Tamil Nadu Politics: తమిళనాడు ముఖ్యమంత్రిగా సి. జోసఫ్ విజయ్ (దళపతి విజయ్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, మిత్రపక్షాలపై ఆధారపడకుండా సొంతంగానే పట్టు సాధించాలనే బలమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇది కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యర్థి శిబిరాల్లో నిశ్శబ్దంగా రాజకీయ ఆపరేషన్ నడుస్తోందట. తమిళనాడులో జూన్ 18న జరగనున్న ఒక రాజ్యసభ స్థానం ఉపఎన్నిక ద్వారా తన పార్టీ ‘టీవీకే’ (TVK) ని పార్లమెంటులో అడుగుపెట్టించాలని విజయ్ భావిస్తున్నారు. మేలం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన సి.వి. షణ్ముగం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది. అవినీతిపై కఠిన వైఖరితో, 28 ఏళ్ల సర్వీసులో 25 సార్లు బదిలీలు చేయించుకుని నిజాయితీకి మారుపేరుగా నిలిచిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి యు.సగాయాన్ని రాజ్యసభకు పంపడం ద్వారా అవినీతిపై తమకున్న చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా గత డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రభుత్వాలను కార్నర్ చేయాలని విజయ్ యోచిస్తున్నారు.
ఇదే సమయంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఉపఎన్నికలపై టీవీకే కన్ను పడింది. ఇందులో ఒకటి విజయ్ ఖాళీ చేసిన సీటు కాగా, మిగిలిన మూడు ఏఐఏడీఎంకేను వీడి టీవీకేలో చేరిన ఎమ్మెల్యేల రాజీనామాలతో ఖాళీ అయినవి. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు కె. మరగథం కుమారవేల్ (మదురాంతకం), ఎస్. జయకుమార్ (పెరుందురై), పి. సత్యభామ (ధరాపురం)లు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను కలిసి తమ పదవులకు రాజీనామా చేశారు. ఇందులో ధరాపురం, పెరుందురై స్థానాలు ఏఐఏడీఎంకేకు సాంప్రదాయక కోటలు కాగా, మదురాంతకం చెన్నై సమీపంలోని కీలక స్థానం. నిజానికి సి.వి. షణ్ముగం నాయకత్వంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న 25 మంది ఎమ్మెల్యేలలో కొందరిని క్యాబినెట్లోకి తీసుకోవాలని మొదట చర్చలు జరిగాయి, కానీ వామపక్షాలు, వీసీకే, టీవీకేలోని కొందరు నేతల ఒత్తిడి కారణంగా ఆ ప్లాన్ హఠాత్తుగా డ్రాప్ అయింది. ఇప్పుడు రాజీనామా చేసిన ఈ ముగ్గురు నేతలు టీవీకే అధికారిక గుర్తు ‘విజిల్’ (Whistle) పై పోటీ చేసి గెలిచిన తర్వాత పూర్తిస్థాయి టీవీకే ఎమ్మెల్యేలుగా మారతారు, అప్పుడు కూటమి భాగస్వాములకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అయితే ఇక్కడితోనే ఈ వలసల సిల్సిలా ఆగేలా లేదు. రాబోయే రోజుల్లో మరో 7 నుండి 8 మంది ఎమ్మెల్యేలు ఇదే దారిలో రాజీనామా చేయవచ్చని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం 107 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీవీకే (రెండు చోట్ల గెలిచిన విజయ్ ఒక సీటు వదులుకోవడంతో 108 నుంచి 107కి తగ్గింది), ఈ ఉపఎన్నికలన్నింటిలో గెలిస్తే బలం 111కి చేరుతుంది.
తమిళనాడులో మేజిక్ ఫిగర్ 118 కాగా, ప్రస్తుత ప్రభుత్వానికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. ఒకవేళ ఉపఎన్నికల కంటే ముందే మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరితే మిత్రపక్షాలపై ఆధారపడటం తగ్గిపోతుంది. అత్యధికంగా 5 సీట్లున్న కాంగ్రెస్ నుంచి సులభంగా విముక్తి పొందవచ్చు. విజయ్ లాంటి ప్రజాకర్షక నేత చుట్టూ ఏర్పడిన మొదటి తరం రాజకీయ పార్టీ, ఎన్నికల తర్వాతి పొత్తులపై ఎక్కువ కాలం ఆధారపడకూడదని టీవీకే సీనియర్లు భావిస్తున్నారు. ప్రభుత్వ స్థిరత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగితే రాజకీయ వాతావరణం మారుతుందని ఒక సీనియర్ నేత పేర్కొన్నారు. విజయ్ అనుసరిస్తున్న ఈ వ్యూహం జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాను పోలి ఉంది. అయితే ఉమర్ ఎన్నికల ముందే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోగా, విజయ్ ఎన్నికల తర్వాత జతకట్టారు. కశ్మీర్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరకపోవడంతో ఉమర్ అబ్దుల్లా కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా అక్కడ కూటమి నామమాత్రంగానే మిగిలిపోయింది (అక్కడ కాంగ్రెస్కు 6 గురు ఎమ్మెల్యేలు ఉన్నారు). అలాగే గతంలో 2013లో ఢిల్లీలో కేజ్రీవాల్ మెజారిటీ లేక కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఆ తర్వాతే సొంత బలం సాధించారు. కానీ విజయ్ ఈ ప్రక్రియను ఇప్పుడే పూర్తి చేయాలని చూస్తున్నారు.
