SIR Explained: ఓటరు జాబితా నుంచి మీ పేరు తొలగించారా? ఇకపై మీరు భారతీయులు కాదా?

India citizenship and electoral rolls SIR explained

Sir Explained

Citizenship in India: ఓటరు జాబితాలో మీ పేరు లేదా? ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIRలో భాగంగా జాబితా నుంచి మీ పేరును తొలగించారా? అయితే మీరు ఇకపై ఈ దేశ పౌరులు కారా? ఈ ప్రశ్నలన్నింటికీ సుప్రీంకోర్టు తాజాగా స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఓటర్ లిస్ట్ నుంచి పేరు తొలగించినంత మాత్రాన వారి పౌరసత్వం రద్దు అయినట్లు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎన్నికల సంఘం పరిమితులు ఏంటి? పౌరసత్వాన్ని ఎవరు నిర్ధారిస్తారు?

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) చట్టబద్ధతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం అనేది.. ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ణయించదని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఓటరు జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగిస్తే.. వారు భారత పౌరులు కారని అర్థం కాదని కోర్టు తేల్చిచెప్పింది. SIR కింద జరిపిన విచారణ కేవలం ఎన్నికల్లో పాల్గొనేందుకు మాత్రమే పరిమితం అని, పౌరసత్వ నిర్ధారణతో దానికి ఎలాంటి సంబంధం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది దొడ్డిదారిన పౌరసత్వాన్ని నిర్ధారించే చర్య అని పిటిషనర్లు, ప్రతిపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

×
×
Ad

ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందా?

ఎన్నికల సంఘం పౌరసత్వాన్ని నిర్ణయించగలదా అన్న అతిపెద్ద ప్రశ్నపై సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన గీత గీసింది. ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తిని చేర్చాలా లేదా మినహాయించాలా అనే పరిమిత కోణంలో మాత్రమే ఎన్నికల సంఘం ఈ అంశాన్ని పరిశీలించగలదని కోర్టు క్లారిటీ ఇచ్చింది. అంటే ఎన్నికల కమిషన్ పేర్లను తొలగించగలదు కానీ.. ఆ వ్యక్తి ఇకపై భారత పౌరుడు కాదని చెప్పే అధికారం దానికి లేదు. ఓటర్ల జాబితాలో చేర్చడానికి అర్హత ఉందా లేదా అని సంతృప్తి చెందేందుకు మాత్రమే పౌరసత్వంపై విచారణ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి విచారణ ఏమాత్రం పౌరసత్వాన్ని నిర్ధారించినట్లు కాదని.. ఓటర్ల జాబితా నుంచి మినహాయించినంత మాత్రాన పౌరసత్వం కోల్పోయినట్లు కాదని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది.

అసలు ఈ ఎస్ఐఆర్ వివాదం ఎలా మొదలైందో ఒకసారి చూద్దాం. 2002-2003 ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఓటర్లు.. ఆ జాబితాలో ఉన్న వారితో తమ పూర్వీకుల సంబంధాన్ని నిరూపించుకోవాలని ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ స్పష్టం చేసింది. దీని చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపైనే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

2025 జూన్‌లో బీహార్‌లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలకు దీనిని విస్తరించింది. ప్రస్తుతం 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఎస్ఐఆర్ మూడో.. చివరి దశ కొనసాగుతోంది. ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేయడానికి… పౌరసత్వ వాదనలను ధృవీకరించడానికి ఈ ప్రక్రియ అవసరమని ఈసీ సమర్థించుకోగా… పౌరసత్వాన్ని నిర్ణయించడం ఎన్నికల సంఘం పరిధిలోనిది కాదని పిటిషనర్లు వాదించారు.

ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారి పరిస్థితి ఏంటి ? పౌరసత్వంపై సందేహాలు ఉంటే ఏం చేయాలన్న దానిపైనా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అనుమానాస్పద పౌరసత్వం పేరుతో.. ఓటరు జాబితా నుంచి తొలగించిన వ్యక్తుల పేర్లను.. వారి పౌరసత్వాన్ని నిర్ధారించేందుకు.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపాలని.. ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసులన్నింటినీ పౌరసత్వ చట్టం-1955 కింద సంబంధిత అధికారులకు నాలుగు వారాల్లోగా రిఫర్ చేయాలని సీజేఐ ఆదేశించారు. తదుపరి అసెంబ్లీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది.

అలాగే సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా నోటీసు జారీ చేసి.. వారి వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ విచారణలో తొలగించిన వ్యక్తులు.. పౌరులే అని అధికారులు గుర్తిస్తే.. వెంటనే వారి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఇప్పుడు అందరి మదిలో మెదిలే అతిపెద్ద ప్రశ్న… పౌరసత్వానికి సరైన రుజువు ఏంటి? ఆధార్ కార్డు పౌరసత్వానికి రుజువు కాదని గతంలో సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ప్రశ్న ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ లేదా ప్రభుత్వ అధికారులు జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాలు.. జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం.. పాఠశాల రికార్డులు.. పాస్‌పోర్ట్.. భూమి రికార్డులను పౌరసత్వ రుజువుగా అంగీకరించారు. ఇప్పుడు పౌరసత్వాన్ని నిర్ణయించే బాధ్యతను సుప్రీంకోర్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అప్పగించడంతో.. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

:-ఫణి కుమార్ (NTV DIGITAL)