Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో శీతాకాల విడిది కోసం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ నెల 23 వరకు ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్:
డిసెంబర్ 18 (ఈరోజు) సికింద్రాబాద్‌లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు.
డిసెంబర్ 19న (రేపు) హైదరాబాద్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
డిసెంబర్ 20న (ఎల్లుండి) యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత మరియు స్పిన్నింగ్ యూనిట్‌తో పాటు థీమ్ పెవిలియన్‌ను రాష్ట్రపతి సందర్శిస్తారు.
అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లో రాష్ట్రపతి ఎంఎన్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
డిసెంబర్ 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.
డిసెంబర్ 22న రాష్ట్రంలోని ప్రముఖులు, ప్రముఖ పౌరులు, విద్యావేత్తలు మొదలైన వారికి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తారు.
డిసెంబర్ 23న రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

 

*పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జులు వీరే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాక.. లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి బాధ్యతలు అప్పజెప్పింది. ఇంఛార్జీలుగా నియమించిన వారిలో ముఖ్యమంత్రితో పాటు అందరూ మంత్రులే ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు నియోజకవర్గాలకు ఇంఛార్జీలుగా ఉన్నారు.
చేవెళ్ల, మహబూబ్ నగర్- రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజక వర్గాలు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆదిలాబాద్- సీతక్క
పెద్దపల్లి- శ్రీధర్ బాబు
కరీంనగర్- పొన్నం ప్రభాకర్
నిజామాబాద్- జీవన్ రెడ్డి
జహీరాబాద్- సుదర్శన్ రెడ్డి
మెదక్- దామోదర రాజనర్సింహ
మల్కాజిగిరి- తుమ్మల నాగేశ్వరరావు
నాగర్ కర్నూల్- జూపల్లి
నల్గొండ- ఉత్తమ్
భువనగిరి- కోమటిరెడ్డి వెంకటరెడ్డి
వరంగల్- కొండా సురేఖ
మహబూబాబాద్, ఖమ్మం- పొంగులేటి

 

*జనసేనకు షాక్‌.. వైసీపీలో చేరిన కీలక నేతలు
ఏపీలో జనసేన పార్టీకి మరో బిగ్‌షాక్‌ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో జనసేనకు చెందిన పలువురు కీలక నేతలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్‌ సుధీర్‌ వైసీపీలో చేరారు. రామ్‌సుధీర్‌తో పాటు జనసేన స్ధానిక నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్‌లు వైసీపీలో చేరారు. కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్‌ పాల్గొన్నారు. జనసేన విధానాలు నచ్చక ఎడ్లపల్లి రాం సుధీర్ వైసీపీలో చేరారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జగన్ పాలన మెచ్చి కలసి పని చేయాలని పార్టీలో చేరారని.. ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒక్కరేనన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని.. చంద్రబాబుకు తాబేదారుగా ఉంటూ మోస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని చంద్రబాబుకు మద్దతు ఇవ్వొద్దని జనసేన నేతలను కోరుతున్నామని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. రాబోయే రోజుల్లో మంచి జరగాలంటే జగన్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. రేపట్నుంచి ఇంకా చాలా మంది జనసేన నుంచి వైసీపీలో చేరబోతున్నారని ఆయన చెప్పారు. అందరికీ వైసీపీ ఆహ్వానం పలుకుతుందన్నారు. టీడీపీతో జనసేన ముసుగు రాజకీయాలు చేస్తోందని వైసీపీలో చేరిన ఎడ్లపల్లి రాంసుధీర్‌ చెప్పారు. పవన్ నాయకత్వాన్ని బలపరిచేందుకు మేమంతా పని చేశామని.. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచారన్నారు. పార్టీలో ఉంటే ఉండండి.. లేదంటే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారని.. పని చేసినందుకు మాపై కోవర్టు ముద్ర వేశారన్నారు. పవన్ కళ్యాణ్‌ను ముసుగు రాజకీయాలు చేయవద్దని కోరుతున్నామని ఆయన అన్నారు. పని చేసే కార్యకర్తలను, నాయకులను పవన్ కళ్యాణ్ కాపాడుకోవాలన్నారు. పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అని పవన్ మాట్లాడటం సరికాదన్నారు. జగన్ సంక్షేమ పాలన నచ్చి వైసీపీలో చేరానని ఎడ్లపల్లి రాంసుధీర్‌ స్పష్టం చేశారు.

