UAE: మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం సోషల్ మీడియా నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు చేపట్టింది. రెచ్చగొట్టే వీడియోలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలపై మొత్తం 35 మందిని అరెస్టు చేయాలని అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షంసీ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో అత్యధికులు భారతీయులే కావడం గమనార్హం.
READ ALSO: Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు
అసలు వివాదం ఏమిటంటే..
ఇటీవల ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడులకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని యుఏఈ ప్రభుత్వం నిషేధించింది. అయితే, ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొందరు వ్యక్తులు కల్పిత వీడియోలను సృష్టించి ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి ప్రయత్నించారని ‘వామ్’ (WAM) వార్తా సంస్థ వెల్లడించింది. నిందితులు చేసిన తప్పిదాల ఆధారంగా ప్రభుత్వం వారిని మూడు గ్రూపులుగా విభజించింది.
వీడియో ట్యాంపరింగ్ (10 మంది): క్షిపణి దాడుల పాత వీడియోలకు తమ సొంత గొంతులు, తప్పుడు వ్యాఖ్యానాలను జోడించి, ప్రస్తుతం దాడులు జరుగుతున్నట్లు భ్రమ కలిగించినందుకు ఐదుగురు భారతీయులతో సహా 10 మందిపై చర్యలు తీసుకున్నారు.
AI సృష్టించిన నకిలీ క్లిప్లు (7 మంది): కృత్రిమ మేధ (AI)ని ఉపయోగించి యుఏఈలో పేలుళ్లు జరుగుతున్నట్లు కల్పిత వీడియోలు సృష్టించినందుకు ఐదుగురు భారతీయులు సహా ఏడుగురిని గుర్తించారు. వీరు వీడియోలకు యుఏఈ జెండాను చేర్చి అసలైన దృశ్యాలుగా నమ్మించే ప్రయత్నం చేశారు.
శత్రు దేశాలకు మద్దతు (6 మంది): యుఏఈ జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా శత్రు దేశాల సైన్యాన్ని, నాయకులను ప్రశంసిస్తూ వీడియోలు చేసినందుకు ఐదుగురు భారతీయులు, ఒక పాకిస్థానీపై కేసు నమోదైంది.
భారీ జరిమానా.. జైలు శిక్ష!
ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 35 మందిలో 19 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి యుఏఈ చట్టాల ప్రకారం కనీసం ఒక ఏడాది జైలు శిక్షతో పాటు 1,00,000 దిర్హామ్ల (సుమారు రూ.22.5 లక్షలు) వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. యుఏఈలో నివసిస్తున్న భారతీయులు ఎవరూ కూడా యుద్ధ వాతావరణానికి సంబంధించిన దృశ్యాలను లేదా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని భారత ప్రభుత్వం, అక్కడి అధికారులు హెచ్చరించారు. దేశ భద్రతకు భంగం కలిగించే ఏ చిన్న చర్యకైనా కఠిన శిక్షలు తప్పవని యుఏఈ స్పష్టం చేసింది.
