IND vs NED Match to Begin in M Chinnaswamy Stadium: వన్డే ప్రపంచకప్ 2023లో అఖరి లీగ్ మ్యాచ్ భారత్, నెదర్లాండ్స్ మధ్య మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని రోహిత్ తెలిపాడు. మరోవైపు నెదర్లాండ్స్ కూడా తుది జట్టులో ఏ మార్పు చేయలేదు.
సెమీస్ స్థానాన్ని ఇప్పటికే ఖాయం చేసుకున్న భారత్.. వరుసగా తొమ్మిదో విజయంపై కన్నేసింది. దీపావళి రోజు భారత్ ఎలా వెలుగులు విరజిమ్ముతుందో చూడాలి. కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్ని తారా జువ్వలు (సిక్సులు) పేల్చుతాడో అని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 50వ వన్డే సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు స్వదేశానికి వెళ్లిపోయే ముందు గట్టి పోటీ ఇవ్వాలని నెదర్లాండ్స్ భావిస్తోంది. అయితే పరుగుల పిచ్పై భారత్ ధాటిని తట్టుకోవడం డచ్ జట్టుకు సవాలే.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
నెదర్లాండ్స్: వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్మాన్, సిబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), బాస్ డి లీడే, తేజ నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.