 

*మార్పులు చేర్పులపై వైసీపీ అధిష్ఠానం ఫోకస్.. నేతల్లో నెలకొన్న దడ!
ఏపీలో వైసీపీ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు పలు సీట్లపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. సెకండ్ ఫేజ్ మార్పుల కోసం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నేరుగా రంగంలోకి దిగారు. ఒకటి, రెండు రోజుల్లో కొత్త సమన్వయకర్తలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంతనాలు సాగుతున్నాయి. విజయమే ప్రామాణికంగా మార్పులు చేర్పుల గురించి నేతలకు సీఎం వివరిస్తున్నారు. సీటు నిరాకరిస్తున్న వారికి భవిష్యత్‌పై ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా నిర్ణయాలు తప్పటం లేదని సీఎం వివరిస్తున్నారు. ప్రస్తుతం సీఎంవో నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేల గుండెల్లో దడ పుడుతోంది. సీఎం జగన్‌ ఎన్నికల కసరత్తును వేగవంతం చేశారు. ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉందో వారిని మార్చేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. మరో జాబితా సిద్దంగా ఉంది. పలువురు ఎమ్మెల్యేలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించారు సీఎం జగన్. అందులో భాగంగా గోదావరి ,గుంటూరు జిల్లాలకు చెందిన వారికి సీఎంఓ నుంచి పిలుపు రావటంతో గోదవరి జిల్లాల్లోని పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, చింతలపూడి, రామచంద్రాపురం ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి చెల్లుబోయిన వేణు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబులు వచ్చారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, రాజమండ్రి ఎమ్పీ మార్గాని భరత్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేల మద్దాల గిరిలు కూడా సీఎంఓకు వచ్చారు. ఒక్కొక్కరితో వేర్వేరుగా సీఎం జగన్ సమావేశం అవుతున్నారు. ఎవరికి ఏ కారణంతో టికెట్ నిరాకరిస్తుందీ సీఎం వివరిస్తున్నారు. వారి స్థానంలో నియమించే వారి సమాచారం అందిస్తున్నారు. సహకరించాలని సూచిస్తున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. అభ్యర్థుల ఖరారుపై ఈ రోజు నుంచి మూడు రోజుల సమావేశాలకు సీఎం నిర్ణయించారు. ఎమ్మెల్యేలతో నేరుగా ముఖ్యమంత్రి సమావేశమవుతున్నారు. ఇదిలా ఉండగా.. వచ్చే వారం ఎంపీలతో సీఎం సమావేశం కానున్నారు. ఏ క్షణంలో అయినా నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల మార్పుపై అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

 

*రాష్ట్రాలకు కేంద్రం కొవిడ్ అలర్ట్‌.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్లను సిద్ధం చేయాలని, కొవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. JN.1 వేరియంట్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అలర్ట్ జారీ చేసింది. కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కరకుళం నుంచి తేలికపాటి లక్షణాలతో 79 ఏళ్ల మహిళ నుంచి తీసుకున్న నమూనాలో కొత్త కరోనావైరస్ వేరియంట్ JN.1 మొదటి కేసు కనుగొనబడిన తర్వాత కేంద్రం రాష్ట్రాలకు అలర్ట్‌ జారీ చేసింది. ఇంతకుముందు, తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన ఒక ప్రయాణికుడు సింగపూర్‌లో JN 1 సబ్-వేరియంట్‌తో గుర్తించబడ్డాడు. రాబోయే పండుగ సీజన్‌ను పరిగణనలోకి తీసుకుంటే, శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి అవసరమైన ప్రజారోగ్య చర్యలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం పేర్కొంది. జిల్లాల వారీగా ఇన్‌ఫ్లుయెంజ్ లాంటి అనారోగ్యం, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల కేసులను అన్ని ఆరోగ్య సదుపాయాలలో క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, నివేదించాలని, ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా వివరాలను అప్‌డేట్ చేయాలని సలహా రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రాలు అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు ఉండేలా చూడాలని కూడా పేర్కొంది. కొవిడ్ యొక్క JN.1 వేరియంట్ ఓమిక్రాన్ సబ్-వేరియంట్ BA.2.86 లేదా పిరోలా వారసుడిగా పరిగణించబడుతుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఇది మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్‌లో సెప్టెంబర్ 2023లో కనుగొనబడింది. చైనా డిసెంబర్ 15న నిర్దిష్ట సబ్-వేరియంట్‌లో ఏడు ఇన్ఫెక్షన్‌లను గుర్తించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, BA.2.86 స్పైక్ ప్రోటీన్‌పై మొత్తం 20 ఉత్పరివర్తనాలను కలిగి ఉంది. ఇది ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే వైరస్‌లు హోస్ట్ కణాలను లాక్ చేయడానికి స్పైక్ ప్రోటీన్‌లను ఉపయోగిస్తాయి. JN.1 వేరియంట్ లక్షణాలు ఏంటంటే.. తేలికపాటి జ్వరం, దగ్గు, నాసికా భాగాలలో అసౌకర్యం, గొంతు నొప్పి, ముక్కు కారటం, ముఖం లోపల నొప్పి లేదా ఒత్తిడి, తలనొప్పి, జీర్ణశయాంతర సమస్యలు. దాని వ్యాప్తి కారణంగా JN.1 కోవిడ్ ఆధిపత్య జాతిగా మారిందని, దాని నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని నిపుణులు గమనించారు.

