NTV Telugu Site icon

Dastagiri: దస్తగిరి దాదాగిరి చేస్తున్నాడా..? ఇవి అందులో భాగమేనా..?

Dastagiri

Dastagiri

Dastagiri: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. రెచ్చిపోయాడు. కడప జిల్లా పులివెందుల వీధుల్లో వైసీపీ నేతలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. నోటికి అడ్డు అదుపు లేకుండా.. బూతులు వాగాడు. సీబీఐ ఇచ్చిన సెక్యూరిటీతో…తనను ఎవరు ఏమీ చేయలేరన్న ధీమాతో రౌడీలా వైసీపీ లీడర్లకు వార్నింగ్‌ ఇచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత…చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.

సీబీఐ క‌ల్పించిన సెక్యూరిటీని అడ్డం పెట్టుకుని సెటిల్ మెంట్లు చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా ఉన్నాయి. రైల్వే కోడూరులో నాలుగు షాపుల వ్యవ‌హ‌రంలో… గ‌దుల‌కు తాళాలు వేసి అరాచ‌కం సృష్టించాడు. అధిక వడ్డీలకు ఇస్తూ.. బాధితులను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. పులివెందుల జ‌య‌మ్మ కాల‌నీకి చెందిన గులాబీ అనే మ‌హిళ‌కు అప్పు ఇచ్చాడు. వారం వారం వ‌డ్డీ చెల్లించే ప‌ద్దతిలో తీసుకున్నారు. ఆర్థిక కార‌ణాల‌తో కొన్ని వారాలుగా వ‌డ్డీ డ‌బ్బులు చెల్లించలేదు. వ్యక్తిగత పనులతో గులాబీ, ఆయ‌న కుటుంబ స‌భ్యులు కొంద‌రు వేరే ఊరికి వెళ్ళారు. వ‌డ్డీ డ‌బ్బులు చెల్లించ‌డం లేద‌ని.. గులాబీ కుమారుడు గూగుడువ‌లిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. ఇంట్లో నిర్భంధించాడు. త‌ల్లిదండ్రులు వ‌డ్డీ చెల్లించ‌లేద‌నంటూ…బాలుడ్ని చిత్రహింస‌లు పెట్టాడు.

గులాబీకి ఫోన్‌ చేసిన ద‌స్తగిరి.. డ‌బ్బు చెల్లించ‌క‌పోతే కొడుకు మరింత హింసిస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో ఈ నెల 19న గులాబీ పులివెందుల పోలీసుల‌ను ఆశ్రయించింది. ద‌స్తగిరి చెర‌లో ఉన్న గూగూడువలిని విడిపించి, త‌ల్లి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు. మైన‌ర్ బాలుడిని తీసుకురావ‌డం, చిత్ర హింస‌లు పాలు చేయ‌డం, బెదిరించ‌డం, అధిక వ‌డ్డీలు వ‌సూలు చేస్తూ చ‌ట్టవ్యతిరేక చ‌ర్యలు పాల్పడుతున్న ద‌స్తగిరి దంపతుల‌పై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. గ‌త ఏడాది మే నెల‌లో తొండూరు పోలీస్టేష‌న్‌లోనే.. మ‌ల్లెల గ్రామానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. ఇదే మండ‌లంలో ఎల‌క్ట్రిక‌ల్ ఉప‌క‌ర‌ణాలు దొంగ‌లించార‌న్న అభియోగాల‌పై ద‌స్తగిరిపై కేసు న‌మోదైంది. శ్రీ‌కాళ‌హ‌స్తిలో కుటుంబాల మ‌ధ్య ఉన్న వివాదంలోకి ఎంటరై.. వార్నింగ్‌ ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు.