Site icon NTV Telugu

Titanic-The Untold Story: చరిత్ర మరిచిన త్యాగం..! ఆమె మరణించింది..వాళ్లు బతికారు..! ఆ రోజు ఏం జరిగింది?

Titanic Indian Story

Titanic Indian Story

114ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రం వేలాది ప్రాణాలను మింగేసింది. 1912 ఏప్రిల్ 14 రాత్రి, ప్రపంచం ఎప్పటికీ మరిచిపోలేని విషాదం.. టైటానిక్ ప్రమాదం! ఈ టైటానిక్‌లో జరిగిన ఘటనలు గురించి ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాశారు.. సినిమాలు కూడా వచ్చాయి. అయితే చరిత్ర చెప్పని ఓ కథ ఉంది. ఆ కథలో ఓ మహిళ త్యాగముంది.

ఆమె పేరు క్లెమ్మర్ ఫంక్. మిషనరీగా ఇండియాకు వచ్చిన ఆమె ఆ తర్వాత టైటానిక్‌ ప్రమాదంలో మరణించింది. ఇండియాలో అమ్మాయిల కోసం పాఠశాల ప్రారంభించి, తన జీవితాన్ని సేవకు అంకితం చేసిన ఆమె టైటానిక్‌ ప్రమాదంలో ఎలా మరణించిందో చాలా కొద్ది మందికే తెలుసు. ఇంతకీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది? క్లెమ్మర్ ఫంక్ ఎవరు? ఆమె చేసిన త్యాగమేంటి?

1906లో అమెరికా నుంచి ఇండియా వచ్చిన క్లెమ్మర్ ఫంక్.. ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్గీర్ ప్రాంతంలో ఒక చిన్న పాఠశాలను ప్రారంభించింది. 17మంది అమ్మాయిలతో ఆ స్కూల్‌ మొదలైంది. ఈ స్కూల్‌ స్టార్ట్ చేయడం కోసం ఆమె ప్రత్యేకంగా హిందీ నేర్చుకుంది.

అక్కడి ప్రజలతో కలిసిపోయింది. తన సొంత దేశాన్ని మరిచిపోయేంతగా భారతాన్ని తన హృదయంలో పెట్టుకుంది. జీవితం ఇలా కొనసాగుతున్న సమయంలో 1912లో ఆమెకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆమె తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉందని తెలిసింది. వెంటనే ఆమె తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. లివర్‌పూల్‌కు చేరుకున్న తర్వాత, ఆమె ఎక్కాల్సిన నౌక ఆలస్యమైంది. కారణం.. బొగ్గు సమ్మె..! అయితే త్వరగా వెళ్లాలి.. తల్లిని చూడాలనే టెన్షన్‌తో మరో నౌకను ఎంచుకుంది. అదే టైటానిక్. అదృష్టం అనుకున్నది కానీ..అదే ఆమె జీవితాన్ని ముంచేయబోతున్న నిర్ణయమని ఊహించలేకపోయింది.

సెకండ్ క్లాస్‌ టికెట్ తీసుకుని నౌకలో ఎక్కింది. ఆ షిప్‌లోనే ఆమె తన 38వ పుట్టినరోజును కూడా జరుపుకుంది. అయితే ఏప్రిల్ 14 రాత్రి టైటానిక్‌ ఓ భారీ ఐస్‌బర్గ్‌ను ఢీకొట్టిన తర్వాత ముందుగా మహిళలు, పిల్లలను లైఫ్‌బోట్లలోకి ఎక్కిస్తున్నారు. అయితే అక్కడ కూడా వివక్షే.

తెల్లజాతీయులకే అవకాశమిచ్చారు. ఈ కారణంగానే ఫంక్‌కు కూడా ఒక సీటు కేటాయించారు. అయితే ఆ సమయంలో ఒక తల్లి తన పిల్లల కోసం బాధగా కేకలు వేస్తుండడాన్ని ఫంక్‌ గమనించింది. ఆ అరుపుల్లో ఉన్న భయం.. ఆ ఆవేదన ఫంక్‌ మనసును కదిలించింది. వెంటనే తన సీటును ఆ తల్లికి, ఆ పిల్లాడికి కేటాయించాలని టైటానిక్‌ అధికారులతో వాదించింది. చివరకు తన సీటును ఆ తల్లి-పిల్లాడికి వచ్చేలా చేసింది. తనకు వచ్చిన ప్రాణావకాశాన్ని వదులకుకొని ముక్కు, ముఖం తెలియని వారికి ఆమె ఇవ్వడం నిజంగా గొప్ప త్యాగంగానే చెప్పుకోవాలి. ఆమె వెనక్కి అడుగు వేసింది.. ఆ తల్లిని ముందుకు నెట్టింది.

లైఫ్‌బోట్ నెమ్మదిగా దూరమవుతుండగా ఫంక్‌ మాత్రం నౌకపై నిలబడి ఉంది. చుట్టూ చీకటి, చల్లని గాలి, మునిగిపోతున్న నౌక,, ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే ఆమె కూడా ఆ సముద్రంలో కలిసిపోయింది. ఆమె శరీరం ఇప్పటికీ దొరకలేదు కానీ ఆమె చేసిన త్యాగం మాత్రం మిగిలిపోయింది. నిజానికి టైటానిక్‌ షిప్‌లో మునిగిపోయిన వారిలో 8మందికి ఇండియాతో సంబంధాలున్నాయి.

ఝాన్సీలో జన్మించిన హెన్రీ రైలాండ్ డైయర్ అనే యువ ఇంజనీర్ నౌక కింద భాగంలో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. లక్నోలో నివసించిన మేరీ హ్యూలెట్ ఆ రాత్రి గందరగోళాన్ని గమనించి పైడెక్క్‌కు వెళ్లి ప్రాణాలు దక్కించుకుంది. ఇండియాలో పుట్టిన రూత్ బెకర్ అనే 12ఏళ్ల చిన్నారి మాత్రం తన కుటుంబంతో కలిసి ఆ ప్రమాదం నుంచి బయటపడింది. కానీ ఆ రాత్రి జ్ఞాపకం ఆమెను జీవితాంతం వెంటాడింది. వాస్తవానికి టైటానిక్ కథను ప్రపంచం ఎన్నో విధాలుగా చెప్పుకుంది.. అందులో ఎక్కువగా ధనవంతుల గురించి, వీరోచిత అధికారుల గురించి, సంగీతకారుల గురించి, ప్రేమికుల గురించి చెప్పుకుంది కానీ క్లెమ్మర్ ఫంక్ లాంటి మహిళ గురించి మాట్లాడలేదు. అంతేకాదు చనిపోయిన షిప్పులోనే ప్రాణాలు కోల్పోయిన భారతీయ కార్మికులు గురించి కూడా కనీసం చర్చ జరగలేదు.

అయితే ఫంక్‌ను మాత్రం ఇండియా మర్చిపోలేదు. జాంజ్గీర్‌లో ఆమె ప్రారంభించిన పాఠశాల గుర్తులు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. ఆమెను అక్కడి ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.

 

Exit mobile version