తప్పకుండా అధికారంలోకి వస్తాం అని, అందులో ఎలాంటి సందేహం లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం (కూటమి ప్రభుత్వం) తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే.. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాకముందు మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవని, ఇప్పుడు ప్రజలు తింటున్న కంచాన్ని చంద్రబాబు లాగేశాడని విమర్శించారు. ఇప్పుడు కలియుగం పాలిటిక్స్ నడుస్తున్నాయని, కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘తప్పకుండా అధికారంలోకి వస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది. 2014లో కూడా చంద్రబాబు తానిచ్చిన హామీలను అమలు చేయలేదు. మనం పాదయాత్ర చేసి, ప్రజలకు భరోసా ఇచ్చాం. 2019 ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత కొట్టిచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. ప్రజావ్యతిరేకతను చీల్చడానికి చంద్రబాబు తన రాజకీయ భాగస్వామిని వేరేగా పోటీ చేయించారు. అయినా బాబు తన ఓటమిని అడ్డుకోలేకపోయారు. చంద్రబాబు రాకముందు మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవి, ఇప్పుడు ప్రజలు తింటున్న కంచాన్ని లాగేశాడు. అంతేకాదు తానిచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు. రెండు రకాలుగా చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు పూర్తిగా నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయంగా ఉన్న రైతు భరోసా ఎగిరిపోయింది. అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ.. అదే రూపాయికి వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. లూలుకు 1500 కోట్ల భూములు కట్టబెట్టారు. మరొకరికి 3 వేల కోట్ల భూములు కట్టబెట్టారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి సెకీతో మనం 2.49 రూపాయలకే విద్యుత్ కొనుగోలు చేశాం. ఇవాళ వీళ్లు 4.60లకు కొనుగోలు చేశారు. సెక్షన్ 108 ప్రకారం ఏపీఆర్సీపీ మీద ఒత్తిడి తెచ్చి మరీ అమలు చేయించుకున్నారు. అవినీతి మన కంటికి కనిపిస్తోంది. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, పేకాట క్లబ్బులు, బెల్టు షాపులు, ఎమ్మార్పీ ధర కన్నా లిక్కర్ ఎక్కువకు అమ్ముకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు ముట్టజెప్పనిదే ఏమీ కావడం లేదు. ఇవన్నీ కంటికి కనిపిస్తున్నాయి. రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఒక్కసారి ఓటు వేశాక ఐదేళ్ల పాటు ప్రజలు వేచి చూడాలి. అందుకే ఇప్పుడేమీ చేయలేక ప్రజలు అన్నింటినీ చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రజలు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు. ఇప్పుడు కలియుగం పాలిటిక్స్ నడుస్తున్నాయి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని మన ప్రభుత్వంలో చాలా కష్టపడ్డాం. మన పరిపాలనలో చాలామంది నాయకులను కట్టడి చేశాం. తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీకి స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైసీపీకి 16, టీడీపికి 18 వచ్చాయి. కాని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మన పార్టీ వైపునకు ఫలితాన్ని తిప్పుదామని యత్నించారు. ఆరోజు మన పార్టీ ఎమ్మెల్యే అయిన పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశాం. ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయడం లేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం, కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరినీ గొప్ప స్థానంలో కూర్చోబెడతాను. ఈసారి కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను.. ప్రజలకు హామీలు ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తాను. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చింది. కేడర్ ధైర్యంగా నిలబడింది. రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎక్కడకు వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన పట్ల తీవ్ర మైన ఆగ్రహం ఉంది. రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురిచేస్తున్నారు’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
