ఒక అమ్మాయిని మోసం చేసి నగరానికి తీసుకువచ్చారు…ఆమె చేతిలో ఉద్యోగం లేదు… తిరిగి వెళ్లడానికి డబ్బు లేదు… చుట్టూ అపరిచితులు… తర్వాత ఆమె శరీరాన్నే సరుకుగా మార్చేశారు…!
మరోవైపు…ఇంకో మహిళ ఉంది… ఆమె కూడా అదే వృత్తిలో ఉంది… కానీ ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు…ఎవరూ అమ్మలేదు… ఎవరూ బలవంతం చేయలేదు… అయితే ఈ ఇద్దరినీ ఒకేలా చూడాలా? ఇద్దరినీ ఒకే చట్టంతో కొలవాలా? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు నిలిచింది. ఇంతకీ సుప్రీంకోర్టు ఏం తీర్పునిచ్చింది?
చట్టబద్ధంకాదు.. ప్రోత్సహించడం కూడా కాదు:
మొదట ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ తీర్పు వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసిన తీర్పు కాదు. అలాగే సె*క్స్ వర్క్ను ప్రోత్సహించే తీర్పు కూడా కాదు. అసలు ఈ తీర్పు మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల రక్షణ గురించి. కానీ అదే సమయంలో ట్రాఫికింగ్కు గురైన వ్యక్తిని, తన ఇష్టప్రకారం సె*క్స్ వర్క్ చేస్తున్న అడల్ట్ను ఒకేలా చూడకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ కథను అర్థం చేసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాలి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నుంచే మన దేశం మనుషుల అక్రమ రవాణాను తీవ్ర నేరంగా పరిగణించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 స్పష్టంగా ట్రాఫికింగ్ను నిషేధించింది. ఎందుకంటే పేదరికం, మోసం, బలవంతం, బెదిరింపులు లేదా మానవ దోపిడీ ద్వారా లక్షలాది మంది మహిళలు, పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారని దేశం గుర్తించింది. తర్వాత 1956లో ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్(Immoral Traffic Prevention Act) అనే చట్టం వచ్చింది. దీని ప్రధాన లక్ష్యం వ్యభిచారం చేసే వ్యక్తులను శిక్షించడం కాదు. వారి వెనుక పనిచేసే దళారులు, బ్రోతల్ నిర్వాహకులు, ట్రాఫికింగ్ ముఠాలను అడ్డుకోవడం.
కానీ కాలక్రమేణా ఒక పెద్ద సమస్య బయటపడింది. ట్రాఫికింగ్కు గురైన మహిళలు, తమ ఇష్టప్రకారం సె*క్స్ వర్క్ చేస్తున్న మహిళలు, ఇద్దరూ ఒకే వ్యవస్థలో చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్లు జరిగినప్పుడు అందరినీ ఒకేలా పట్టుకుని ఆశ్రయ కేంద్రాలకు పంపించడం, వారి అభిప్రాయం అడగకుండా పునరావాసం పేరుతో నిర్బంధించడం వంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తింది. ఒక పెద్ద వయస్కురాలు తన ఇష్టంతో ఏ వృత్తిలో ఉండాలో నిర్ణయించుకునే హక్కు లేదా?
ఐక్యరాజ్యసమితి ఏం చెబుతోంది?
