Gudivada Amarnath: విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్ట్పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్ట్కు పునాది YS. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే పడిందని ఆయన స్పష్టం చేశారు. డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ కు 130 ఎకరాల భూమిని తమ ప్రభుత్వమే కేటాయించిందని గుర్తుచేశారు. 2021 నుంచే విశాఖను డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చర్యలు తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. గూగుల్, అదానీ, ఎయిర్ టెల్ సంస్థలు డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, ప్రాజెక్ట్ అమలులో పలు అంశాలపై స్పష్టత లేదని అన్నారు.
ప్రభుత్వం డేటా సెంటర్ కోసం సుమారు రూ.22 వేల కోట్ల రాయితీలు ఇస్తున్నప్పటికీ, ఉద్యోగాల కల్పనపై ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని విమర్శించారు. ప్రారంభంలో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని ప్రచారం జరిగినప్పటికీ, ఒప్పందంలో కేవలం 200 ఉద్యోగాలే ఉన్నాయని తెలిపారు. శంకుస్థాపన సందర్భంగా కూడా ఉద్యోగాలపై ఒక్క మాట కూడా ప్రస్తావించలేదని ఆయన అన్నారు.
అలాగే, గూగుల్తో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందాలు చేసుకుందని గుర్తుచేశారు. ఇన్ని రాయితీలు ఇస్తున్నప్పటికీ ఉద్యోగాలపై కమిట్మెంట్ తీసుకోకపోవడం ఎందుకని ప్రశ్నించారు. డేటా సెంటర్కు అవసరమైన నీటి, విద్యుత్ వనరులపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. గోదావరి నీటిని విశాఖకు రెండు నెలల్లో తీసుకురావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పైప్లైన్ కనెక్టివిటీ కూడా లేదని, పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించాలంటే ఎత్తు సమస్యలు ఉన్నాయని వివరించారు.
విద్యుత్ సరఫరా అంశంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆయన అన్నారు. డేటా సెంటర్కు అవసరమైన భారీ విద్యుత్ను ఎలా అందిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గూగుల్ సంస్థ విశాఖకు రావడానికి జగన్ హయాంలోనే పునాదులు పడ్డాయని పేర్కొన్న ఆయన, 2021లో సబ్సీ కేబుల్ కోసం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనలో లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా ఇంధన సరఫరాలో సమస్యలు తలెత్తాయని ఆరోపించారు.
