Two earthquakes hit Nepal within 2 hours, no casualties reported: శుక్రవారం తెల్లవారుజామున నేపాల్లో రెండు గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. ఒకటి మోస్తరుగా, మరొకటి తేలికపాటి తీవ్రతతో సంభవించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో మొదటి భూకంపం రాత్రి 11:58 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సంభవించగా, శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటలకు 5.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.8, 5.9 తీవ్రతతో రెండు భూకంపాలు రాత్రిపూట నేపాల్ను తాకాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. రెండు భూకంపాలు రెండు గంటల వ్యవధిలోనే సంభవించాయని నేపాల్లోని సుర్ఖేత్ జిల్లాలో ఉన్న భూకంప కేంద్ర అధికారి రాజేష్ శర్మ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.
Read Also: Manipur: సీఎం పాల్గొనబోతున్న కార్యక్రమ వేదికకు నిప్పు.. ఆ జిల్లాలో ఇంటర్నెట్ బంద్
భూకంపంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.ఇటీవల కాలంలో నేపాల్లో తరుచూ భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ప్రభావంతో ఢిల్లీతోపాటు రాజస్థాన్లోనూ ప్రకంపనలు సంభవించాయి. 2015, ఏప్రిల్ 25న నేపాల్లో రిక్టర్ స్కేల్పై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. సెంట్రల్ నేపాల్ ఖాట్మండులో సంభవించిన ఈ భూకంపం కారణంగా 9,000 మంది మరణించారు. అనేక వేల మంది గాయపడ్డారు. ఖాట్మండు, ఇతర సమీప పట్టణాలలో 600,000 కంటే ఎక్కువ నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.
