Vijayawada Medical Student Dies in Chicago: ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలు ఆవిరయ్యాయి. విజయవాడకు చెందిన వైద్య విద్యార్థిని కారులో ప్రయాణిస్తూ మృతి చెందింది. కారులో గ్యాస్ లీక్ అవ్వడంతో వైద్య విద్యార్థిని దుర్మరణం పాలైంది. యువతి మరణంతో విజయవాడలోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యార్థిని మృతికి సంబంధించి వైద్య నివేదిక రావాల్సి ఉంది.
వివరాల మేరకు.. విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) నగరంలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేసింది. గత ఆగస్టులో ఎంఎస్ చేయడానికి అమెరికాలోని షికాగోకు వెళ్ళింది. బుధవారం కారులో ప్రయాణిస్తుండగా.. గ్యాస్ లీకవడంతో డ్రైవర్తో పాటు జహీరా నాజ్ స్పృహ తప్పారు. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Also Read: IPL 2024 Auction: విరాట్ కోహ్లీ వేలంలోకి వస్తే రూ.42 కోట్లు.. జస్ప్రీత్ బుమ్రాకు రూ.35 కోట్లు పక్కా!
జహీరా నాజ్ మరణ వార్తను ఆమె స్నేహితులు విజయవాడలోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జహీరా నాజ్ మరణంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లిన తమ కూతురు ఇలా చనిపోతుందని ఆశాలు ఊహించలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. జహీరా నాజ్ మృతదేహాన్ని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలనీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.