Vizag Film Distributor Filed Case Against Chiranjeevi, Tamannaah’s Bhola Shankar Movie: ‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘భోళా శంకర్’. 2015లో అజిత్ నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు ఇది రీమేక్. ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా కథలో చిన్నచిన్న మార్పులు చేసిన దర్శకుడు.. స్టైలిష్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా తమన్నా నటించగా.. కీర్తి సురేష్ చెల్లి పాత్ర చేశారు. సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే సినిమా విడుదలకు రెండు రోజుల ముందు భోళా శంకర్కి చిక్కులు మొదలయ్యాయి.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు రూ. 30 కోట్లు తీసుకుని మోసగించారని, అందుకే భోళా శంకర్ సినిమాపై కోర్టులో కేసు వేశామని విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ బుధవారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ నన్ను మోసం చేశారు. వారు చేసిన అన్యాయం ప్రతీ ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ చివరలో విడుదలైన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు 5 సంవత్సరాల పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. 30 కోట్ల రూపాయలు తీసుకుని వారు నన్ను మోసగించారు’ అని బత్తుల సత్యనారాయణ ప్రెస్ నోట్లో తెలిపారు.
‘బ్యాంకు అకౌంట్ రూపంలో నా సహచర వ్యాపార మిత్రుల సహకారంతో 30 కోట్ల రూపాయల వైట్ మనీని ఏజెంట్ సినిమా మూడు రాష్ట్రాల హక్కుల కోసం నేను చెల్లించినట్లు పక్కాగా ఆధారాలు ఉన్నాయి. అయితే సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి.. అగ్రిమెంట్కు తూట్లు పొడిచారు. మే 1న హైదరాబాద్లోని వారి ఆఫీస్కు వెళ్లి గరికపాటి కృష్ణ కిషోర్ను కలిశా. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయ్యిందని చెప్పి.. మరుసటి రోజు (మే 2) ఆఫీసుకు వస్తే అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. నాకు అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వడంతో డబ్బులు ఎలాగైనా వస్తాయన్న నమ్మకంతో వైజాగ్ వెళ్ళిపోయా’ అని సత్యనారాయణ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.
‘తర్వాత సామజవరగమన చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను విశాఖపట్నం వరకు ఇచ్చారు. ఆ సినిమా ద్వారా కొద్ది డబ్బు మాత్రమే నాకు కవర్ అయ్యింది. 45 రోజుల్లో నాకు రావలసిన మిగతా డబ్బును చెల్లిస్తామని, ఒకవేళ చెల్లించకపోతే తమ తదుపరి సినిమా విడుదల లోపు ఇస్తానని నాకు ఒప్పంద పత్రం ఇచ్చారు. వారి తదుపరి సినిమా భోళా శంకర్. కొద్ది రోజులుగా నాకు సమాధానం ఇవ్వడమే మానేశారు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు ఈ విషయం చెప్పి.. సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేదు. నాకు న్యాయం జరగడం కోసం తప్పనిసరి పరిస్థితులలో కోర్టుకు వెళ్లా’ అని ఆయన ప్రెస్ నోట్లో చెప్పారు.
Also Read: Lord Ganesh Remedies: బుధవారం వినాయకుడికి ఈ పరిహారాలు చేస్తే.. అదృష్టం, సంపద మీ వెంటే!
‘విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్గా సినీ పరిశ్రమతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. రంగస్థలం, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి అనేక సినిమాలను నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించిన, ఇతర బ్యానర్స్ పైన వారు తీసిన అనేక సినిమాలను నేను డిస్ట్రిబ్యూషన్ చేశా. గతంలో ఎప్పుడూ డబ్బు సమస్య, మోసాలు తలెత్తలేదు. ఇపుడు వారు ఫోర్జరీ చేశాననే నింద కూడా వేశారు. యూరోస్ ఇంటర్నేషనల్ వారికి వీరు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో.. వీరిపై కేసులు కూడా పెట్టారు. ఎంతో మందిని మోసం చేస్తూ.. వీరు తమ గుడ్ విల్ పోగొట్టుకున్నారు. ఇంకా ఎంతో మందికి వీరు బాకీలు ఉన్నారు. నా నీతి, నిజాయితీ ఏంటో సినీ పరిశ్రమతో పాటు అందరికీ తెలుసు. తెలియని వారికోసమే ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నా. నాకు న్యాయం జరగాలని ఆశిస్తూ అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించా. క్రిమినల్ కేసు కూడా వారిపై ఫైల్ చేశా’ అని సత్యనారాయణ ప్రెస్ నోట్లో చెప్పుకొచ్చారు.
‘మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు ఎంతో ఇష్టం. వారు నటించిన కారణంగానే నేను ఆచితూచి అడుగులు వేశా. ఈ విషయం మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడ్డా. అయితే నా మీద వారు ఫోర్జరీ నింద వేసి.. ఆ వార్తలను గ్రూపులలో పోస్ట్ చేయించారు. నన్ను అప్రదిష్టపాలు చేశారు. అయినా నిజాయితీ, న్యాయం గెలుస్తాయని నేను నమ్ముతున్నా. బుధవారం సాయంత్రం కోర్టులో విషయం తేలిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెపుతా. నిజానిజాలను మీడియా ముందు ఉంచుతా’అని డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ తెలిపారు.