*మరోసారి కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు
ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది. డిసెంబరు 21వ తేదీన ఏజెన్సీ ముందు హాజరు కావాలని ఆయనను కోరింది. అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపడం ఇది రెండోసారి. అరవింద్ కేజ్రీవాల్‌ను నవంబర్ 2న తన ముందు హాజరుకావాలని ఈడీ కోరింది. అయితే ఇది చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సమన్లను దాటవేశారు. ఇదే కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా సీబీఐ ప్రశ్నించింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నోత్తరాల అనంతరం మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్.. దర్యాప్తు సంస్థ తనను 56 ప్రశ్నలు అడిగిందని చెప్పారు. “సీబీఐ తొమ్మిదిన్నర గంటలపాటు ప్రశ్నించింది. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాను. ఆరోపించిన మద్యం కుంభకోణం అంతా తప్పుడు, నీచ రాజకీయం. వారు ఆప్‌ని అంతమొందించాలనుకుంటున్నారు కానీ దేశ ప్రజలు మా వెంటే ఉన్నారు” అని కేజ్రీవాల్ అన్నారు.

 

*కర్ణాటకలో భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసిన ఎన్ఐఏ
దేశంలోని ఐసిస్ తో సంబంధం ఉన్న ప్రాంతాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దాడులు చేసింది. దక్షిణాది రాష్ట్రాలోని మొత్తం 19 ప్రదేశాలలో ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ దాడిలో ఎన్ఐఏ బృందాలు ఎనిమిది మంది ఐసిస్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు, కార్యకలాపాలను ప్రోత్సహించడంలో వారు నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు, మహారాష్ట్రలోని అమరావతి, ముంబై, పుణె, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్, బొకారో, ఢిల్లీలోని ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు చేసింది. ఈ రైడ్స్ లో పేలుడు పదార్థాలు సల్ఫర్, పొటాషియం నైట్రేట్, బొగ్గు, గన్‌పౌడర్, చక్కెర, ఇథనాల్ వంటి రసాయనాలను కూడా NIA స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. పదునైన ఆయుధాలు, భారీగా నగదు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డిజిటల్ పరికరాలతో పాటు నేరారోపణ పత్రాలు ఉన్నాయి. ఉగ్రవాద ముఠాకి సూత్రధారిగా ఉన్న మీనాజ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ఎనిమిది మందిలో.. సయ్యద్ సమీర్‌, ముంబైకి చెందిన అనాస్ ఇక్బాల్ షేక్, బెంగళూరులో మహ్మద్ మునీరుద్దీన్, సయ్యద్ సమీవుల్లా అలియాస్ సమీ, మహ్మద్ ముజమ్మిల్‌ ఉన్నారు. ఢిల్లీకి చెందిన షాయాన్ రెహ్మాన్ అలియాస్ హుస్సేన్, జంషెడ్‌పూర్‌కు చెందిన మహ్మద్ షాబాజ్ అలియాస్ జుల్ఫీకర్ అలియాస్ గుడ్డులను అరెస్టు చేశారు. భారతదేశంలో పనిచేస్తున్న అనేక ఐసిస్ మాడ్యూళ్లను ఛేదించడానికి ఎన్ఐఏ 24 గంటలు పనిచేస్తోంది. ఈ క్రమంలో.. దేశంలోని పలు చోట్ల ముమ్మరంగా దాడులు నిర్వహిస్తోంది. డిసెంబరు 9న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 44 మందిని అరెస్టు చేసింది. తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న అనుమానితులపై డిసెంబర్ 13 న.. ఎన్ఐఏ బెంగళూరులోని అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.

