YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!

  • డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు
  • ఎక్స్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్
  • మహిళలకు కూటమి మరో వాగ్దాన బంధం
  • ఎస్‌హెచ్‌జీ మహిళలకు రుణాలు ఇవ్వకుండా ప్రభుత్వం మొండిచేయి
Ys Jagan Shg

Ys Jagan Shg

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఇచ్చిన మరో కీలక హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు అందించే వడ్డీ రాయితీ పథకాన్ని పూర్తిగా నిలిపివేసి.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన జగన్.. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.4,969 కోట్ల మేర వడ్డీ రాయితీ అందించామని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అలాగే ఆసరా, చేయూత వంటి సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించామని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రాయితీ కింద ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. 2025-26 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నిధులు విడుదల కాలేదని పేర్కొన్నారు. 2026-27 బడ్జెట్‌లోనూ మళ్లీ రూ.100 కోట్లు కేటాయించినప్పటికీ.. ఆ నిధులు కూడా విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదని జగన్ ఫైర్ అయ్యారు.

గత రెండేళ్లలో స్వయం సహాయక సంఘాల మహిళలకు సుమారు రూ.6,000 కోట్ల మేర నష్టం జరిగిందని వైఎస్ జగన్ ఆరోపించారు. వడ్డీ రాయితీ లేకపోవడంతో మహిళలపై ఆర్థిక భారం పెరిగిందని, గ్రామీణ కుటుంబాల ఆదాయాలపై కూడా ప్రభావం పడుతోందన్నారు. ఎస్‌హెచ్‌జీ రుణాల వృద్ధి గణాంకాలను ప్రస్తావిస్తూ 2023-24లో రూ.49,696 కోట్లుగా ఉన్న రుణ వృద్ధి 2024-25లో రూ.41,623 కోట్లకు పడిపోయిందని.. 2025-26లో మరింత తగ్గి రూ.41,105 కోట్లకు చేరిందన్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు, ఆదాయాలు, వినియోగం తగ్గిపోతున్నాయనే విషయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26లో రాష్ట్ర పన్ను ఆదాయ వృద్ధి -3.22 శాతంగా నమోదైందని, ఇది రాష్ట్రంలో ఆర్థిక మాంద్యానికి సంకేతమని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేసి.. వడ్డీ రాయితీ బకాయిలను విడుదల చేయాలని జగన్ డిమాండ్ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.