ఎన్ని మార్కులొచ్చాయ్? ర్యాంక్ ఎంత? ఆ వన్ మార్క్ ఎందుకు తగ్గింది? తరుచుగా ఇండియాలో తల్లిదండ్రులు, టీచర్ల నుంచి విద్యార్థులకు ఎదురయ్యే ప్రశ్నలివి. ఈ ఏఐ కాలంలోనూ ప్రతిభను కొలవడానికి మార్కులే ప్రామాణికం కావడం బాధాకరమే.. ఎందుకంటే ఇతర దేశాలు తమ విద్యావ్యవస్థలను మార్చుకొని అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. ఉదాహరణకు మన పక్కనే ఉండే చైనా ఎడ్యూకేషన్ సిస్టమ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూపోతోంది.
ఇలా ఒకే వయసు.. ఒకే తరగతి కానీ… రెండు దేశాల్లో రెండు వేర్వేరు భవిష్యత్తులు తయారవుతున్నాయి. AI, టెక్నాలజీ, స్కిల్స్ వైపు చైనా పరుగెడుతుంటే.. ఇండియా మాత్రం ఇంకా పాత ప్రశ్నపత్రాల చుట్టూ తిరుగుతోంది. ఇండియాలో ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తిచేస్తున్నారు కానీ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. ఇంతకీ ఇండియన్ స్టూడెంట్స్ రేపటి ప్రపంచానికి రెడీ అవుతున్నారా? లేదా నిన్నటి వ్యవస్థలోనే ఇరుక్కుపోతున్నారా?
ముందుగా చైనా తీసుకొచ్చిన మార్పులను ఓసారి పరిశీలించాలి.. 2021లో చైనా తీసుకొచ్చిన డబుల్ రిడక్షన్ పాలసీ గురించి చెప్పుకోవాలి. నాటి నిర్ణయంతో కోచింగ్ సెంటర్లపై నియంత్రణ పెట్టింది. హోంవర్క్ ప్రెషర్ తగ్గింది. అయితే అసలు మార్పు మాత్రం క్లాస్రూమ్లోనే కనిపించింది.
పుస్తకాలు కంటే ప్రాక్టికల్ లెర్నింగ్పైనే ఫోకస్ పెట్టేలే రూల్స్ ఛేంజ్ చేశారు. పిల్లలు ఏం గుర్తుపెట్టుకున్నారన్నది అసలు మ్యాటరే కాదు.. వాళ్లు ఏం చేయగలరన్నదే ముఖ్యం. ఇప్పుడు చైనాలో టెక్నాలజీ సబ్జెక్ట్గా మాత్రమే కాదు.. టూల్గా వాడుతున్నారు. స్కూల్లలోనే కోడింగ్, రోబోటిక్స్, AI బేసిక్స్ పరిచయం చేస్తున్నారు. ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ను ముందుగానే నేర్పిస్తున్నారు. అంటే చదువు, ఉద్యోగం మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇండియా పరిస్థితి చూస్తే.. సమస్య కొత్తది కాదు కానీ ఇప్పుడు తీవ్రంగా కనిపిస్తోంది.
ప్రతి సంవత్సరం సుమారు 9 లక్షల మంది ఇంజినీర్లు బయటకు వస్తున్నారు. కానీ అందులో చాలా మంది తమ చదువుకు సరిపోయే ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ రిపోర్ట్ ప్రకారం దాదాపు 40శాతం యువత ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతోంది.
ఇక్కడ అసలు సమస్య డిగ్రీల్లో లేదు.. స్కిల్స్లో ఉంది. పరీక్షలు పాస్ కావడానికి చదివే సిస్టమ్.. సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన సామర్థ్యాన్ని ఇవ్వడం లేదు. కంపెనీలు కూడా అదే చెబుతున్నాయి. మార్కులు ఉన్నా పని చేయగలిగే నైపుణ్యం తక్కువగా ఉందని అంటున్నాయి. ఇందులో కోచింగ్ కల్చర్ కూడా పెద్ద పాత్ర పోషిస్తోంది. కోటా నుంచి హైదరాబాద్ వరకు.. ఎక్కడ చూసినా ర్యాంకుల కోసం పరిగెత్తే సిస్టమ్. ఇక్కడ విజయం అంటే ఒక ఎగ్జామ్ క్లియర్ చేయడం మాత్రమే. జీవితానికి అవసరమైన స్కిల్స్ మాత్రం సిలబస్లో ఉండవు.
ఎందుకంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం పరీక్షల చుట్టూ తిరుగుతోంది. స్కూల్ నుంచి కాలేజ్ వరకు విద్యార్థి విలువను నిర్ణయించేది మార్కులే. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కంటే ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలకు రెడీ అవ్వడం మీదే ఫోకస్ ఉంటుంది. అంటే ఇండియన్ ఎడ్యూకేషన్ సిస్టమ్ లక్ష్యం జ్ఞానం కాదు.. స్కోర్.
ఇంకో పెద్ద సమస్య సిలబస్ అప్డేట్ స్పీడ్. టెక్నాలజీ ప్రతి 3 నుంచి 5 సంవత్సరాల్లో పూర్తిగా మారిపోతుంటే మన సిలబస్ మాత్రం చాలా చోట్ల 8 నుంచి 10 సంవత్సరాల పాతదే ఉంటుంది. ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల్లో చదివే విషయాలు ఇండస్ట్రీలో వాడే టెక్నాలజీతో సరిపోకపోవడం ఇదే కారణం. అందుకే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా కంపెనీలు మళ్లీ ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తోంది. ఇక టీచింగ్ విధానం కూడా పెద్ద ఇష్యూ. చాలా స్కూల్స్లో ఇప్పటికీ వన్వే టీచింగ్ కొనసాగుతోంది. టీచర్ చెప్తాడు.. విద్యార్థి వినాలి.. గుర్తుపెట్టుకోవాలి.. ఎగ్జామ్లో రాయాలి. ప్రశ్నించడం, డిస్కషన్, ప్రాక్టికల్ అప్లికేషన్ లాంటి అంశాలు చాలా పరిమితంగా ఉంటాయి. దీంతో క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అభివృద్ధి కావడం లేదు.
మొత్తంగా చూస్తే ఇండియాలో సమస్య విద్యార్థుల్లో లేదు.. సిస్టమ్లో ఉంది. మార్కులను విజయంగా భావించే ఈ వ్యవస్థ మారకపోతే డిగ్రీ హోల్టర్లు పెరుగుతారు కానీ అవకాశాలు తగ్గిపోతాయి. భవిష్యత్తు కోసం అవసరమైన స్కిల్స్ నేర్పించకపోతే.. మనమే మన పిల్లల కెరీర్ను సమాధి చేస్తున్నట్టు లెక్క!
