భారత రన్ మెషిన్, సూపర్స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లోకి మళ్లీ పునరాగమనం చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని మరోసారి స్పష్టం చేశాడు. గత ఏడాది మే నెలలో టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ఇప్పుడు కేవలం వన్డేలకే పరిమితమయ్యాడు. అయితే, అతను ఇంకా కొన్నేళ్లపాటు టెస్ట్ క్రికెట్ ఆడాల్సిందనేది పలువురు నిపుణుల అభిప్రాయం. కోహ్లీ తన కెరీర్లో 123 టెస్ట్ మ్యాచ్లలో 30 సెంచరీలతో 9,230 పరుగులు చేశాడు.
షూ లాంచ్లో ఆసక్తికర సంభాషణ..
ఢిల్లీలో జరిగిన తన బ్రాండ్ ‘One8’ కొత్త షూస్ కలెక్షన్ లాంచ్ ఈవెంట్లో కోహ్లీ పాల్గొన్నాడు. విశేషం ఏంటంటే, తన టెస్ట్ పరుగులకు గుర్తుగా (9,230) ఈ రెడ్ కలర్ బూట్ల ధరను రూ.9,230 గా నిర్ణయించారు. ఈ సందర్భంగా మీ బూట్ల అమ్మకాలు, లాభాలు పెంచుకోవడానికి మళ్లీ రెడ్ బాల్ (టెస్ట్) క్రికెట్ ఆడతారా? అని సరదాగా అడిగిన ప్రశ్నకు కోహ్లీ నవ్వుతూ సమాధానమిచ్చాడు. “నా బూట్లు తక్కువ అమ్ముడైనా పర్లేదు.. నేను ఆ టెస్ట్ క్రికెట్ ఫేజ్ నుండి ముందుకు సాగిపోయాను” అని అనడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
పోరాట పటిమపై కోహ్లీ..
మ్యాచ్లలో తన ‘నెవర్ గివ్ అప్’ వైఖరి గురించి కోహ్లీ మాట్లాడుతూ.. 2022 టీ20 వరల్డ్కప్లో మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్పై ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్ను గుర్తు చేసుకున్నాడు. “మ్యాచ్ చేజారిపోయింది అనుకున్న తరుణంలో, జట్టును విజయతీరాలకు చేర్చడమే నా నైజం. అలాంటి కఠినమైన పరిస్థితులంటేనే నాకు ఇష్టం” అని చెప్పుకొచ్చాడు.
త్వరలో మైదానంలోకి రీ-ఎంట్రీ..
హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్కు దూరమైన 37 ఏళ్ల కోహ్లీ.. త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. జూలై 14 నుంచి ఇంగ్లాండ్తో వారి స్వదేశంలో జరగబోయే మూడు వన్డేల సిరీస్కు కోహ్లీ ఎంపికయ్యాడు. దీని కోసం బెంగళూరులోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) లో సోమవారం ఫిట్నెస్ టెస్ట్కు హాజరుకానున్నాడు. ఈ సిరీస్తో కోహ్లీ మళ్లీ ఫామ్లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

