West Bengal: బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన అఖండ విజయం కోల్కతాలో సంచలనం సృష్టించింది. ఈ అంశంపై శుక్రవారం మోడీ మాట్లాడుతూ.. నెక్ట్స్ టార్గెట్ బెంగాల్ అని తెలిపారు. అడవి రాజ్యాన్ని కూల్చివేసినట్లు ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కోల్కతా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెడు వార్త వచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశ్యం లేదని టీఎంసీ వర్గాలు ఓ జాతీయ మీడియా సంస్థకు తెలిపినట్లు సమాచారం. తమకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని వారు స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది! మమతా బెనర్జీ 2026 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తారని టీఎంసీ స్పష్టమైన సంకేతాలు కనబరుస్తుంది.
READ MORE: జీరో కమిషన్ మోడల్ అందిస్తున్నట్టు ప్రకటించిన ఫ్లిప్కార్ట్
నిజానికి, జాతీయ స్థాయిలో మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఎప్పుడూ కలవరపెడుతోంది. సోనియా గాంధీతో మమతా బెనర్జీ మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండగా.. అధిర్ చౌదరి, అబ్దుల్ మన్నన్ నేతృత్వంలోని బెంగాల్ కాంగ్రెస్ వర్గం.. మమతపై విమర్శలకు దిగేది. తృణమూల్ తమ నాయకులను దూరం చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వర్గం ఎప్పుడూ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి తృణమూల్ ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. నిజానికి తృణమూల్తో పొత్తు పెట్టుకోవడానికి అధిర్ రంజన్ చౌదరి మొదట్లో సానుకూలంగా లేరు, వామపక్షాలతో కలిసి వెళ్లాలని భావించారు. గతంలోనే కాంగ్రెస్, టీఎంసీ చేతులు కలిపారు. ఈ రెండు పార్టీలు గతంలో 2001 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, 2009 లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. ముఖ్యంగా 2011లో టీఎంసీ, కాంగ్రెస్ కూటమి.. బెంగాల్లో 34 సంవత్సరాల తర్వాత సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి దారితీసింది. 2019 లోక్సభ ఎన్నికలు, 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పార్టీల పనితీరు ఆధారంగా సీట్ల షేరింగ్ ఫార్ములా ఉండాలని మమతా బెనర్జీ కోరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు శాతం కంటే తక్కువ ఓట్లను సాధించిందని, ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని తృణమూల్ పేర్కొంది. కాంగ్రెస్ “పెద్దన్న” అధికారాన్ని విడనాడాలని, ప్రాంతీయ పార్టీలు తమ బలమైన స్థానాల్లో ఎన్నికలను ఎదుర్కోవాలని టీఎంసీ అధిష్టానం ప్రతిపాదించింది. తాజాగా పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