*గ్యాంగ్‌స్టర్‌ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం!.. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్‌ డౌన్‌
భారతదేశపు అతిపెద్ద శత్రువు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందన్న వార్త తర్వాత సోషల్ మీడియాలో అనేక వాదనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో తలదాచుకున్న దావూద్ విషప్రయోగం చేశారన్న ఆరోపణలతో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ట్విట్టర్ వేదికగా చాలా మంది దావూద్‌కు విషప్రయోగం చేశారని, ఆ తర్వాత అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు అతను చికిత్స సమయంలో మరణించాడని కూడా చెప్పటం గమనార్హం. దానిని పాకిస్తాన్ దాచిపెడదామనుకుంటుంది. అయితే, ఈ విషయాన్ని ఏ ప్రభుత్వ ఏజెన్సీ లేదా మీడియా ఇంకా ధృవీకరించలేదు. దావూద్ హతమయ్యాడని చందన్ శర్మ అనే వినియోగదారు పేర్కొన్నాడు. దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నట్లయితే దానికి పాకిస్థాన్ రుజువు ఇవ్వాలని సదరు యూజర్ చెప్పాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అంతటా ఇంటర్నెట్ మూసివేయబడింది, సోషల్ మీడియా సరిగ్గా పనిచేయలేదు ఎందుకంటే పాకిస్థానీలు వార్తలను దాచవలసి ఉంటుంది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్‌లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషప్రయోగం వల్ల ఆసుపత్రి పాలయ్యారనే ఊహాగానాల మధ్య విశ్వసనీయ నిఘా వర్గాలు డిసెంబరు 17న సోషల్ మీడియాలో వచ్చిన ఈ పుకార్లను ఖండించాయి. దీంతో పాటు పాకిస్థాన్‌లోని పలు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఇంటర్నెట్ సేవలు పనిచేయడం లేదు. చాలా చోట్ల ఇంటర్నెట్ గణనీయంగా మందగించింది. దావూద్‌కు సంబంధించిన వార్తలను దాచేందుకే ఇంటర్నెట్‌ను నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇమ్రాన్ ఖాన్ వర్చువల్ ర్యాలీ కారణంగానే ఈ స్టెప్ తీసినట్లు కొందరు అంటున్నారు. పొరుగు దేశంలో ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. పాకిస్థాన్ మీడియాలో కూడా దావూద్‌పై విషప్రయోగం జరిగిందనే విషయం చర్చనీయాంశమైంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇంటర్నెట్‌ను మూసేయాలని సూచించారు.

 

*అమెరికాలో కలకలం.. బైడెన్‌ కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్యాయ్‌ని గుర్తు తెలియని వ్యక్తి ఢీ కొట్టిన సంఘటన కలకలం రేపుతోంది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి డెలావర్‌లోని వైట్ హౌజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి వైట్ హౌజ్ ముందు ఓ వ్యక్తి కారుతో బీభత్సం సృష్టించాడు. తన కారుతో బైడెన్ కాన్వాయ్‌ని ఢీ కొట్టాడు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటనతో ప్రపంచమంతా అగ్రరాజ్యం అమెరికా భద్రతా వైఫల్యంపైనే చర్చించుకుంటోంది. వైట్‌హౌజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బైడెన్‌ దంపతులు ఆదివారం రాత్రి డెలావర్‌లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిన్నర్‌ ముగించుకుని ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్‌ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో నిందితుడు అటూగా అతివేగంగా దూసుకువచ్చి దూసుకువచ్చి యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటికే జిల్‌ బైడెన్‌ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్‌ వాహనానికి సమీపంలోనే ఉన్నారు. బైడెన్‌కు కేవలం 130 అడుగుల దూరంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్‌ను వేగంగా అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో బైడెన్‌ దంపతులను వెంటనే వైట్‌హౌస్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*మాస్ మహారాజా మాస్ ట్రీట్ కు ముహూర్తం ఖరారు
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఈ మధ్యనే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పరాజయాన్ని చవిచూసిన రవితేజ .. సంక్రాంతికి ఈగల్ సినిమాను దింపుతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా కావ్య థాపర్, నవదీప్, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ విడుదలైన తర్వాత క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ఇటీవలే విడుదల చేసిన ఈగల్ ఊర మాస్ అంథమ్ ఆడు మచ్చా పాట చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.ఇప్పుడు మేకర్స్ ఈగల్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న ఈగల్ ట్రైలర్ డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ రిలీజ్ డేట్ పోస్టర్ లో రవితేజ పెద్ద మిషన్ గన్ తో ఫైర్ చేసున్న టెర్రిఫిక్ లుక్ లో కట్టిపడేశాడు. టీజర్ తోనే ఈ సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకింది. దీంతో ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈగల్ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో రవితేజ సంక్రాంతి విన్నర్ గా నిలుస్తాడా.. ? లేదా అనేది చూడాలి.

Exit mobile version