బయట తుపాకీ శబ్దాలు.. లోపల ప్రసవ వేదన. బయట బాంబుల పొగ.. లోపల ఓ తల్లి నరకవేదన. 2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 లక్షల 60 వేల మంది మహిళలు గర్భధారణ, ప్రసవ సంబంధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారంటే నమ్మగలరా? ఆ మరణాల్లో ప్రతి పది మందిలో ఆరుగురు యుద్ధం లేదా సామాజిక అస్థిరతతో నలిగిపోయిన దేశాల్లోనే చనిపోయారు.
జీవాన్ని పుట్టించాల్సిన క్షణం అక్కడ ప్రాణం కోల్పోయే క్షణంగా మారుతోంది. మానవజాతి వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసింది కానీ మనమే సృష్టించిన ఘర్షణలు తల్లుల ప్రాణాలను తిరిగి చీకట్లోకి నెడుతున్నాయి. ఇంతకీ యుద్ధం మధ్యలో మాతృత్వం ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారుతోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. 2023లో ప్రపంచ మాతృ మరణాల రేటు ప్రతి లక్ష జననాలకు 197గా ఉంది. కానీ ఘర్షణ ప్రాంతాల్లో అదే సంఖ్య 504కి రికార్డయింది. అంటే సాధారణ ప్రాంతాలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. సామాజిక, ఆర్థిక బలహీనతలు ఉన్న దేశాల్లో ఈ సంఖ్య 368గా ఉంటే.. యుద్ధం లేని, స్థిరమైన దేశాల్లో మాత్రం అది 99కే పరిమితమైంది.
ప్రపంచ బ్యాంక్ ప్రకారం ప్రస్తుతం 17 దేశాలను తీవ్ర ఘర్షణ ప్రాంతాలుగా గుర్తించారు. మరో 20 దేశాలు సంస్థాగత, సామాజిక బలహీనతతో బాధపడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థలు సర్వసాధారణంగా మొదటి బలి అవుతాయి. విద్యుత్ అంతరాయం, మందుల కొరత, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది లేకపోవడం, రక్త నిల్వల లోపం లాంటివి తల్లులను ప్రమాదంలోకి నెడతాయి. 80శాతం వరకు మాతృ మరణాలు సరైన వైద్య సేవలు అందితే నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ యుద్ధం మధ్యలోకి ఆ సేవలు చేరవు.
ఇటు ఘర్షణల సమయంలో ఆస్పత్రులు లక్ష్యాలుగా మారడం కొత్త విషయం కాదు. అంబులెన్సులు చెక్పోస్టుల్లో ఆగిపోతాయి. రోడ్లు మూసుకుపోతాయి. ప్రసవానికి అవసరమైన అత్యవసర శస్త్రచికిత్సలు ఆలస్యమవుతాయి. రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, ప్రీ-ఎక్లాంప్సియా లాంటి సమస్యలు సమయానికి చికిత్స లభించక ప్రాణాంతకమవుతాయి.
కొత్తగా పుట్టిన శిశువుల పరిస్థితి కూడా ప్రమాదంలో పడుతుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బతకాల్సి రావడం లేదా మరణించడం లాంటి ఘటనలు జరుగుతాయి. ఇక్కడ మరో కోణం ఆకలి. యుద్ధ ప్రాంతాల్లో ఆహార సరఫరా అంతరాయం కలుగుతుంది. గర్భిణీలు పోషకాహారం లేకుండా ఉంటారు. రక్తహీనత పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా గర్భిణీల్లో ఐరన్ లోపం అధికంగా ఉన్న ప్రాంతాలు ప్రధానంగా ఘర్షణ ప్రాంతాలే. తల్లి బలహీనంగా ఉంటే ప్రసవ సమయంలో ప్రమాదం రెట్టింపవుతుంది. నీటి సరఫరా దెబ్బతింటే శుభ్రత సమస్యలు తలెత్తుతాయి. ప్రసూతి గదుల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
మానవ హక్కుల దృష్టితో చూస్తే ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు. జీవించేందుకు, సురక్షితంగా ప్రసవించేందుకు హక్కు ప్రతి మహిళకు ఉంది. కానీ యుద్ధం ఆ హక్కును లాక్కుంటోంది.
అంతర్జాతీయ సహాయం ఉన్నప్పటికీ, భద్రతా సమస్యల వల్ల అనేక ప్రాంతాలకు వైద్య సిబ్బంది చేరలేకపోతున్నారు. నిధులు తగ్గిపోతున్నాయి. దీర్ఘకాలిక ఘర్షణలతో దేశ ఆర్థిక వ్యవస్థలు కూలిపోతున్నాయి. ఇలా ప్రతి మాతృ మరణం వెనుక ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతోంది. ఒక శిశువు తల్లిని కోల్పోతోంది. ఒక సమాజం భవిష్యత్తును కోల్పోతోంది.
యుద్ధం గెలుపు ఓటమి గురించి మాట్లాడుతుంది కానీ మానవత్వం గురించి మాట్లాడదు. ఇక ఘర్షణల్ని ఆపకపోతే, ఆరోగ్య వ్యవస్థలను రక్షించకపోతే, ఈ సంఖ్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. కొత్త జీవితం పుట్టే క్షణం కాస్త మరణంతో పోటీ పడే క్షణంగా మారుతూనే ఉంటుంది.
ALSO READ: భార్యను చితకబాదే హక్కు.. ప్రజా ప్రదేశాల్లో మహిళలకు బహిరంగ శిక్షలు!
