US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

  • శాంతి దిశగా పశ్చిమాసియా
  • చర్చలు దిశగా అమెరికా-ఇరాన్ అడుగులు
  • కీలక ప్రకటన చేసిన ఇరాన్ విదేశాంగ శాఖ
Iranus

Iranus

హమ్మయ్య.. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందం కుదిరే అవకాశాలు మరింత బలపడుతున్నాయని.. ఇరు దేశాలు ఒప్పందానికి ఇప్పటివరకు ఎన్నడూ లేనంత దగ్గరగా వచ్చాయని పేర్కొన్నారు.

శుక్రవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో అరాఘ్చీ స్పందించారు.. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలపై ఆశావహ వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికా-ఇరాన్ చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన ఇస్లామాబాద్ పేరుతో రూపొందిస్తున్న ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ తుది దశకు చేరుకుందని తెలిపారు. “ఈ అవగాహన ఒప్పందం ఖరారుకు ఇప్పటివరకు ఎన్నడూ లేనంత దగ్గరగా వచ్చాం. తుది నిర్ణయం వెలువడే వరకు మీడియా ఊహాగానాలకు దూరంగా ఉండాలి” అని అరాఘ్చీ పేర్కొన్నారు.

×
×
Ad

ఊహాగానాలపై హెచ్చరిక

ఇటీవల ఇరాన్‌కు చెందిన పలు మీడియా సంస్థలు అమెరికాతో చర్చిస్తున్న ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా వివరాలను ప్రచురించాయి. ఒప్పందంలో ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన నిధుల విడుదల, కాల్పుల విరమణ వంటి అంశాలు ఉన్నాయని కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వివరాలపై అధికారికంగా స్పందించిన అరాఘ్చీ.. తుది ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని, మీడియాలో వస్తున్న కథనాలపై ముందస్తు నిర్ణయాలకు రావద్దని సూచించారు.

ఫిబ్రవరిలో ప్రారంభమైన ఘర్షణల అనంతరం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అయితే ఇటీవల ఖతార్, పాకిస్థాన్ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో చర్చలు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఆంక్షల సడలింపు, హార్ముజ్ జలసంధి సమస్య, అణు కార్యక్రమంపై భవిష్యత్ చర్చలు వంటి అంశాలపై ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం.

ప్రపంచ దృష్టి ఒప్పందంపైనే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇటీవల ఒప్పందం త్వరలో కుదిరే అవకాశముందని వ్యాఖ్యానించారు. అయితే ఒప్పందంలోని కొన్ని అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే.. మధ్యప్రాచ్యంలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు త్వరలోనే ముగింపు పలికే చారిత్రాత్మక ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.