కేరళంలో యూడీఎఫ్ విజయంలో కీలక పాత్ర పోషించిన పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ సీఎం పీఠంపై కూర్చున్నారు. వీడీ సతీశన్తో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ ఆర్లేకర్. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగగా.. కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్, భట్టి హాజరయ్యారు. ఇంతకీ ఎంతోమందిని కాదనుకోని సీఎంగా సతీశన్కే కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు ఛాన్స్ ఇచ్చింది? కేసీ వేణుగోపాల్ లాంటి స్ట్రాంగ్ పర్సన్ను కాదని…ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఎందుకు వీడీ సతీశన్ వైపు మొగ్గు చూపారు? అసలు ఎవరీ సతీశన్? 
ఎవరీ సతీశన్?
వీడీ సతీశన్…నిన్న మొన్నటి వరకు ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేత. ఇకపై కేరళం ముఖ్యమంత్రి. కేరళ రాజకీయాల్లో స్వయంకృషితో.. సైద్ధాంతిక నిబద్ధతతో ఎదిగిన అరుదైన నాయకుడిగా వీడీ సతీశన్ పేరును అందరూ చెబుతారు. ఎర్నాకులంలో పుట్టి పెరిగి… సోషల్ వర్క్లో మాస్టర్స్ చేసి.. ఆ తర్వాత కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి.. చివరకు రాజకీయ నాయకుడిగా అవతరించారు వీడీ సతీశన్. మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా పనిచేయడం ద్వారా ఆయన విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
సతీశన్ రాజకీయ ప్రస్థానంలో అత్యంత విశేషమైన అంశం ఆయన ఎన్నికల రికార్డు. 2001లో మొదటిసారిగా ఎర్నాకుళం జిల్లాలోని పరవూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేరళ శాసనసభకు పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 2006, 2011, 2016, 2021 తో పాటు మొన్నటి శాసనసభ ఎన్నికలలో వరుసగా ఆరుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి పరవూర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. క్షేత్రస్థాయి సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రజలతో మమేకమయ్యే తీరు ఆయన్ను అజేయ నాయకుడిగా నిలబెట్టాయి.
2021 శాసనసభ ఎన్నికలలో UDF ఘోర పరాజయంతో కేవలం 41 స్థానాలకు పరిమితమై పార్టీ కేడర్ తీవ్ర నైరాశ్యంలో ఉన్న దశలో సతీశన్ ప్రతిపక్ష నేత బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఆ సమయంలో ఆయన అవలంబించిన నాయకత్వ శైలి కేరళ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కేవలం ప్రభుత్వ విధానాలను గుడ్డిగా విమర్శించే పాత పద్ధతిని పక్కనపెట్టి.. పరిశోధన చేసి గణాంకాలతో ప్రభుత్వాన్ని నిలదీయడం ఆయన నుంచే మొదలయ్యింది.
మిషన్-100తో సక్సెస్:
కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చడానికి మిషన్ 100 పేరుతో బ్లూ ప్లింట్ సిద్ధం చేసింది కూడా సతీశనే. ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచే మిషన్ 100కు శ్రీకారం చుట్టారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల నిపుణులతో కాంక్లేవ్లు నిర్వహించి ప్రత్యామ్నాయ పాలనా పత్రాలను రూపొందించారు. ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన 30 రోజుల యూడీఎఫ్ పుతుయుగ యాత్రలో 75 శాతం సమయాన్ని కేవలం రాజకీయ విమర్శలకు కాకుండా కొత్త కేరళ భవిష్యత్ ప్రాజెక్టులను ప్రజలకు వివరించడానికే కేటాయించారు. పదేళ్ల LDF పాలనతో విసిగిపోయిన ప్రజలకు UDF ను ఒక సానుకూల ప్రత్యామ్నాయంగా చూపించడంలో విజయం సాధించారు. ఫలితంగా UDF స్థానాలు 41 నుంచి ఏకంగా 102కి పెరిగాయి.
మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకం:
పర్యావరణానికి హాని కలిగించే సిల్వర్ లైన్ స్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టును కేవలం రాజకీయంగానే కాకుండా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ నివేదికలను ఆధారంగా చేసుకొని పర్యావరణ ఆర్థిక కోణాల్లో విశ్లేషించి అడ్డుకోవడంలో ఆయన విజయం సాధించారు. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు పార్టీ విశ్వసనీయతను పెంచాయి. ముఖ్యంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి సంస్థల మద్దతును బహిరంగంగా తిరస్కరించి మత విద్వేష ప్రచారాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీని నెహ్రూవియన్ లెఫ్ట్గా అభివర్ణించడం ద్వారా రాష్ట్రంలో కమ్యూనిస్టుల భావజాలపు పునాదులను సైద్ధాంతికంగా దెబ్బతీశారు. ఆర్థిక రంగంలో పన్నుల వ్యవస్థ ప్రక్షాళన, GST ఫలాలను కేరళకు రప్పించడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్యాక్ డోర్ అపాయింట్మెంట్స్ రద్దు చేసి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను కాపాడతామని ఆయన ఇచ్చిన హామీలు యువతను విశేషంగా ఆకర్షించాయి. కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే పార్టీలోని ఏ వర్గానికి చెందని స్వతంత్ర నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.
సోషలిస్ట్ పార్టీల మద్దతుతో..:
UDF విజయానికి ప్రధాన కారకుడిగా క్షేత్రస్థాయి కార్యకర్తలలో సామాన్య ప్రజలలో సతీశన్ పట్ల అపారమైన గౌరవం ఉంది. ఆయన అభ్యర్థిత్వం వెనుక ఉన్న అతిపెద్ద బలం UDFలోని మిత్రపక్షాల మద్దతు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ..కేరళ కాంగ్రెస్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలు సతీశన్కే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బహిరంగంగా డిమాండ్ చేశాయి. కన్సర్న్డ్ సిటిజన్స్ ఆఫ్ కేరళ అనే పౌర సమాజ వేదిక రాహుల్ గాంధీకి ఏకంగా బహిరంగ లేఖ రాసింది. చారిత్రక విజయానికి వ్యూహకర్త అయిన సతీశన్ కే నైతికంగా ముఖ్యమంత్రి పదవి దక్కాలని ఒకవేళ అలా జరగకపోతే 2016లో కమ్యూనిస్టు పార్టీ అచ్యుతానందన్ విషయంలో ఎదుర్కొన్న ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
కేసీ వేణుగోపాల్ను పక్కనపెట్టి సతీశన్కే జై:
అపారమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కేవలం 35 మంది మాత్రమే సతీశన్కు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చారు. మిగతా వాళ్లంగా కేసీ వేణుగోపాల్ సీఎం కావాలని కోరుకున్నారు. దీనికి తోడు కేరళలో అత్యంత బలమైన సామాజిక సంస్థ అయిన నాయర్ సర్వీస్ సొసైటీ సతీశన్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే వీడీ సతీశన్ కు ఉన్న క్లీన్ ఇమేజ్తో పాటు ఐదేళ్లు
ప్రతిపక్షంలో యూడీఎఫ్కు నాయకత్వం వహించిన నేతగా అనుభవం ఉండటంతో కాంగ్రెస్ హైకమాండ్ చివరకు వీడీ సతీశన్ వైపే మొగ్గు చూపింది. సోనియా, రాహుల్ గాంధీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్న కేసీ వేణుగోపాల్ పేరు చివరి వరకు వినిపించినా… గ్రౌండ్ లెవల్లో ఉన్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా సతీశన్ కే జై కొట్టారు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు.
:- ఫణి కుమార్ (NTV DIGITAL)