ఇక్కడే సుప్రీంకోర్టు చాలా కీలకమైన తేడాను వివరించింది. ట్రాఫికింగ్ అంటే ఒక వ్యక్తిని మోసం చేసి, బలవంతం చేసి, బెదిరించి, అమ్మి, కొనుగోలు చేసి లేదా అతని బలహీన పరిస్థితిని ఉపయోగించుకుని దోపిడీ చేయడం. ఐక్యరాజ్యసమితి రూపొందించిన పలెర్మో ప్రొటొకాల్(Palermo Protocol) కూడా ఇదే నిర్వచనాన్ని ఇస్తుంది. ఒకసారి ట్రాఫికింగ్ జరిగిందని నిరూపితమైతే, ఆ వ్యక్తి ఇచ్చిన సమ్మతి చట్టపరంగా విలువ కోల్పోతుంది. ఎందుకంటే ఆ సమ్మతి స్వేచ్ఛగా ఇచ్చిందని చెప్పలేం. కానీ ఒక పెద్ద వయస్కుడు లేదా పెద్ద వయస్కురాలు ఎలాంటి బలవంతం లేకుండా, తన స్వంత నిర్ణయంతో సె*క్స్ వర్క్ చేస్తుంటే, అక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
ఇక్కడ చాలా మందికి తెలియని మరో విషయం ఉంది. భారత్లో వ్యభిచారం ఎవరికి వారు ఇష్టంగా చేయడం పూర్తిగా నేరం కాదు. అయితే బ్రోతల్ నడపడం, దళారిగా వ్యవహరించడం, ఇతరులను లైంగిక దోపిడీకి నెట్టడం, ట్రాఫికింగ్ చేయడం, మైనర్లను ఈ వ్యవస్థలోకి లాగడం, బలవంతంగా వ్యభిచారంలోకి దింపడం మాత్రం తీవ్రమైన నేరాలు. అంటే చట్టం అసలు లక్ష్యం సె*క్స్ వర్కర్ను శిక్షించడం కాదు. దోపిడీ వ్యవస్థను అడ్డుకోవడం.
ఈ కారణంతోనే సుప్రీంకోర్టు ఇప్పుడు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై అధికారులు ముందుగా ఒక ప్రాథమిక విచారణ చేయాలి. సంబంధిత వ్యక్తి నిజంగా ట్రాఫికింగ్ బాధితుడా? లేదా స్వచ్ఛందంగా పనిచేస్తున్న అడల్టా? అనేది నిర్ధారించాలి. కేవలం సె*క్స్ వర్క్ చేస్తున్నారని మాత్రమే భావించి ఒకరిని బాధితుడిగా ప్రకటించకూడదని కోర్టు హెచ్చరించింది. అలాగే ట్రాఫికింగ్ బాధితులను గుర్తించిన వెంటనే వారికి వైద్య సహాయం, మానసిక కౌన్సెలింగ్, న్యాయ సహాయం, నష్టపరిహారం, ఉపాధి శిక్షణ, సమాజంలో గౌరవప్రదంగా తిరిగి జీవించే అవకాశాలు కల్పించాలని ఆదేశించింది.
అదే సమయంలో మరో కీలక విషయాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది. రక్షణ పేరుతో ఒక అడల్ట్ వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదు. అతని లేదా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధ పునరావాసం చేయకూడదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను, స్వయం నిర్ణయాధికారాన్ని కల్పిస్తుంది. ట్రాఫికింగ్ బాధితులను కాపాడటం ఎంత ముఖ్యమో, స్వతంత్ర నిర్ణయం తీసుకునే పెద్దల హక్కులను గౌరవించడం కూడా అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మొత్తానికి ఈ తీర్పు ఒక విషయాన్ని దేశానికి గుర్తు చేసింది. ప్రతి సె*క్స్ వర్కర్ ట్రాఫికింగ్ బాధిత కాదు. అలాగే ప్రతి ట్రాఫికింగ్ బాధితుడిని కేవలం సె*క్స్ వర్కర్గా చూడలేం. ఒకరికి రక్షణ అవసరం కావచ్చు. మరొకరికి గౌరవం, స్వేచ్ఛ అవసరం కావచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించి న్యాయం చేయడమే ఆధునిక ప్రజాస్వామ్య సమాజం బాధ్యత అని సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే ఈ తీర్పు కేవలం ఒక న్యాయ నిర్ణయం మాత్రమే కాదు. మానవ గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, మరియు దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం మధ్య సమతుల్యతను చూపించే ఒక కీలక మైలురాయి.
