Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?

Congress

Congress

Vande Mataram Controversy: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ అనంతరం జరిగిన ‘వందేమాతరం’ గీతాలాపన రాజకీయ దుమారానికి దారితీసింది. సాధారణంగా గీతంలోని మొదటి విభాగాన్ని మాత్రమే పాడటం ఆనవాయితీ కాగా, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ తర్వాత కూడా ఆలపించడం కొనసాగించారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు పాటను నిలిపివేయాలని సైగలు చేసినప్పటికీ కార్యకర్తలు పాడుతూనే ఉన్నారు. పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ సేవా దళ్ మాజీ అధ్యక్షుడు లాల్‌జీ దేశాయ్ జోక్యం చేసుకుని, గీతాన్ని పూర్తి చేయించారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత రాహుల్, సోనియా ఇద్దరూ దేశాయ్‌తో ఈ విషయమై చర్చించడం కనిపించింది.

పాట నిగమనాన్ని అడ్డుకునేందుకు అధినేతలు ప్రయత్నించిన సమయంలో లాల్‌జీ దేశాయ్ వారికి నచ్చజెప్పి గీతాన్ని కొనసాగించేలా చూశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో భారతీయ జనతా పార్టీ (BJP) కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోనే జాతీయ గేయానికి అడ్డంకులు సృష్టించడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ నాయకుడు షానవాజ్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో కూడా వందేమాతరం విషయంలో ఇలాంటి వివాదాలు వచ్చాయని గుర్తుచేసిన ఆయన, ఎర్రకోటలో జరిగిన ప్రధాన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు గైర్హాజరు కావడంపైనా ప్రశ్నలు గుప్పించారు.

బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ గట్టిగా తిప్పికొట్టారు. అక్కడేమీ వివాదం జరగలేదని, చాలా సేపటి నుంచి నుంచుని ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూర్చోమని మాత్రమే సోనియా గాంధీ సూచించారని ఆయన స్పష్టత ఇచ్చారు. బీజేపీ కావాలనే ఈ ఘటనను వక్రీకరిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా 1937 అక్టోబర్ 28న కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని జైరాం రమేష్ ప్రస్తావించారు. నాటి సమావేశంలో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిన సలహా మేరకు, కాంగ్రెస్ కార్యక్రమాల్లో వందేమాతరం ప్రారంభ పంక్తులను మాత్రమే ఆలపించాలని నిర్ణయించారని, దాన్నే ఒక సాంప్రదాయంగా పాటిస్తున్నామని గుర్తుచేశారు. ఇదే క్రమంలో ఎర్రకోటపై ప్రధాని చేసిన ప్రసంగాన్ని ఎద్దేవా చేస్తూ, 12 ఏళ్లు గడిచినా ఆయన మాటల్లో ఎలాంటి కొత్తదనం లేదని విమర్శించారు.