Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..

Yashpal Sharma

Yashpal Sharma

Yashpal Sharma: క్రికెట్‌లో దశాబ్దాలుగా ఓ విషయం వినిపిస్తుంటుంది. బ్యాటింగ్‌లో ఫామ్ క్షీణించవచ్చు, బౌలింగ్‌లో అదృష్టం కలిసిరాకపోవచ్చు. కానీ ఫీల్డింగ్ అనేది పూర్తిగా ఆటగాడి చేతుల్లోనే ఉండే అంశం. శ్రమ పడితే వచ్చే ఈ కళకు ఎలాంటి వంకలు చెప్పడానికి వీల్లేదని ఆట స్వరూపం మారుతున్న కొద్దీ స్పష్టమవుతోంది. భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పిన 1983 ప్రపంచకప్ అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది కపిల్ దేవ్ వీరోచిత ఇన్నింగ్స్ లేదా మదన్ లాల్ సంచలన బౌలింగ్. అయితే, ఆ చారిత్రాత్మక విజయం వెనుక పంజాబ్‌కు చెందిన ఓ అసాధారణ ఫీల్డర్ పోరాటం ఉందనే విషయం చరిత్ర పుటల్లో మూలన పడిపోయింది. ఆ అభినవ సూపర్‌మ్యాన్ ఎవరో కాదు. మైదానంలో చిరుతలా దూకే యశ్‌పాల్ శర్మ.

ఆ ప్రపంచకప్‌లో యశ్‌పాల్ శర్మ బ్యాటింగ్‌తో మాత్రమే కాదు, తన కసితో కూడిన ఫీల్డింగ్‌తో ప్రపంచ దిగ్గజ బ్యాటర్లను నానా తిప్పలు పెట్టారు. స్క్వేర్ లెగ్ నుంచి కవర్స్ వరకు మైదానమంతా ఒక్కరే విస్తరించి ఉన్నారా అన్నట్లు ఆయన కదిలేవారు. మైదానంలో ఆయన చూపుతున్న చురుకుదనం వల్ల సింగిల్ తీయడానికి కూడా ప్రత్యర్థి బ్యాటర్లు భయపడేవారు. అద్భుతమైన డైవ్‌లు, మెరుపు వేగంతో వేసే త్రోలతో ఎన్నో కీలక సమయాల్లో బ్యాటర్లను రనౌట్ చేసి మ్యాచ్‌లను భారత్ వైపు తిప్పారు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో క్రీజులో సెట్ అయి ప్రమాదకరంగా మారుతున్న అలాన్ లాంబ్‌ను స్క్వేర్ లెగ్ నుంచి నేరుగా విసిరిన త్రోతో రనౌట్ చేసి, మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు.

బ్యాటింగ్‌లోనూ ఆయన అందించిన సహకారం మరచిపోలేనిది. సెమీఫైనల్లో యశ్‌పాల్ శర్మ చేసిన బాధ్యతాయుతమైన 61 రన్స్ భారత్‌ను ఫైనల్ వైపు నడిపించాయి. ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ బాబ్ విల్లీస్ వేసిన ఒక వేగవంతమైన బంతికి, క్రీజు వదిలి ముందుకు వచ్చి స్క్వేర్ లెగ్ మీదుగా కొట్టిన సిక్స్ క్రికెట్ చరిత్రలోనే ఒక చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోయింది. నేడు యశ్‌పాల్ శర్మ జయంతి. 1954 ఆగస్టు 11న పంజాబ్‌లోని లుధియానాలో జన్మించారాయన. 1978 అక్టోబర్‌ 13న పాకిస్తాన్‌తో వన్డే ద్వారా అరంగేట్రం చేశారు. 1979లో డిసెంబర్‌ 2న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ద్వారా టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 1980-81లో అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో 47, 147 పరుగులతో రాణించారు. యశ్‌పాల్‌ శర్మ ఒక టెస్టు మ్యాచ్‌లో రోజు మొత్తం ఆడి గుండప్ప విశ్వనాథ్‌తో కలిసి 316 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ.. 1985లోనే విండీస్‌ బౌలర్ మాల్కమ్‌ మార్షల్‌ వేసిన బంతి యశ్‌పాల్‌ శర్మ తలకు బలంగా తగలడంతో అర్ధాంతరంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆయన 13 జులై 2021న మరణించారు. ఈ రోజు యశ్‌పాల్ శర్మ మన మధ్య లేకపోయినా, 1983 ప్రపంచకప్‌లో ఆయన చూపించిన ఆ పట్టుదల, మైదానంలో కనబరిచిన ఆ విరోచిత ఫీల్డింగ్ ప్రతి క్రికెట్ అభిమాని గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి.