WTC Final 2027 Venue Confirmed: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2027 ఫైనల్కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. 2027 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ను ఇంగ్లాండ్ లోని చారిత్రాత్మక ‘ది ఓవల్’ (The Oval) మైదానంలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ 2027 జూన్ 9 నుంచి జూన్ 13 వరకు జరగనుంది.
ఇప్పటికే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి 2027, 2029, 2031 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ నిర్వహణ హక్కులను ICC కేటాయించింది. ప్రతి ఎడిషన్కు వేదికను ఎంపిక చేసే బాధ్యత ECBదే. అందులో భాగంగానే 2027 ఫైనల్కు ది ఓవల్ను ఎంపిక చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ‘ది ఓవల్’ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో 2023 WTC ఫైనల్ కూడా ఇదే వేదికలో జరిగింది. ఆ ఫైనల్లో భారత్ను ఓడించిన ఆస్ట్రేలియా టెస్టు ఛాంపియన్గా నిలిచి టైటిల్ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ చివరి దశకు చేరుకుంటోంది. ఇంకా తొమ్మిది జట్లు ఫైనల్ రేసులో ఉన్నాయి. ప్రస్తుతం 87.5% పాయింట్ల శాతంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా 75%తో రెండో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 72.22%తో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్థాన్పై 2-0తో సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ 58.33% కూడా పోటీదారుగా నిలిచింది. రెండుసార్లు WTC ఫైనల్ ఆడిన భారత్ ప్రస్తుతం 48.15%తో ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాత శ్రీలంక 41.67%, ఇంగ్లాండ్ 24.36%, వెస్టిండీస్ 15%, పాకిస్థాన్ 8.33% ఉన్నాయి.
జూలై, ఆగస్టు నెలల్లో జరిగే టెస్టు సిరీస్లు WTC పాయింట్ల పట్టికను ప్రభావితం చేయనున్నాయి. ఇందులో జూలై 25 నుంచి వెస్టిండీస్-పాకిస్థాన్ మధ్య రెండు టెస్టుల సిరీస్, ఆగస్టు 13 నుంచి ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్, ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక రెండు టెస్టుల సిరీస్, ఆగస్టు-సెప్టెంబర్లో ఇంగ్లాండ్-పాకిస్థాన్ మూడు టెస్టుల సిరీస్ లు ఉన్నాయి. ఈ సిరీస్ల ఫలితాలు ఫైనల్కు చేరే రెండు జట్లను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
2027 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే ఏడాది టెస్టు క్రికెట్ ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక ది ఓవల్లో ఫైనల్ నిర్వహించడం ఎంతో ప్రత్యేకమని ICC జనరల్ మేనేజర్ (ఈవెంట్స్ & ఆపరేషన్స్) గౌరవ్ సక్సేనా తెలిపారు. టెస్టు క్రికెట్ గొప్ప వారసత్వాన్ని ప్రపంచ అభిమానులకు మరోసారి గుర్తు చేసే వేదికగా ఈ ఫైనల్ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభమైన తర్వాత జరిగిన మూడు ఎడిషన్లలో మూడు వేర్వేరు జట్లు విజేతలుగా నిలిచాయి. 2021లో న్యూజిలాండ్, 2023లో ఆస్ట్రేలియా, 2025లో దక్షిణాఫ్రికా విజేతలుగా నిలిచాయి. ఇప్పుడు 2027లో ఏ రెండు జట్లు ఫైనల్కు చేరుకుంటాయి? టైటిల్ను ఎవరు కైవసం చేసుకుంటారు? అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.

