YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్

Ysjagan

Ysjagan

YS Jagan: చంద్రబాబు హయాంలో రెడ్ బుక్ గవర్నెన్స్ గ్లోబల్ అయ్యిందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ఏపీ పోలీసులు ఎఫ్‌బీఐగా పోజులిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పోలీసుల నకిలీ గుర్తింపు ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు అంటూ ఎక్స్‌లో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
చంద్రబాబు ఇది పోలీసింగ్‌ నా? రాజకీయ కక్ష సాధింపునకు రాష్ట్ర ప్రాయోజిత మోసమా? ఎక్స్‌లో పోస్టులను తొలగించాలని కోరుతూ.. ఏపీ పోలీసులు తమను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌(FBI)గా అభ్యర్థన పంపటం దారుణమన్నారు. ఈ చర్య రాష్ట్రం, దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. టేక్‌డౌన్ రిక్వెస్ట్ అధికారిక ఏపీ పోలీస్ ఈమెయిల్ నుంచే వచ్చిందని ఎక్స్ ధృవీకరించింది. అయినా.. ఆ అధికారి పంపిన సంస్థ పేరులో మాత్రం ‘FBI’ అని పేర్కొన్నారని గుర్తు చేశారు. ఈ టేక్‌డౌన్ రిక్వెస్ట్‌ను ఎవరు ఆదేశించారు? FBI గుర్తింపును ఎందుకు దుర్వినియోగం చేశారు? ఎక్స్‌ను తప్పుదోవ పట్టించి.. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఇది ఉద్దేశపూర్వక ప్రయత్నమా? నెరవేరని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలపై ప్రశ్నలు అడిగినందుకా? డీఎస్సీ స్కామ్‌పై ప్రశ్నించినందుకా? అమరావతి దోపిడీపై ప్రశ్నించినందుకా? రాష్ట్ర అప్పులు, పాలనా వైఫల్యాలు, వేధింపులపై ప్రశ్నించినందుకా? అని జగన్ ప్రశ్నించారు.

పోలీస్ యూనిఫాం చట్టాన్ని రక్షించేందుకు ఉండాలని.. రాజకీయ సెన్సార్‌షిప్ అమలు చేసేందుకు కాదని మాజీ సీఎం జగన్ అన్నారు.. “రాజకీయ టేక్‌డౌన్ ఆపరేషన్‌లో విదేశీ దర్యాప్తు సంస్థ పేరును లాగడం ద్వారా ఆంధ్రప్రదేశ్, పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీశారు. విమర్శకుల గొంతులను అణచివేసేందుకు ఖర్చు చేసే శక్తిని.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుపై పెట్టాలి. కరవు పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలి. నిజమైన ఉద్యోగాలు కల్పించడం, అభివృద్ధి చేయడం, ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. సోషల్ మీడియా ఉన్న నేపథ్యంలో వాస్తవాలను దాచడం సాధ్యం కాదు. మీ ప్రభుత్వ పనితీరుపై నమ్మకం ఉంటే.. విమర్శలకు పనితీరు, పారదర్శకతతో సమాధానం చెప్పాలి. కానీ.. సెన్సార్‌షిప్, వేధింపులతో కాదు.” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.