ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా శనివారం జరిగిన క్షిపణి (ప్రాజెక్టైల్) దాడి అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) కీలక ప్రకటన విడుదల చేస్తూ.. అణు కేంద్రం సమీపంలో క్షిపణి పడినప్పటికీ, ప్రస్తుతానికి రేడియేషన్ ముప్పు లేదని స్పష్టం చేసింది. ఇరాన్ అణు ఇంధన సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. ఈ దాడిలో అణు విద్యుత్ కేంద్రం ఆవరణలోని ఒక భవనం తీవ్రంగా దెబ్బతిన్నది. క్షిపణి పేలుడు వల్ల సంభవించిన షాక్వేవ్స్ (Shockwaves), చెల్లాచెదురైన తునకల కారణంగా భవన నిర్మాణం పాడైంది. దురదృష్టవశాత్తూ.. ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిలో ఒకరు క్షిపణి తునకలు తగిలి మరణించినట్లు ఐఏఈఏ ధృవీకరించింది. గత కొన్ని వారాలుగా ఈ కేంద్రం పరిసరాల్లో ఇలాంటి దాడులు జరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
Also Read:Pakistan: పాకిస్తాన్కు భారీ షాక్.. అప్పు చెల్లించాలని యూఏఈ ఒత్తిడి..
రేడియేషన్, భద్రత..
దాడి జరిగిన వెంటనే అణు కేంద్రం పరిసరాల్లో రేడియేషన్ స్థాయిలను అధికారులు పరీక్షించారు. రియాక్టర్ ఉన్న ప్రధాన విభాగానికి ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో రేడియేషన్ పెరగలేదని, ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని ఐఏఈఏ పేర్కొంది. అయితే.. దెబ్బతిన్న సహాయక భవనాల్లో కీలకమైన భద్రతా పరికరాలు లేదా పర్యవేక్షణ వ్యవస్థలు ఉండే అవకాశం ఉన్నందున, ఆ నష్టం అణు కేంద్రం పనితీరుపై ప్రభావం చూపుతుందా అన్న కోణంలో విశ్లేషిస్తున్నారు.
IAEA చీఫ్ హెచ్చరిక..
ఈ పరిణామంపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫాయెల్ గ్రోస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “అణు విద్యుత్ కేంద్రాలు యుద్ధ క్షేత్రాలు కాకూడదు. వాటిపై లేదా వాటి పరిసర ప్రాంతాలపై దాడులు చేయడం అత్యంత ప్రమాదకరం” అని ఆయన హెచ్చరించారు. అణు కేంద్రాల భద్రత విషయంలో అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల భారీ విపత్తు సంభవించే అవకాశం ఉంటుందని.. తక్షణమే ఇలాంటి దాడులు నిలిపివేయాలని ఆయన పిలుపునిచ్చారు.