భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామ సమీపంలోని రిజర్వాయర్ వద్ద బుధవారం తన మూడు పిల్లలతో ఒక పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక ట్రక్ డ్రైవర్ పులిని వీడియో తీసి షేర్ చేయడంతో అది నెట్టింట వైరల్గా మారింది. పెంగంగా నది మీదుగా నిర్మాణంలో ఉన్న చనకా-కొరాట నీటిపారుదల ప్రాజెక్టు పంప్ హౌస్ సమీపంలో, వ్యవసాయ పొలాల్లో, మండలంలోని వివిధ ప్రాంతాల్లో అటవీ శివారు ప్రాంతాల్లో తాము కూడా పులి కనిపించిందని స్థానికులు తెలిపారు. అటవీ అధికారులు పులుల పగ్మార్క్లను నమోదు చేశారు. అంతేకాకుండా.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దులోని యవత్మాల్ జిల్లాలోని తిపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం (టిడబ్ల్యుఎస్)లో నివసిస్తున్న ఒక పులి దాని మూడు పిల్లలతో ఆదిలాబాద్ అటవీ శివారుప్రాంతంలో సంచరిస్తోందని అధికారులు తెలిపారు.
Also Read : YS Jagan Mohan Reddy: పొత్తులపై వైఎస్ జగన్ క్లారిటీ.. వారితో మాత్రమే..
అయితే.. వాటికి భద్రత కల్పించడంతోపాటు మానవ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నాలుగు యానిమల్ ట్రాకర్లు, 10 మంది బేస్ క్యాంప్ వాచర్లు, ఒక ర్యాపిడ్ రెస్క్యూ టీమ్, ముగ్గురు టాస్క్ఫోర్స్ సిబ్బంది, డిపార్ట్మెంట్ సిబ్బంది వాటి కదలికలను ట్రాక్ చేయడానికి మోహరించారు.
వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ (WCS), వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ (WWF) వంటి ప్రభుత్వేతర సంస్థల వాలంటీర్లు కూడా ఈ ఆపరేషన్లో భాగమయ్యారు. అయితే భీంపూర్ మండలంలోని తంసి (కె), గొల్లఘాట్, పిప్పల్కోట్, నిప్పాని, గుంజల, అర్లి (టి), ధనోర, గుబిడి, కరంజితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన వాసులు, రైతులకు పులితో పాటు దాని పిల్లలు కనిపించడం భయాందోళనకు గురవుతున్నారు.