Nepal VS India Explained: భారత్‌-నేపాల్‌ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?

Balen Shah India Controversy

Balen Shah India Controversy

Balen Shah Controversy Explainer: ఇండియా-నేపాల్ సరిహద్దు వివాదం ఒక్కసారిగా మళ్లీ అంతర్జాతీయ చర్చగా మారింది. దశాబ్దాలుగా భారత్, నేపాల్ మధ్య సాగుతున్న భూవివాదంపై ఎన్నో చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు నేపాల్ ప్రధాని బలేంద్ర షా చేసిన ఒక కామెంట్ ఆ వివాదానికి కొత్త మలుపు తీసుకొచ్చింది.

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఒక దేశం మరో దేశంపై ఆక్రమణ ఆరోపణలు చేస్తుంది కానీ ఈసారి కథ కొంచెం భిన్నంగా సాగింది. నేపాల్ భూమిని భారత్‌ ఆక్రమించిందని చెప్పడంతో పాటు నేపాల్ కూడా కొన్ని ప్రాంతాల్లో భారత భూభాగాన్ని ఆక్రమించిందని స్వయంగా ఆ దేశ ప్రధాని పార్లమెంట్ వేదికగా ప్రకటించడంతో రాజకీయ తుఫాన్ మొదలైంది.

×
×
Ad

బలేంద్ర షా ఏం అన్నారు?

నేపాల్ చరిత్రలో అత్యంత యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బలేంద్ర షా ఇటీవల తొలిసారిగా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో భారత్, నేపాల్ మధ్య ఉన్న లిపులేఖ్, లింపియాధురా, కలాపాని ప్రాంతాల వివాదాన్ని ప్రస్తావించారు. ఈ వివాదం రెండు దేశాల సంబంధాల్లో చాలాకాలంగా సున్నితమైన అంశంగా ఉంది. అయితే ఆయన చెప్పిన ఒక కామెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత్ మాత్రమే నేపాల్ భూమిని ఆక్రమించలేదని, నేపాల్ కూడా భారత భూభాగాన్ని కొన్ని చోట్ల ఆక్రమించిందని తనకు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలిసిందని అన్నారు. రెండు దేశాలు భావోద్వేగాలకు లోనుకాకుండా చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణుల సహాయంతో వాస్తవాలను పరిశీలించి స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ కామెంట్ బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే నేపాల్ రాజకీయాల్లో కలకలం మొదలైంది. ప్రతిపక్ష పార్టీలు ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆధారాలు ఉంటే చూపించాలని, లేకపోతే కామెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కొందరు నేతలు ఈ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని కూడా కోరారు. మాజీ విదేశాంగ మంత్రి సహా పలువురు సీనియర్ నాయకులు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బలేంద్ర షా అధికారిక ఆక్రమణ గురించి మాట్లాడలేదా?

వివాదం మరింత ముదురుతుండటంతో నేపాల్ విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. ప్రధానమంత్రి వ్యాఖ్యల అసలు ఉద్దేశం ఆక్రమణ కాదని, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న భూముల వినియోగానికి సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో సరిహద్దు స్తంభాలు లేకపోవడం వల్ల లేదా కాలక్రమంలో అవి కనిపించకుండా పోవడం వల్ల భారత వైపు ప్రజలు నేపాల్ భూమిని ఉపయోగించే పరిస్థితులు, అలాగే నేపాల్ వైపు ప్రజలు భారత భూమిని ఉపయోగించే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ప్రధాని చెప్పింది అధికారిక ఆక్రమణ గురించి కాదని, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడిన వాస్తవ పరిస్థితుల గురించి మాత్రమేనని వివరణ ఇచ్చింది.

అయితే ఈ వివరణతో వివాదం పూర్తిగా చల్లారలేదు. సరిహద్దు అంశాలపై పరిశోధనలు చేసిన నిపుణులు కూడా ప్రధాని వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. నేపాల్ ఎప్పుడూ భారత భూభాగాన్ని ఆక్రమించలేదని వారు వాదించారు.

కొన్ని ప్రాంతాల్లో రైతులు పరస్పరం ఒకరి భూమిని మరొకరు ఉపయోగించుకోవడం జరిగి ఉండొచ్చని, కానీ దాన్ని అధికారిక ఆక్రమణగా పరిగణించలేమని చెప్పారు. సరిహద్దుల్లో స్తంభాల లేకపోవడం వల్ల ఏర్పడిన గందరగోళాన్ని ఆక్రమణగా పేర్కొనడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో నేపాల్ మాజీ రాయబారులు కూడా బలేంద్ర షా వ్యాఖ్యలను ప్రశ్నించారు. భారత్, నేపాల్ మధ్య ఉన్న సరిహద్దు సమస్యల్లో దాదాపు 97శాతం అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయని గుర్తు చేశారు. మిగిలిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వివాదం కొనసాగుతోందని చెప్పారు. నేపాల్ భారత భూమిని ఆక్రమించిందని చెప్పే అధికారిక రికార్డు ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

ఈ వివాదం మళ్లీ తెరపైకి రావడానికి మరో కారణం కూడా ఉంది. కొద్ది వారాల క్రితం కైలాస్ మానసరోవర్ యాత్రకు సంబంధించి లిపులేఖ్ మార్గాన్ని ఉపయోగించడం పట్ల నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. లిపులేఖ్, లింపియాధురా, కలాపాని ప్రాంతాలు తమ భూభాగంలో భాగమని నేపాల్ మళ్లీ ప్రకటించింది. ఈ ప్రాంతాలు 1816 సుగౌలి ఒప్పందం ప్రకారం నేపాల్‌కే చెందుతాయని వాదించింది. అయితే భారత్ ఈ వాదనను తిరస్కరించింది. నేపాల్ తన భూభాగాన్ని కృత్రిమంగా విస్తరించి చూపుతోందని చెప్పింది.

అసలు ఈ వివాదం కొత్తది కాదు. భారత్, చైనా, నేపాల్ సరిహద్దులు కలిసే త్రివేణి ప్రాంతంలో ఉన్న లిపులేఖ్, లింపియాధురా, కలాపాని ప్రాంతాలపై చాలా కాలంగా ఇరు దేశాలు హక్కు చెబుతున్నాయి. 2021లో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఒలి ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రాజకీయ మ్యాప్ ఈ వివాదాన్ని మరింత తీవ్రమయ్యేలా చేసింది. ఆ మ్యాప్‌లో ఈ మూడు ప్రాంతాలను నేపాల్ భూభాగంగా చూపించారు. భారత్ దీన్ని ఏకపక్ష చర్యగా అభివర్ణిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా వైరల్ అవుతోంది. చైనా నేపాల్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ, ఆ విద్యుత్‌ను ఎగుమతి చేయడానికి నేపాల్‌కు ప్రధాన మార్గం భారత్ మాత్రమేనని కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి.

భారత విద్యుత్ మార్కెట్ నిబంధనల కారణంగా చైనా భాగస్వామ్యం ఉన్న కొన్ని ప్రాజెక్టులకు పరిమితులు ఎదురయ్యాయని, దీంతో నేపాల్ ఆర్థిక వ్యూహాల్లో మార్పులు వచ్చాయంటున్నాయి. ఇక ప్రస్తుతం పరిస్థితి చూస్తే మాత్రం సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారానికి దూరంగానే కనిపిస్తోంది.