NTV Telugu Site icon

Today (28-12-22) Stock Market Roundup: రెండు రోజుల లాభాలకు బ్రేక్‌.. ఇవాళ షాక్‌..

Today (28 12 22) Stock Market Roundup

Today (28 12 22) Stock Market Roundup

Today (28-12-22) Stock Market Roundup: ఈ వారంలో వరుసగా రెండు రోజులు.. సోమవారం.. మంగళవారం.. లాభాల బాటలో పయనించిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ బుధవారం ఊగిసలాట ధోరణి ప్రదర్శించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ట్రేడింగ్‌ స్వల్ప నష్టాలతో ప్రారంభమై చివరికి స్వల్ప నష్టాలతో ముగిసింది.

ఎర్లీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 60 వేల 714 పాయింట్లకు పడిపోయింది. మళ్లీ.. ఆటోమొబైల్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ మరియు ఎనర్జీ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించటంతో 361 పాయింట్లు పెరిగి 61 వేల 75 పాయింట్లకు చేరింది. మొత్తానికి 17 పాయింట్లు నష్టపోయి 60 వేల 910 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది.

సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో టైటాన్‌ సంస్థ స్టాక్స్‌ సుమారు మూడు శాతం పెరిగాయి. మహింద్రా అండ్‌ మహింద్రా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, మారుతి సంస్థల స్టాక్స్‌ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే రాణించాయి. ఒకటి నుంచి 2 శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో పాలీప్లెక్స్‌ కార్పొరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ స్టాక్స్‌ భారీగా నష్టపోయాయి.

read also: Healthy Foods for Winter : చలికాలంలో యాక్టివ్ గా ఉండాలంటే ఇవి తినాల్సిందే …

సీఈ ఇన్ఫో సిస్టమ్‌, జీఈ షిప్పింగ్‌, త్రివేణి టర్బిన్‌ షేర్లు కూడా పడిపోయాయి. నిఫ్టీ 22 పాయింట్లు తగ్గి 18 వేల 110 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీలో పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల ఇండెక్స్‌ 11 శాతం పెరిగింది. యూపీఎల్‌ కంపెనీ షేర్లు లాభాలు పొందినవాటిలో ముందు వరుసలో ఉన్నాయి.

ఎయిర్‌టెల్‌, అపోలో హాస్పిటల్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ స్టాక్స్‌ బాగా దెబ్బతిన్నాయి. రంగాల వారీగా చూస్తే.. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ ఇండెక్స్‌ దాదాపు ఒకటిన్నర శాతం పెరిగింది. పవర్‌ అండ్‌ ఎనర్జీ సెక్టార్ల సూచీలు కూడా సుమారు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి.

వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు రెండు శాతానికి పైగా ప్రాఫిట్స్‌ను నమోదు చేశాయి. షేర్‌ బైబ్యాక్‌పై యాజమాన్యం యోచిస్తున్నట్లు వార్తలు వెలువడటం ఆ సంస్థకు కలిసొచ్చింది.

10 గ్రాముల బంగారం రేటు 322 రూపాయలు తగ్గిపోయింది. గరిష్టంగా 54 వేల 675 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి ధర 716 రూపాయలు మైనస్‌ అయింది. ఫలితంగా 69 వేల 85 రూపాయల వద్ద ముగిసింది. రూపాయి విలువ 7 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 72 పైసల వద్ద స్థిరపడింది.