NTV Telugu Site icon

BBC Documentary on Modi: యూనివర్సిటీల్లో బీబీసీ డాక్యుమెంటరీ రగడ..

Bbc On Modi

Bbc On Modi

TISS students to screen BBC documentary on PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదం అయింది. భారత ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీని బ్లాక్ చేసింది. భారత ప్రభుత్వం దీన్ని వలసవాద మనస్తత్వంగా అభివర్ణించింది. ఈ డాక్యుమెంటరీ ఇటు ఇండియాతో పాటు యూకేలో కూడా చర్చనీయాంశం అయింది. అయితే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్యూ) ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించడం ఉద్రిక్తతలకు దారి తీసింది.

జెఎన్యూలో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించవద్దని అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీచేసింది. స్క్రీనింగ్ సమయంలో కరెంట్ సరఫరాను నిలిపివేసింది. అయినా కూడా విద్యార్థులు ల్యాప్ టాప్, సెల్ ఫోన్లలో డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్న సమయంలో రాళ్లదాడి చోటు చేసుకుంది. వామపక్ష విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ తమపై ఏబీవీపీ దాడికి పాల్పడిందంటూ ఆందోళన నిర్వహించాయి. సమీపంలో వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.

Read Also: Republic Day 2023: ఇది సంక్షేమ ప్రభుత్వం.. 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించని గవర్నర్‌..!

ఇదిలా ఉంటే వీరికి సంఘీభావంగా ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని ప్రొగ్రెసివ్ స్టూడెంట్స్ ఫోరమ్(పీఎస్ఎఫ్) యోచిస్తోంది. విద్యార్థి ఐక్యమత్యాన్ని చాటేందుకు దీన్ని ప్రదర్శిస్తామని విద్యార్థులు తెలిపారు. అయితే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఇందుకు అనుమతి ఇవ్వమని తెలిపింది. శనివారం ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు సిద్ధం అయ్యారు. వర్సిటీ విద్యార్థులు అంతా ఈ డాక్యమెంటరీని చూడాలని పీఎస్ఎఫ్ ట్వీట్ చేసింది.

అంతకుముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఈ డాక్యుమెంటరీని స్క్రీనింగ్ చేయడం వివాదాస్పదం అయింది. 2002 గుజరాత్ మతకలహాల నేపథ్యంలో బీబీసీ దీన్ని రూపొందించింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో రెండు భాగాలుగా డాక్యుమెంటరీని రూపొందించింది.