గద్వాలలో పోటీ కారణంగా తమ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం … విడవమంటే పాముకు కోపం అన్నట్టు మారిపోయిందని అంటున్నారు అధికారులు. వర్గపోరుతో ఎప్పుడు ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయోనంటూ వీఐపీ టూర్స్ అంటేనే… అదనపు బలగాలతో బందోబస్త్ నిర్వహిస్తున్నారు.

