బీసీసీఐ రాబోయే 2026 ఆసియా క్రీడల కోసం 30 మంది ప్రాబబుల్స్ (ఎంపికయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లు) జాబితాను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)కు సమర్పించింది. అయితే ఈ భారీ జాబితాలో ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ పేర్లు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో ఈ ఆసియా క్రీడలు జరగనున్నాయి. అదే సమయంలో వెస్టిండీస్తో భారత జట్టు స్వదేశంలో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్లు ఒకే సమయంలో వస్తుండటంతో, బిసిసిఐ ఒకేసారి రెండు వేర్వేరు భారత జట్లను ఎంపిక చేయక తప్పడం లేదు. వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్కు గిల్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకే అతడిని ఆసియా క్రీడల రేసు నుండి తప్పించారు. అంతే కాకుండా.. భవిష్యత్ ఒలింపిక్స్ (2028), తదుపరి టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో సూర్యకుమార్ పేరు లేనట్లు తెలుస్తోంది. అందుకే అతడిని ఈ జాబితాలో చేర్చలేదు.
యువ సంచలనానికి చోటు..
ఇటీవల వార్తల్లో నిలిచిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఈ 30 మంది జాబితాలో చోటు దక్కింది. అలాగే గత ఆసియా క్రీడల్లో భారత్కు బంగారు పతకాన్ని అందించిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను కూడా ఎంపిక చేశారు.
ఈ ఆసియా క్రీడల జట్టుకు శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ లేదా తిలక్ వర్మలలో ఒకరు కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది. బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా పేరు ఉన్నప్పటికీ, అతడు వెస్టిండీస్ సిరీస్ ఆడేందుకే మొగ్గు చూపవచ్చు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ కూడా ఈ రేసులో ఉన్నారు. స్పిన్నర్లలో కుల్దీప్, అక్షర్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబేలలో ఇద్దరిని ఆసియా క్రీడలకు, మిగిలిన ఇద్దరిని వెస్టిండీస్ సిరీస్కు ఎంపిక చేయనున్నారు.
ముఖ్యమైన ఆటగాళ్ల జాబితా..
యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, శివమ్ దూబే తదితరులు ఈ 30 మంది ప్రాబబుల్స్ జాబితాలో ఉన్నారు.
