YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!

Ys Jagan Speech

Ys Jagan Speech

YS Jagan About Tobacco Farmers: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జగన్‌.. అక్కడి పొగాకు బ్యారెన్లను పరిశీలించారు. అనంతరం పొగాకు రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్.. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. అన్యాయాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు.

పొగాకు రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘సీఎం చంద్రబాబు పాలనలో రైతులు నష్టపోయారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసమే కనిపిస్తోంది. అన్యాయంపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ. కూటమి పాలనలో రైతులు రోడ్డున పడ్డారు. పొగాకుతో పాటు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతుల ఆత్మహత్యలు చంద్రబాబుకు కనిపించడం లేదా?. భాదిత రైతు కుటుంబాలకు కనీసం పరామర్శ లేదు. పొగాకు రైతులు సంక్షోభంలో ఉన్నారు. గిట్టుబాటు ధర రాక వెంకటేశ్వరరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పెద్దలు పరామర్శించలేదు’ వైఎస్ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘వైసీపీ హయాంలో కేజీ పొగాకు ధర రూ.289గా ఉంది. కానీ ఇప్పుడు కేజీ పొగాకు ధర రూ.236 మాత్రమే పలుకుతోంది. రోజురోజుకు రైతులకు పెట్టుబడి పెరుగుతుంటే, రాబడి తగ్గుతోంది. చంద్రబాబు ప్రభుత్వం 12 శాతం పొగాకు పంటను మాత్రమే కొనుగోలు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం దళారీలతో రాజీ పడింది. దళారులు సిండికేట్‌గా మారి రైతుల పొట్టకొడుతున్నారు. వైసీపీ హయాంలో రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చాం. పీఎం కిసాన్‌కు అదనంగా రైతులకు రూ.20 వేలు ఇస్తామన్నారు. వైసీపీ హయాంలో ఉన్న ఉచిత పంటల బీమాను రద్దు చేశారు’ వైఎస్ జగన్‌ ఆరోపించారు. రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించాలని జగన్ డిమాండ్ చేశారు.