అతి వేగం ప్రమాదకరం… అనే మాటలు దాదాపు ప్రతి హైవే మీద చదువుతాం. ఎందుకంటే వేగంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి గురికావడం కంటే తక్కువ వేగంతో సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ఉత్తమం. ఇది ఆ పదబంధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కానీ, కొందరు వాహనదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోరు. దాంతో భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఇందుకు నిదర్శనంగా జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
READ MORE: GlocalMe PetPhone: మనుషులకే కాదు.. ఇకపై పెంపుడు జంతువులకూ ఫోన్
పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఎగ్జిట్ 13 వద్ద రాములు అనే వ్యక్తి వాటర్ ట్యాంకర్ తో చెట్లకు నీళ్లు పడుతున్నాడు. వెనుకనుంచి వేగంగా వచ్చిన బ్రీజా కారు రాములుతోపాటు ట్యాంకర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నడిపిన వ్యక్తి శేరిలింగంపల్లి చెందిన కృష్ణ రెడ్డిగా గుర్తించారు. పెద్ద అంబర్పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న బ్రీజా కార్.. రావిర్యాల టోల్గేట్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి ట్యాంకర్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు.. కేసు నమోదు చేసుకున్న ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.