Site icon NTV Telugu

Budget 2026 Expectations: బడ్జెట్‌పై నిరుద్యోగుల ఆశలు.. రైతుల గోస.. సామాన్యుడి ఆకలి తీరేనా?

Nirmala

Nirmala

Budget 2026 Expectations: నేడు పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ 2026-27ను ప్రవేశ పెట్టనున్నారు. ప్రపంచంలో ఉద్రిక్తతల మధ్య ఈ బడ్జెట్ కొనసాగుతోంది. ఈసారి బడ్జెట్‌పై దేశమంతా ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. చరిత్రలో తొలిసారి ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఏమి ప్రకటిస్తారో అన్న ఉత్కంఠతో సామాన్యుడు నుంచి రైతు వరకూ అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్‌ నుంచి ముందు వరుసలో ఉన్న ఆశలు విద్య, ఉద్యోగాల గురించే. పిల్లలు ఎక్కువగా చదవడం కంటే మంచి చదువు రావాలన్నది ప్రధాన కోరిక. పుస్తకాలతో పాటు ఆధునిక నైపుణ్యాలు కూడా నేర్పాలి అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ, స్కిల్ ఆధారిత చదువు స్కూల్‌ నుంచి కాలేజ్ వరకు ఉండాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఆన్‌లైన్ చదువుకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని, అందుకు తగ్గ శిక్షణ ఉన్న ఉపాధ్యాయులను నియమించాలని ఆశిస్తున్నారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరకాలన్నదే విద్యార్థుల కల. అందుకే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పెంచాలని, స్కాలర్‌షిప్‌లు, తక్కువ వడ్డీతో విద్యా రుణాలు మరింత అందుబాటులోకి తేవాలని విద్యార్థులు ఆశగా చూస్తున్నారు.

READ MORE:” Union Budget 2026 live Updates: దేశం చూపు పార్లమెంట్‌పై.. ట్యాక్స్ ఊరట వస్తుందా? లైవ్‌ అప్డెట్స్ మీకోసం..

రైతుల ఆశలు కూడా ఈ బడ్జెట్‌పై భారీగా ఉన్నాయి. పెరుగుతున్న ఖర్చుల మధ్య సాగు చేయడం కష్టమవుతున్నందున తమ ఆదాయం పెరగాలని వారు కోరుతున్నారు. పీఎం కిసాన్ పథకంలో ఇప్పుడున్న ఏడాదికి ఆరు వేల రూపాయల సహాయం సరిపోవడం లేదని, దాన్ని పన్నెండు వేల రూపాయలకు పెంచాలని రైతులు కోరుతున్నారు. పంటలకు వచ్చే కనీస మద్దతు ధరను కూడా పెంచాలని, ముఖ్యంగా పప్పులు, నూనె గింజలు, రబీ, ఖరీఫ్ పంటలకు మంచి ధర రావాలని ఆశిస్తున్నారు. పంట బీమా ప్రీమియం తగ్గితే నష్టం వచ్చినా కొంత భరోసా ఉంటుందని భావిస్తున్నారు. పండించిన పంటను నిల్వ చేసుకునే గోదాముల సదుపాయం పెంచాలని, ఎరువుల ధరలు తగ్గించాలని కూడా రైతుల డిమాండ్లు. సామాన్య ప్రజల దృష్టిలో బడ్జెట్ అంటే ముందుగా గుర్తొచ్చేది ధరలే. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గితేనే కుటుంబ బడ్జెట్ కుదుటపడుతుంది. ఆహారం, దుస్తులు, ఇల్లు వంటి అవసరాలు తక్కువ ఖర్చుతో దొరకాలని ప్రజలు కోరుకుంటున్నారు. జీఎస్టీలో మరింత మార్పులు చేసి పన్ను భారం తగ్గిస్తే సరుకుల ధరలు తగ్గుతాయని, దాని లాభం నేరుగా తమకు చేరుతుందని సామాన్యుడు ఆశిస్తున్నాడు. మహిళలకు కూడా ఈ బడ్జెట్‌పై పెద్ద అంచనాలే ఉన్నాయి. స్వయం ఉపాధి మొదలుపెట్టాలనుకునే మహిళలకు సులభంగా రుణాలు లభించాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లో మహిళలకు పన్ను రాయితీలు, తక్కువ వడ్డీ రుణాలు అందించాలని ఆశిస్తున్నారు. కొత్త పథకాలు, సబ్సిడీలతో మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెంచాలని భావిస్తున్నారు. మహిళల భద్రత, ఆరోగ్యం, సామాజిక సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయిస్తే వారు మరింత ధైర్యంగా ముందుకు వెళ్లగలరని విశ్వసిస్తున్నారు.

READ MORE: Ishan Kishan Century: టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ.. ఎలైట్ లిస్ట్‌లో ఇషాన్ కిషన్!

Exit mobile version