YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!

Ys Jagan Statement

Ys Jagan Statement

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈరోజు, రేపు పులివెందులలోనే వైసీపీ అధినేత ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. జగన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పులివెందులకు చేరుకోనున్నారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను కలుసుకుని వారి సమస్యలను, వినతులను స్వీకరించనున్నారు. అనంతరం రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేయనున్నారు.

రేపు ఉదయం వైఎస్ జగన్ తన పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయకు చేరుకోనున్నారు. అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా నివాళులు అర్పించనున్నారు. తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణం కానున్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.