తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా భౌగోళిక, పరిపాలనా సమస్యలను ఎదుర్కొంటున్న ఐదు గ్రామ పంచాయతీల విలీనంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. భద్రాచలం మండలానికి ఆనుకుని ఉండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు భౌగోళికంగా తెలంగాణ భూభాగం మధ్యలో ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి వివరించారు. ఈ గ్రామాలు ఏపీకి ‘ఎంక్లేవ్’లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే ప్రజలు 8 గంటల పాటు ప్రయాణించాల్సి వస్తోందని, అందువల్ల పరిపాలనా సౌలభ్యం కోసం వీటిని తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.
దీంతో పాటు భక్తుల భద్రత , సాగునీటి రంగాలకు సంబంధించిన అంశాలపై కూడా మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి సారించారు. భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరదల నుంచి రక్షించే కరకట్టలోని 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతినడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతం ఏపీ పరిధిలో ఉండటం వల్ల నిర్వహణ సమస్యలు వస్తున్నాయని, తక్షణమే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 16 వేల ఎకరాలకు సాగునీరు అందించే పెద్దవాగు ప్రాజెక్ట్ పునరుద్ధరణ కోసం అయ్యే రూ.92.20 కోట్ల వ్యయాన్ని రెండు రాష్ట్రాలు 85:15 నిష్పత్తిలో భరించాలని ప్రతిపాదించారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కింద సాగయ్యే భూమిలో 85 శాతానికి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటంతో, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహకారం అందించాలని కోరారు.
చివరగా ఆధ్యాత్మిక , మౌలిక వసతుల కల్పనపై మంత్రి కీలక విజ్ఞప్తులు చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తుల వసతి కోసం సుమారు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరడంతో పాటు, ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి టీటీడీ సహకరించాలని అభ్యర్థించారు. అలాగే సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-అమరావతి రైల్వే లైన్ల నిర్మాణానికి రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల చేసిన ఈ ప్రతిపాదనల పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో, సాగునీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , భక్తుల సౌకర్యాల విషయంలో త్వరలోనే వేగవంతమైన పురోగతి లభిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
