NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మహిళా జర్నలిస్టుతో సీపీఎం నేత పాడుబుద్ధి.. ఎఫ్‌ఐఆర్ నమోదు

ప్రజా సేవకుడు అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి. అలాంటిది వాళ్లే మర్యాద తప్పి ప్రవర్తిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్‌లో ఓ సీపీఎం నాయకుడు పాడు బుద్ధి ప్రదర్శించాడు. ఇంటర్వ్యూకు వచ్చిన ఒక మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో సీపీఎం పార్టీ సీరియస్‌గా తీసుకుని సస్పెండ్ చేసింది. తాజాగా అతగాడిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు.. సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తన్మయ్ భట్టాచార్యను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లింది. అయితే తన్మయ్ భట్టాచార్యకు ఏం పాడుబుద్ధి పుట్టిందో.. ఏమో తెలియదు గానీ.. నేరుగా వెళ్లి మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చుకున్నాడు. దీంతో ఆమె ఒకింత షాక్‌కు గురైంది. అనంతరం సోషల్ మీడియాలో వేదికగా తనకు జరిగిన అన్యాయాన్ని పంచుకుంది. తన్మయ్ భట్టాచార్య తనను లైంగికంగా వేధించాడని వాపోయింది.

మాజీ మంత్రి బాలినేని పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు..

మాజీ మంత్రి బాలినినేని శ్రీనివాస్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలులో ఎన్నికల అక్రమాల విషయంలో ఈసీ నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన బాలినేనికి చుక్కెదురైంది. బాలినేని దాఖలు చేసిన పిల్‌పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో.. పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గత ఎన్నికల సమయంలో ఒంగోలులో 12 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అవకతవక జరిగాయంటూ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పట్లో పిల్‌ వేశారు. ఈ క్రమంలో.. హైకోర్టు ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. ఈవీఎంల వ్యవహారంపై ఆగస్టు 13వ తేదీన హైకోర్టులో పిల్ వేశారు బాలినేని. అంతేకాకుండా.. ఆ పిల్‌పై ఆగస్టు 15వ తేదీన బాలినేని తరుపున న్యాయవాది ఆలపాటి వివేకానంద వాదనలు వినిపించారు. ఆ తర్వాత.. ఆగస్టు 17వ తేదీన తీర్పును రిజర్వు చేసింది ఏపీ హైకోర్టు. తాజాగా.. తుది తీర్పును న్యాయస్థానం వెలువరించింది. కాగా.. గతంలో వైసీపీలో ఉన్న మాజీమంత్రి బాలినేని.. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వైజాగ్ వెళ్లిన విమానానికి బాంబు బెదిరింపు..

ఇటీవలే కాలంలో దేశ వ్యాప్తంగా విమానాల్లో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్న సంగతి తెలిసిందే.. అయితే.. వెంటనే అప్రమత్తమై చూస్తే అంతా ఫేక్ అని తేలిపోతుంది. ఈ క్రమంలో.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం జరుగుతోందన్నారు. బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. విచారణ తరువాత బాంబు బెదిరింపులు తప్పుడు ప్రచారం వెనుక ఎవరున్నారనే దానిపై స్పష్టత వస్తుందని వివరించారు. అయినప్పటికీ.. విమానాల్లో బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు.

ఇది ఆత్మహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య

హైడ్రా కూల్చివేతల భయం కారణంగా కూకట్ పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అర్థం, పర్థం లేకుండా ఆనాలోచితంగా గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు కూకట్ పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారని ఆయన ఆరోపించారు. హైడ్రా అనే బ్లాక్ మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పి…నోటీసులు ఇవ్వకుండానే మీ ఇళ్లు కూలగొడుతామంటూ భయానక వాతావారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని, పిల్లలు పుస్తకాలను తీసుకుంటామంటే కూడా తీసుకొనివ్వకుండా పేదల ఇళ్లు కూలగొడుతున్నారన్నారు.

ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ పథకానికి సబ్సిడీ నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒకటి దీపం పథకం. ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకమే దీపం పథకం. దీపావళి నుంచి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనుంది. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులనే దానిపై వివరాలను సైతం పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల వెల్లడించారు. కాగా తాజాగా.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సబ్సిడీ నిధులు విడుదల చేసింది. లబ్దిదారులకు ఇవ్వాల్సిన ఒక సిలిండర్ సబ్సిడీ మొత్తం రూ.895 కోట్లను విడుదలకు పాలనానుమతి ఇచ్చింది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబరు 31 తేదీన ఒక ఉచిత సిలిండర్‌ను ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వనుంది.

రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతాం..

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో అధికార యంత్రాంగంతో చర్చించామన్నారు. రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతామని తెలిపారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయడంతో పాటు జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం కలిపి ముందుకు తీసుకు వెళ్తామని పేర్కొన్నారు. మరోవైపు.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో జిల్లాలో ఏడు లక్షల మంది లబ్ధి పొందుతారు.. ఉచిత గ్యాస్ పథకం సమాచారాన్ని ఆయా కంపెనీలు లబ్ధి దారులకు సమాచారం ఇస్తారని అన్నారు. నవంబర్ 1 నుండి మార్చి 31 వరకు ఉచిత సిలిండర్ ఉపయోగించుకోవచ్చని మంత్రి అన్నారు.

ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక ఆయిల్ ఫెడ్ కేంద్రం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లి తన నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించి.. మలేషియా టూర్ పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఆయిల్ ఫామ్ పెద్ద ఎత్తున సాగుచేయడం కోసం మన రాష్ట్రం లో 31 జిల్లాలకు అనుమతులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ తో పాటుగా 14 ప్రయివేటు కంపెనీలు పామాయిల్ విస్తరణ కు ముందుకొచ్చాయని, ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక ఆయిల్ ఫెడ్ కేంద్రం ఉంటుందన్నారు. ఏడాదికి లక్ష ఎకరాల లక్ష్యం ఉంది కాని ముందుకు వెళ్లడం లేదని, రాష్ట్రంలో 80 శాతం చిన్న సన్నకారు రైతులున్నారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. పామాయిల్ సాగులో అంతర పంటలకు సైతం సబ్సిడీ ఇస్తామని, మలేషియా లో అంతర పంటలు లేవని, గుట్టల పైనే సాగు చేస్తున్నారన్నారు. పొట్టి విత్తనం, మిషన్ లు పరిశీలన కు వెళ్లామని, ఫైబర్ గెడలు సౌకర్యంగా ఉన్నాయన్నారు. సబ్సిడీ తో గెడలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, మనకంటే మెరుగైన పద్ధతులు అన్వేషించాం కానీ ఆశించినంతగా లేవని ఆయన వ్యాఖ్యానించారు. పామాయిల్ వ్యర్ధాలతో వస్తువుల తయారీ యూనిట్ లు పెట్టుకోమని మలేషియా వారిని ఆడిగామని, 70 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే దిగుమతి అవసరం లేదన్నారు మంత్రి తుమ్మల.

అభిమాన నేతకు పేద విద్యార్ధిని తీపి జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన సీఎం

కొందరు నాయకులను ఆదర్శంగా తీసుకుని తమ అభిమానాన్ని చాటుతుంటారు జనాలు. తమకు నచ్చిన స్టార్ హీరోలు, క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు ఇలా వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తుంటారు. మనం వార్తల్లో చూస్తూనే ఉంటారు.. కొందరు హీరోల కోసం, క్రికెటర్ల కోసం అభిమానులు ఎక్కడి నుండో వచ్చి వారి అభిమానాన్ని చాటుతారు. ఇలా రాజకీయ నాయకులపై కూడా అభిమానం చాటే వ్యక్తులు కూడా ఉంటారు. తాజాగా.. ఓ విద్యార్థిని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన అభిమానాన్ని చాటింది.

తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. తన స్వహస్తాలతో గీసిన చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో ఆయన ఆనందంతో మురిసిపోయారు. ‘‘సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్ధి ఇచ్చే చిరుజ్ఞాపిక’ అంటూ చిత్రంపై రాసింది. ఇది చూసి ముగ్దుడైన చంద్రబాబు లాస్యను అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపు లేనట్లే

ఏ కేటగిరిలోనూ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగా రావు వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని, అన్ని పిటిషన్ ల పై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించిందన్నారు. 40రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నామని, విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదని, స్థిర చార్జీలు రూ.10 యాదాతదం గా ఉంటుందన్నారు శ్రీరంగా రావు. పౌల్ట్రీ ఫామ్ , గోట్ ఫామ్ లను కమిషన్ ఆమోదించలేదని, HT కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశామని ఆయన తెలిపారు. 132kva, 133kva, 11kvలలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయని, లిఫ్ట్ ఇరిగేషన్ కు కమిషన్ ఆమోదించిందన్నారు.