యుద్ధం అంటే చాలామందికి బాంబులు, క్షిపణులు, ధ్వంసమైన భవనాలే కనిపిస్తాయి. కానీ ప్రతి యుద్ధం వెనుక కనిపించని మరో విపత్తు ఉంటుంది. అది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంది. మందులు లేక చికిత్స కోసం ఎదురుచూస్తున్న రోగుల నిరాశ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గాయపడిన వారిని కాపాడాల్సిన వైద్యులే ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి దాపరిస్తోంది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు ఇదే భయంకర దశలోకి ప్రవేశిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల ప్రకారం ఈ ఘర్షణ కేవలం ప్రాణనష్టాన్ని మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్య వ్యవస్థను కూడా కుదిపేస్తోంది. ఆస్పత్రులపై దాడులు, మందుల కొరత, వైద్య సిబ్బంది మరణాలు, శరణార్థ శిబిరాల్లో పెరుగుతున్న వ్యాధులతో యుద్ధం ఇప్పుడు మరో రూపం దాల్చుతోంది. ఇంతకీ మిడిల్ఈస్ట్ సంక్షోభం ఆరోగ్య సేవలను ఎలా కుప్పకూల్చుతోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా వివరాలు ఈ సంక్షోభం తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇరాన్లో 1300 మందికి పైగా మరణించగా, దాదాపు 9 వేల మంది గాయపడ్డారు. లెబనాన్లో 570 మంది మరణించగా, 1400 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇజ్రాయెల్లో కూడా మరణాలు, గాయాల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్యలు యుద్ధం ఎంత వేగంగా పౌరుల జీవితాలను నాశనం చేస్తున్నాయో చూపిస్తున్నాయి. ఈ ఘర్షణలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం ఆస్పత్రులపై దాడులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఫిబ్రవరి 28 తర్వాత ఇరాన్లో కనీసం 18 ఆరోగ్య కేంద్రాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో వైద్య సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
లెబనాన్లో కూడా ఆరోగ్య కేంద్రాలు లక్ష్యాలుగా మారాయి. అక్కడ 25 ఆరోగ్య కేంద్రాలపై దాడులు జరిగాయి. వైద్య సేవలు అందించాల్సిన ప్రదేశాలే యుద్ధంలో చిక్కుకోవడంతో గాయపడిన వారికి చికిత్స అందించడం మరింత కష్టమవుతోంది. ఆస్పత్రులపై దాడుల ప్రభావం వైద్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తోంది.
లెబనాన్లో ఇప్పటికే 49 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేయడం లేదు. మరో ఐదు ఆస్పత్రులు కూడా మూతపడ్డాయి. గాజాలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడ గాయపడిన వారిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కూడా నిలిచిపోయింది. అంబులెన్సులు సైతం అనేక ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నాయి. యుద్ధం మరో పెద్ద సమస్యను కూడా తీసుకొస్తోంది. అది ప్రజల వలస. భద్రత కోసం వేలాది కుటుంబాలు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇరాన్లో లక్ష మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు అంచనా.
లెబనాన్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అక్కడ దాదాపు 7లక్షల మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరణార్థ శిబిరాల్లో పరిశుభ్రమైన నీరు, పారిశుధ్య సదుపాయాలు లేకపోవడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, విరేచనాలు లాంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఈ పరిస్థితుల్లో అత్యంత ప్రమాదంలో ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ఇదే సమయంలో పర్యావరణ ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఇరాన్లో జరిగిన దాడుల్లో అనేక ఇంధన నిల్వ కేంద్రాలు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతాల్లో గంటల తరబడి మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదాల వల్ల గాల్లో విషపూరిత పొగ వ్యాపించింది. ఇటీవల టెహ్రాన్ ప్రాంతంలో కురిసిన వర్షం కూడా ఆందోళన కలిగించింది.
ఇంధన కేంద్రాల నుంచి వచ్చిన పొగ కారణంగా బ్లాక్ రెయిన్ కురిసిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సంస్థ ప్రజలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షం చర్మానికి, ఊపిరితిత్తులకు హాని చేస్తోంది. గాల్లో వ్యాపిస్తున్న కాలుష్యం వల్ల కళ్లకు మంటలు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. WHO ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆస్పత్రులను, వైద్య సిబ్బందిని యుద్ధాల్లో రక్షించాలని అంతర్జాతీయ మానవతా చట్టాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రపంచం ప్రతి సంవత్సరం సైనిక వ్యయాలకు భారీగా పెంచుకుంటూ పోతోంది. గతేడాది కాలంలో ప్రపంచ దేశాలు సైనిక ఖర్చులకు 2.7 ట్రిలియన్ డాలర్లు వెచ్చించాయి. కానీ ప్రపంచ ఆకలిని పూర్తిగా నిర్మూలించడానికి సంవత్సరానికి 93 బిలియన్ డాలర్లు సరిపోతాయని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది.
ఈ సంఖ్యలు ఒక కఠినమైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచం ఒకరిని ఒకరు చంపుకోవడానికి ఖర్చు చేస్తున్న డబ్బు, ఆకలితో ఉన్న ప్రజలను కాపాడడానికి కావలసిన డబ్బుతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ. అయినా కూడా నాయకుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం అత్యంత బాధాకర విషయం.
