Site icon NTV Telugu

Father Fights Crocodile: కన్నప్రేమ ముందు ఓడిన మృత్యువు.. కుమారుడి కోసం మొసలితో పోరాడిన తండ్రి!

Father Fights Crocodile

Father Fights Crocodile

Father Fights Crocodile: ఉత్తరప్రదేశ్‌లోని జెహానాబాద్ పరిధిలోని నగరీయ సహగవాన్ గ్రామానికి చెందిన ప్రేమ్ శంకర్ తన 14 ఏళ్ల కుమారుడు మోహిత్ కుమార్‌తో కలిసి పొలానికి వెళ్లాడు. నదీ తీరానికి సమీపంలో ఉన్న ఆ పొలంలో వారు గోధుమ పంట కోత పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో మోహిత్ అనుకోకుండా నదికి దగ్గరగా వెళ్లగా, నీటిలో మాటు వేసిన ఒక భారీ మొసలి ఒక్కసారిగా ఆ పిల్లడిపై విరుచుకుపడింది. తేరుకునేలోపే ఆ బాలుడిని తన దవడలతో పట్టుకుని నీటిలోకి లాగడం ప్రారంభించింది. కుమారుడి ఆర్తనాదాలు విన్న తండ్రి ప్రేమ్ శంకర్ క్షణం కూడా ఆలోచించలేదు. చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోయినా, కొడుకును కాపాడుకోవాలనే మొండి ధైర్యం, పట్టుదలతో నేరుగా మొసలిపైకి లంఘించాడు. ప్రాణాలకు తెగించి ఆ భయంకరమైన జీవితో పోరాటం చేశాడు. కొన్ని నిమిషాల పాటు సాగిన ఈ భీకర పెనుగులాటలో మొసలి పట్టు సడలేలా చేసి, తన కుమారుడిని దాని నోటి నుంచి బయటకు లాగగలిగాడు.

READ ALSO: VeeraBhadrudu : సూర్య ‘కరుప్పు’ తెలుగు టైటిల్ ఫిక్స్!

తీవ్రంగా గాయపడిన మోహిత్‌ను తండ్రి వెంటనే పిలిభిత్ జిల్లా ఆసుపత్రికి తరలించాడు. వైద్యుల కథనం ప్రకారం.. బాలుడికి తీవ్ర గాయాలైనప్పటికీ, ప్రస్తుతం ప్రాణాపాయం తప్పిందన్నారు. ప్రస్తుతం మోహిత్ కోలుకుంటున్నాడని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే అటవీ శాఖ రేంజర్ కౌషేంద్ర నేతృత్వంలోని బృందం గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించింది. ఈ ఘటనతో స్థానిక గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నదీ తీర ప్రాంతాల్లో మొసళ్ల సంచారం పెరిగిపోయిందని, పొలాల్లోకి వెళ్లాలంటేనే భయమేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ మొసలిని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, చెరువుల దగ్గరకు వెళ్లవద్దని హెచ్చరించారు.

READ ALSO: Sharwanand : ‘రాజశేఖర్ గారిని చూస్తే అసూయగా ఉంది..’ శర్వానంద్ వైరల్ కామెంట్స్!

Exit mobile version