Iran Missile Man: గత నాలుగు వారాలుగా శక్తివంతమైన అమెరికాతో ఇరాన్ సాగిస్తున్న పోరు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తాము యుద్ధాన్ని ప్రారంభించలేదని, కానీ ఆపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెబుతోంది. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు అత్యంత కచ్చితత్వంతో విరుచుకుపడుతున్నాయి. అసలు అంతర్జాతీయ ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇరాన్ ఇంతటి క్షిపణి వ్యవస్థను ఎలా నిర్మించగలిగింది? ఈ అజేయ శక్తి వెనుక ఉన్న దార్శనికుడు ఎవరు.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: India-Russia: రష్యా ఆయిల్ దిగుమతులు డబుల్.. కీలక ఒప్పందం దిశగా భారత్..
ఇరాన్ క్షిపణి పితామహుడు.. హసన్ తెహ్రానీ మొఘద్దం
భారతదేశానికి అబ్దుల్ కలాం ఎలాగో, ఇరాన్కు హసన్ తెహ్రానీ మొఘద్దం అలా. ఆయన్ను ఇరాన్ ప్రజలు గౌరవంగా ‘మిస్సైల్ మ్యాన్’ అని పిలుచుకుంటారు. ఇరాన్ క్షిపణి దళానికి పునాది వేయడమే కాకుండా, దానికి తిరుగులేని శక్తిని అందించడంలో ఆయన పాత్ర కీలకం అని చెబుతున్నారు. 1959లో జన్మించిన మొఘద్దం, 20 ఏళ్ల వయసులో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లో చేరారు. 1980లో ఇరాక్ దాడులు చేసినప్పుడు ఇరాన్ వద్ద సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు లేవు. ఆ లోటును భర్తీ చేయడమే లక్ష్యంగా మొఘద్దం తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఆంక్షల మధ్య అద్భుతం..
అంతర్జాతీయ ఆంక్షల వల్ల బయట దేశాల నుంచి టెక్నాలజీ రావడం కష్టమని గ్రహించిన మొఘద్దం, ‘స్వదేశీ’ మంత్రాన్ని జపించారు. స్థానిక ఇంజినీర్లు, శాస్త్రవేత్తలతో ఒక బలమైన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇరాన్ రక్షణ కవచంగా మారిన ‘షాహాబ్’ క్షిపణి శ్రేణిని ఆయన నాయకత్వంలోనే అభివృద్ధి చేశారు. సాధారణంగా ఇరాన్ వద్ద 2000 కి.మీ పరిధి గల క్షిపణులు ఉన్నాయని ప్రపంచం భావిస్తుంది. కానీ, ఇటీవల హిందూ మహాసముద్రంలో 4000 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించి ఇరాన్ తన అసలు విశ్వరూపాన్ని చూపింది. శత్రువు దాడి చేయడానికి ముందే మన శక్తి ఏంటో వారికి తెలియాలని మొఘద్దం నమ్మేవారు. “మనం ఇచ్చే ప్రతిస్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో శత్రువుకు తెలిస్తే.. వాడు దాడి చేయడానికి వందసార్లు ఆలోచిస్తాడు” అనేదే ఆయన సిద్ధాంతం అని చెబుతున్నారు. నేడు అమెరికా వంటి దేశాలు ఇరాన్పై నేరుగా దాడి చేయడానికి వెనకాడుతున్నాయంటే దానికి మొఘద్దం రూపొందించిన ఈ రక్షణ వ్యూహమే కారణమని విశ్లేషకులు అంటున్నారు .
2011లో ఒక సైనిక స్థావరంలో జరిగిన పేలుడులో హసన్ తెహ్రానీ మొఘద్దం మరణించారు. ఆయన భౌతికంగా లేకపోయినా, ఆయన నిర్మించిన వ్యవస్థ మాత్రం నేడు ఇరాన్ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణి దేశాలలో ఒకటిగా నిలబెట్టింది. ఇరాన్కు కేవలం క్షిపణులను మాత్రమే కాకుండా, ఏ శక్తినైనా ఎదిరించే ఆత్మవిశ్వాసాన్ని, స్వయం సమృద్ధిని ఆయన అందించారని చెబుతారు. నేడు ఇరాన్ ప్రయోగిస్తున్న ప్రతి క్షిపణి వెనుక మొఘద్దం దార్శనికత, కష్టం దాగి ఉన్నాయి. అందుకే ఆయన పేరు ఇరాన్ సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.
