West Bengal: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఇటీవల బర్ధమాన్ వద్ద హమీమ్ మోండల్ అనే యువకుడిని, ఆ తర్వాత జార్ఖండ్లోని సాహిబ్గంజ్ వద్ద అతని ప్రియురాలు అర్పితా సర్కార్ను అరెస్ట్ చేసింది. విచారణలో వారిద్దరి తీవ్రవాద కుట్రలకు సంబంధించిన సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్కు చెందిన హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శనలో ఘర్షణలు, గందరగోళం సృష్టించేందుకు వీరు ప్రయత్నించినట్లు అధికారులు తేల్చారు. దీనికోసం రక్షక భట దుస్తులు (పోలీస్ యూనిఫారాలు) కొనుగోలు చేసి, మహిళలు, పురుషులతో కూడిన ఒక బృందంతో ఢిల్లీకి వెళ్లాల్సిందిగా హమీమ్కు ఆదేశాలు అందాయి.
హమీమ్ గత 4-5 నెలల క్రితం పాక్ ఆధారిత నెట్వర్క్ ఉచ్చులో పడ్డాడు. వీఐపీలు, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల సమాచారాన్ని సేకరించడంతో పాటు కొత్తవారిని ఈ జాలంలోకి లాగడం అతని పనిగా మారింది. ఈ క్రమంలోనే నాలుగేళ్లుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయమున్న అర్పితను కూడా ఇందులో భాగస్వామిని చేశాడు. ఈ జంట ముఖ్యంగా రాజకీయంగా ప్రభావం ఉన్న వ్యక్తులు, అధికారులను ‘హనీ ట్రాప్’ చేసే ముఠాను నడుపుతున్నట్లు STF స్పష్టం చేసింది. అర్పిత ద్వారా బెంగాల్కు చెందిన ఒక సీనియర్ మంత్రి కుమారుడిని కూడా వీరు హనీ ట్రాప్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే ప్రముఖ నాయకుల వ్యక్తిగత వివరాలు, కదలికలను ట్రాక్ చేయడానికి అర్పిత హమీమ్కు సాయపడేది.
హమీమ్, అతని పాకిస్థాన్ హ్యాండ్లర్లు నిరంతరం వాట్సాప్, టెలిగ్రామ్, ఎలిమెంట్ ఎక్స్ (Element X), సెషన్ (Session) వంటి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సంప్రదింపులు జరిపేవారని అధికారులు తెలిపారు. ఇందులో పాకిస్థాన్లోని షెహజాద్ భట్టీ గ్యాంగ్కు చెందిన నాలుగు ముఖ్యమైన హ్యాండ్లర్లను (అబీర్ జాట్333, ఉజైర్, రాణా, హమద్) పోలీసులు గుర్తించారు. వీరు బ్రిటన్, మెక్సికో దేశాల సిమ్ కార్డ్లను ఉపయోగిస్తూ యువతను తీవ్రవాదం వైపు బ్రెయిన్వాష్ చేసేవారని STF ఐజీ గౌరవ్ శర్మ తెలిపారు. ప్రస్తుతం కోర్టు అర్పితా సర్కార్ను 13 రోజుల ఎస్టీఎఫ్ కస్టడీకి ఇచ్చింది. కేసు విచారణ ప్రారంభ దశలోనే ఉందని, మున్ముందు ఈ నెట్వర్క్తో సంబంధమున్న మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.

